విశ్వస్వరూపం (గత సంచిక తరువాయి)
5. ప్రకృతిలో చతుర్విధ బలాల బలాబలాలు
వేమూరి వేంకటేశ్వరరావు
ప్రకృతిలో నాలుగు ప్రాథమిక బలాలు (fundamental forces) ఉన్నాయని ఆధునిక భౌతిక శాస్త్రం చెబుతోంది. భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ అతనికి సహస్ర నామాలు ఎలా ఉన్నాయో అలాగే విశ్వం ఆవిర్భవానికి మూలకారణమైన ఆదిశక్తి ఒక్కటే అయినప్పటికీ అది ఈ నాడు మనకి నాలుగు వివిధ బలాలుగా ద్యోతకమవుతున్నాదని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. ఈ నాలుగూ పరస్పరమూ పొంతన లేకుండా విడివిడిగా ఉన్న నాలుగు విభిన్న బలాలా లేక ఒకే ఆదిశక్తి వివిధ రూపాలలో మనకి కనిపిస్తోందా అన్న సమస్య ఇరవై ఒకటవ శతాబ్దపు సమస్యగా మిగిలింది.
ఈ నాలుగు ప్రాథమిక బలాల పేర్లూ ఇవి: గురుత్వాకర్షణ బలం, విద్యుదయస్కాంత బలం, బృహత్ సంకర్షక బలం (లేదా, త్రాణిక బలం), మరియు లఘు సంకర్షక బలం (లేదా నిస్త్రాణిక బలం). వీటి గురించి ఇప్పుడు కొంచెం సావధానంగా చెబుతాను.
1. గురుత్వాకర్షణ బలం
పదిహేడో శతాబ్దంలోనే నూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని లేవదీశాడు. గురుత్వాకర్షణ బలం (gravitational force) విశ్వవ్యాప్తంగా ఉన్న బలం అని నూటన్ సూత్రీకరించేడు. ఈ గురుత్వాకర్షణ సిద్ధాంతంలో మనం అర్ధం చేసుకోవలసిన అంశాలు రెండు. ఈ విశ్వంలో ప్రతీ వస్తువు ప్రతీ ఇతర వస్తువుని ఆకర్షిస్తోంది అన్నది మొదటి అంశం. రెండు వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ బలం ఆ రెండు వస్తువుల గురుత్వం లేదా గరిమ (mass) మీదా, వాటి మధ్య ఉండే దూరం మీదా ఆధారపడి ఉంటుందన్నది రెండవ అంశం. వస్తువుల గరిమ ఎక్కువ అయిన కొద్దీ వాటి మధ్య ఆకర్షణ పెరుగుతుంది. వస్తువుల మధ్య దూరం పెరిగిన కొద్దీ వాటి మధ్య ఆకర్షణ తరుగుతుంది. నూటన్ ఈ గురుత్వాకర్షణ బలం యొక్క లక్షణాలని సూత్రబద్ధం చెయ్యటమే కాకుండా ఈ సూత్రాలు విశ్వవ్యాప్తంగా అమలులో ఉంటాయని ఉద్ఘాటించేడు.
మన పరిసరాలలో ఉన్న ప్రాథమిక బలాలన్నిటికన్న ఈ గురుత్వాకర్షణ బలం వైనం మనకి ముందుగా అర్ధం అయింది. ఎందుకంటే దీని ప్రభావాన్ని మనం ప్రతిరోజూ అనుభవిస్తున్నాం కనుక.
మన దైనందిన జీవితంలో గురుత్వాకర్షణ “బరువు” (weight) రూపంలో చవి చూసే ఉంటాం. బియ్యపు బస్తాని వీపు మీద వేసుకుని మోసే కూలివాడితో “గురుత్వాకర్షణ చాలా బలహీనమైనది” అంటే వాడు నవ్వి పోతాడు. బస్తా అంత బరువుగా ఉన్నట్లు మనకి ఎందుకు భ్రమ కలిగిస్తుందంటే బస్తాలో ఉన్న ప్రతీ గింజకి, భూమిలో ఉన్న ప్రతి అణువుకి మధ్య ఉండే ఆకర్షణని అతిక్రమించే బలం ఉపయోగిస్తే కాని బస్తా కదలదు. మరొక ఉపమానం చెబుతాను. రెండు ప్రాథమిక రేణువుల మధ్య కూడ గురుత్వాకర్షణ ఉంటుంది; కాని అది ఎంత అత్యల్పం అంటే నేటి వరకు ఆ ఆకర్షక బలాన్ని ఎవ్వరూ గుర్తించి కొలవలేకపోయారు. మరొక సారూప్యం. ఒక ఎలక్ట్రానుకి, ప్రోటానుకి మధ్య ఉండే విద్యుదయస్కాంత బలం కంటె వాటి మధ్య ఉండే గురుత్వాకర్షక బలం 2E39 రెట్లు తక్కువ.
నూటన్ తర్వాత ఇరవైయ్యవ శతాబ్దపు ఆరంభంలో అయిన్స్టయిన్ నూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కొద్దిగా సవరించి మెరుగులు దిద్దేడు. నూటన్ విశ్వంలో ఉన్న ఏ రెండు వస్తువులైనా ఎంత బలంతో ఆకర్షించుకుంటాయో లెక్క కట్టటానికి ఒక సూత్రం ఇచ్చేడు తప్ప ఆ రెండు వస్తువులు ఎందుకు, ఎలా ఆకర్షించుకుంటాయో చెప్పలేదు. అదేదో దైవ దత్తమైన లక్షణంలా ఒదిలేసేడు. అయిన్స్టయిన్ వచ్చి ఈ వెలితిని పూరించేడు. ఒక స్థలకాల సమవాయంలో (spacetime continnum) గరిమ ఉన్న ఒక వస్తువుని ప్రవేశపెట్టినప్పుడు, తలగడ మీద బుర్ర పెట్టినప్పుడు తలగడ లొత్త పడ్డట్లు ఆ స్థలకాల సమవాయం లొత్త పడుతుందనిన్నీ, ఆ లొత్త చుట్టుపట్ల ఉన్న చిన్న చిన్న వస్తువులు ఆ లొత్త లోకి దొర్లినప్పుడు పెద్ద గరిమ గల వస్తువు చిన్న గరిమ గల వస్తువుని ఆకర్షించినట్లు మనకి భ్రాంతి కలుగుతుందనిన్నీ అయిన్స్టయిన్ చెప్పేరు. ఇదే సాధారణ సాపేక్ష సిద్ధాంతం (General Theory of Relativity) చెప్పే ముఖ్యమయిన విషయం.
ఈ రెండు సిద్ధాంతాల మధ్య ఉన్న తేడాని చిన్న ఉదాహరణ ద్వారా వివరిస్తాను. గురుత్వాకర్షణ సూత్రానికి బద్ధమై భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది కదా. ఇప్పుడు అకస్మాత్తుగా మంత్రం వేసినట్లు సూర్యుడు మాయం అయిపోయేడని అనుకుందాం. నూటన్ సిద్ధాంతం ప్రకారం సూర్యుడు ఇక లేడు అన్న విషయం భూమికి తక్షణం “తెలుస్తుంది”; ఎందుకంటే ఆకర్షణ బలం ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణం చెయ్యటానికి పట్టే కాలం “సున్న”. కనుక సూర్యుడు అంతర్ధానమైన వెంటనే భూమి తన గతి తప్పి విశ్వాంతరాళంలోకి ఎగిరిపోతుంది. ఇదే పరిస్థితిలో జరగబోయేదానిని అయిన్స్టయిన్ సిద్ధాంతం మరొక విధంగా చెబుతుంది. సూర్యుడు అంతర్ధానమైపోయాడన్న వార్త భూమి వరకు ఎలా వస్తుంది? గురుత్వాకర్షణ బలం సూర్యుడి నుండి మన వరకు ప్రసరించటం వలన కదా. ఈ బలం మన వరకు ప్రసరించి రాలేదంటే ఇహ అక్కడ సూర్యుడు లేడన్న మాటే కదా. ఈ గురుత్వ బలం కాంతి వేగంతో ప్రయాణం చేస్తుందని అయిన్స్టయిన్ నిరూపించేడు. సూర్యుడి దగ్గర బయలుదేరిన కాంతి మన భూమి వరకు రావటానికి ఉరమరగా ఎనిమిది నిమిషాలు పడుతుంది. కనుక సూర్యుడు అంతర్ధానమైపోయిన తరువాత మరొక ఎనిమిది నిమిషాల వరకు భూమికి ఆ విషయం తెలియదు. తెలిసిన తరువాతనే భూమి తన గతి తప్పి “ఎగిరి” పోతుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే సూర్యుడి నుండి మన వరకు వార్త మోసుకొచ్చినది ఎవరా అంటే అది కాంతి వేగంతో ప్రయాణం చేసే గురుత్వ బలం.
2. విద్యుదయస్కాంత బలం
గురుత్వాకర్షణ బలం తరువాత మన అనుభవ పరిధిలో ఉన్న బలాలలో చెప్పుకో దగ్గది విద్యుదయస్కాంత బలం (electromagnetic force). పందొమ్మిదవ శతాబ్దం మధ్య వరకూ విద్యుత్ తత్వం వేరు, అయస్కాంత తత్వం వేరు అని అనుకునేవారు. ఈ రెండూ వేర్వేరు కాదని క్రమేపీ ఎలా అర్ధం అయిందో చెబుతాను.
పూర్వం పడవలలో సముద్రయానం చేసే రోజులలో పడవ సముద్రంలో ఎక్కడ ఉందో తెలుసుకోటానికి దిక్సూచి అనే పరికరాన్ని వాడేవారు. ఈ దిక్సూచిలో అసిధార (knife edge) మీద విశృంఖలంగా తిరిగే సన్నని అయస్కాంతపు సూది ఒకటి ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ ఉత్తర-దక్షిణ దిక్కులనే సూచిస్తూ ఉంటుంది. అయస్కాంతపు సూదికి ఈ లక్షణం ఎందుకు ఉందో మొదట్లో అర్ధం కాకపోయినా ఈ లక్షణం సముద్రంలో పడవ ఎక్కడ ఉందో తెలుసుకోటానికి ఉపయోగపడింది. కాలక్రమేణా, మన భూగ్రహం కూడ ఒక పెద్ద అయస్కాంతంలా పనిచేస్తుందనీ, దిక్సూచిలో ఉన్న అయస్కాంతపు సూది ఎల్లప్పుడూ భూమి యొక్క అయస్కాంతపు ధ్రువాలవైపే మొగ్గుతుందనీ కనుక్కున్నారు. ఇలా మొగ్గటానికి కారణం అయస్కాంత బలం (magnetic force) అని ఉటంకించేరు.
ఈ అయస్కాంత బలం అయస్కాంతం చుట్టూ ఉన్న ప్రదేశమంతా ఆవహించి ఉంటుంది. ఇలా ప్రదేశం అంతటినీ ఏదైనా ఆవహించి ఉంటే దానిని శాస్త్రీయ పరిభాషలో క్షేత్రం (field) అంటారు. ఉదాహరణకి మడిలో వరి నారు నాటేమనుకుందాం. ఆ నారు మడి అంతటినీ ఆవరించి ఉండదు. నాగేటి చాలు వెంబడి, జానెడేసి దూరంలో ఒకొక్క మొక్క ఉంటుంది. కనుక ఆ నారుమడిని “క్షేత్రం” అనటానికి వీలు లేదు. కాని అదే మడిలో ఉన్న మట్టి మడి అంతటినీ ఆవరించి ఉంటుంది. మట్టి లేని స్థలం అంటూ ఉండదు. కనుక ఆ మడిలో "మట్టి క్షేత్రం" ఉంది, కాని "నారు క్షేత్రం" లేదు. ఒక అయస్కాంతం చుట్టూ ఉండే అయస్కాంతపు బలం ఇలాంటి క్షేత్రమే. కనుక దీనిని "బల క్షేత్రం" (force field), లేదా అయస్కాంత బల క్షేత్రం (magnetic force field), లేదా అయస్కాంత క్షేత్రం (magnetic field) అంటారు.
ప్రకృతిలో మరొక బలం ఉంది. మేఘావృతమైన ఆకాశంలో తళతళా మెరుపులు మెరిసినప్పుడు ఈ బలం మన కళ్లకి కనబడుతుంది. మన ఇళ్లల్లో దీపాలకీ, మరెన్నో నిత్యకృత్యాలకీ వాడుకునే విద్యుత్తు ఈ జాతిదే. విద్యుత్తుని అధ్యయనం చేసే మొదటి రోజులలోనే దీనికీ అయస్కాంత బలానికీ మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉందని తెలిసిపోయింది. నిజానికి ఈ రెండూ విభిన్నమైన బలాలు కావనీ, ఒకే శక్తి యొక్క రెండు విభిన్న రూపాలనీ జేంస్ క్లార్క్ మేక్స్వెల్ సా. శ. 1880 దశకంలో ఉద్ఘాటించి ఈ రెండింటిని విద్యుదయస్కాంత బలం (electromagnetic force) అని పిలవాలని, ఇది కూడ ఒక క్షేత్రమే అనీ సూచించేడు. ఒక నాణేనికి బొమ్మ బొరుసు ఉన్నట్లే ఒకే బలం ఒక కోణం నుండి విద్యుత్ బలం లాగా మరొక కోణం నుండి అయస్కాంత బలం లాగా మనని భ్రమింపచేస్తుందని ఈ సిద్ధాంతం సారాంశం.
విద్యుత్ బలం, అయస్కాంత బలం ఒకటే అని నిరూపించటానికి చిన్న ఉదాహరణ. ఒక రాగి తీగలో విద్యుత్తు ప్రవహిస్తూన్నప్పుడు ఆ తీగ చుట్టూ అయస్కాంతపు లక్షణాలు కనిపిస్తాయి. ఈ విషయాన్నే పరిభాషలో `తీగ చుట్టూ అయస్కాంత క్షేత్రం ప్రభవిస్తుంది’ అంటారు. ఇదే విధంగా రెండు అయస్కాంత ధ్రువాల మధ్య ఉన్న క్షేత్రంలో ఒక రాగి తీగని కదిపితే ఆ తీగలో విద్యుత్తు ప్రవహిస్తుంది. (విద్యుత్ కేంద్రాలలో విద్యుత్తు పుట్టించటానికి ఈ లక్షణమే ఉపయోగపడుతుంది.) ఈ రెండింటిలో ‘ఏది ముందు, ఏది తర్వాత?` అన్నది ‘గుడ్డు ముందా, పిల్ల ముందా?’ అన్న ప్రశ్న లాంటిదే. కనుక విద్యుత్ బలం, అయస్కాంత బలం అని విడివిడిగా అనటంలో అర్ధం లేదు. అందుకనే ఈ ఉమ్మడి బలాన్ని విద్యుదయస్కాంత బలం అనీ, ఈ బలం ప్రభవిల్లే ప్రదేశాన్ని విద్యుదయస్కాంత క్షేత్రం (electromagnetic field) అనీ అంటారు. ఇలా విద్యుత్ తత్వాన్నీ, అయస్కాంత తత్వాన్నీ సమాగమ పరచి ఒక తాటి మీదకి చేర్చిన ఘనత మేక్స్వెల్ కి దక్కింది.
అందరికీ అర్ధం కాకపోయినా, మేక్స్వెల్ సాధించినది గణితపరంగా ఎంత క్లిష్టమైనదో చూపించటానికి మేక్స్వెల్ సిద్ధాంతీకరించిన నాలుగు సమీకరణాలనీ ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఈ సమీకరణాలలో E విద్యుత్ తత్వాన్నీ, B అయస్కాంత తత్వాన్నీ సూచిస్తాయి. ఆఖరి సమీకరణంలో ఒక పక్క విద్యుత్ తత్వమూ, మరొక పక్క అయస్కాంత తత్వమూ ఉన్నాయి – చూడండి. ఈ రెండింటిని సంధానపరచే సందర్భంలో కాంతి వేగం c కూడ ఈ సమీకరణంలో కనిపిస్తుంది. ఈ సమీకరణాన్ని చూసే విద్యుదయస్కాంత బలం కాంతి వేగంతో ప్రయాణం చేస్తుందని మేక్స్వెల్ గ్రహించేడు.
బొమ్మ: మేక్స్వెల్ సమీకరణాలు
బొమ్మ: జేంస్ క్లర్క్ మేక్స్వెల్
విద్యుదయస్కాంత బలం ఎంత శక్తిమంతమైనదో ఊహించుకోటానికి ఉదాహరణగా ఒక స్పురణ ప్రయోగం (thought experiment) చెబుతాను. ఇది ఊహా ప్రయోగం మాత్రమే. రెండు గుండ్రటి ఇనప బంతులని తీసుకుని, వాటిలో ఉన్న ఎలక్ట్రానులన్నిటిని బయటకి తీసేద్దాం. అప్పుడు ఆ రెండు గుళ్లు ధనావేశంతో ఉంటాయి కనుక అవి వికర్షణ పొందుతాయి; అంటే ఒకదాని నుండి మరొకటి దూరంగా జరుగుతాయి. ఈ వికర్షణ బలాన్ని కాని మనం కొలవగలిగితే అది 7E70 టన్నులు ఉంటుంది!
ఇప్పటికి గురుత్వాకర్షణ బలం గురించీ, విద్యుదయస్కాంత బలం గురించీ కొంత అవగాహన వచ్చిందనే అనుకుంటున్నాను.
ఇప్పుడు ఈ రెండు బలాల మధ్య ఉన్న పోలికలనీ, తేడాలనీ కొంచెం పరిశీలిద్దాం. మెదటి పోలిక. ఈ రెండు బలాల ప్రభావం చాల దూరం ప్రసరిస్తుంది. ఎక్కడో లక్షల మైళ్ళ దూరంలో ఉన్న సూర్య చంద్రుల గురుత్వాకర్షణ ప్రభావం వల్లనే కదా సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు ప్రదక్షిణాలు చేస్తున్నాయి. నిజానికి ఈ గురుత్వాకర్షణ బలం ప్రభావం విశ్వంలో దిగద్దంతాల వరకు ప్రసరిస్తూనే ఉంటుంది. ఇదే విధంగా ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ఉన్న మన భూమి యొక్క అయస్కాంత ధ్రువాల ప్రభావం పడవలోని దిక్సూచిలో ఉన్న అయస్కాంతపు సూది మీద పడుతోందని కూడ మనందరికీ తెలుసు. ఇంతటితో పోలిక అయిపోయింది.
ఇక ఈ రెండు బలాల మధ్య ఉన్న తేడాలు. గురుత్వాకర్షణ బలం యొక్క ప్రభావం గురుత్వం ఉన్న ప్రతి వస్తువు మీదా పడుతుంది. ఉదాహరణకి భూమి యొక్క గురుత్వాకర్షణ నా మీద, మీ మీద, చెట్టు మీద ఉన్న పండు మీద, ఆకాశంలో ఉన్న చంద్రుడి మీద, విశ్వాంతరాళంలో పరిభ్రమిస్తూన్న తోకచుక్కల మీద, ఇలా అన్నిటి మీదా పడుతూనే ఉంటుంది. అలా పడ్డ ఆకర్షణ బలానికి ఆయా వస్తువులు యథోచితంగా స్పందిస్తాయి. కాని విద్యుదయస్కాంత బలం ప్రభావం ధన, రుణ ధ్రువాలు ఉన్న అయస్కాంతాల మీదా, ధన, రుణ ఆవేశాలు ఉన్న ప్రోటాను, ఎలక్ట్రాను వంటి పరమాణువుల మీదా మాత్రమే ఉంటుంది. ఉదాహరణకి ఏ విద్యుదావేశం లేని నూట్రానుల మీద విద్యుదయస్కాంత బలం ప్రభావం సున్న. చెవిటి వాడి ముందు శంఖంలా ఏ విద్యుదావేశం లేని పదార్ధాల మీద విద్యుదయస్కాంత బలానికి ఎటువంటి ప్రభావమూ లేదు.
మరొక తేడా. విద్యుదయస్కాంత బలం చాలా శక్తిమంతమైన బలం. గురుత్వాకర్షణ చాలా నీరసమైన బలం. ఈ తేడాని సోదాహరణంగా వివరిస్తాను. ఒక గుండు సూదిని చేతిలోంచి జార విడిస్తే భూమి యొక్క గురుత్వాకర్షణ బలానికి అది భూమి మీద పడుతుంది. ఉరమరగా 25,000 మైళ్లు వ్యాసం ఉన్న ఒక ఇనుము-రాయి తో చేసిన బంతి తన గరిమ పుట్టించే బలాన్ని అంతటినీ కూడగట్టుకుని లాగితే సూది భూమి మీద పడింది. అదే సూదిని పైకి లేవనెత్తటానికి (అంటే గురుత్వాకర్షణ బలాన్ని అధిగమించటానికి) వేలెడంత పొడుగున్న చిన్న అయస్కాంతపు కడ్డీ చాలు. ఈ చిన్న ప్రయోగం తో గురుత్వాకర్షణ బలం కంటె విద్యుదయస్కాంత బలం ఎంత శక్తిమంతమైనదో అర్ధం అవుతుంది. గురుత్వాకర్షణ ఎంత నీరస మైనదో మరొక విధంగా కూడ చెబుతాను. విద్యుదయస్కాంత బలం గురుత్వాకర్షణ బలం కంటె మిలియన్ బిలియన్ బిలియన్ బిలియన్ బిలియన్ (10E42) రెట్లు బలమైనది.
మరొక తేడా. మేక్స్వెల్ ప్రవచించిన నాలుగు విద్యుదయస్కాంత సూత్రాలని స్థూల ప్రపంచం లోనే కాకుండా అణుగర్భపు లోతుల్లో ఉన్న సూక్ష్మాతి సూక్ష్మ ప్రపంచానికి కూడ అనువర్తింపచెయ్య వచ్చు. ఇలా అణుగర్భంలో అనువర్తించే ఏ ప్రక్రియ పేరుకైనా సరే ‘క్వాంటం’ అనే విశేషణం వాడతారు కనుక ఇలా అణుగర్భానికి అనువర్తింపచేసిన విద్యుదయస్కాంత శాస్త్రాన్ని ఇంగ్లీషులో ‘క్వాంటం ఎలక్ట్రో డైనమిక్స్’ (Quantum Electro Dynamics or QED) అంటారు. ఈ QED ఆధునిక భౌతిక శాస్త్రం నిర్మించిన సిద్ధాంత సౌధాలన్నిటిలోకీ ఎంతో రమ్యమైనదీ, బాగా విజయవంతం అయినదీను. కాని, ఇదే విధంగా గురుత్వాకర్షణ సూత్రాలని కూడా అణుగర్భంలోని సూక్ష్మ ప్రపంచానికి ఎలా అనువర్తింప చెయ్యాలో (quantization of gravitational field) ఇంకా ఎవ్వరికీ బోధ పడ లేదు. అంటే అణుగర్భంలో గురుత్వాకర్షణ సూత్రాలు ఎలా పని చేస్తాయో ఇంకా ఎవ్వరికీ అంతు పట్ట లేదు. ఈ ఇబ్బందికి కొంతవరకు కారణం ఊహించవచ్చు. గురుత్వాకర్షణ స్వతహాగా చాల నీరసమైన బలం. పెద్ద పెద్ద వస్తువుల సమక్షంలో తప్ప ఈ బల ప్రదర్శన అనుభవం లోకి రాదు. అణుగర్భంలో ఉన్న పరమాణు రేణువుల సమక్షంలో ఉండే గురుత్వాకర్షణ అతి స్వల్పం; అందుచేత కొలవటం కూడ కష్టమే. టూకీగా చెప్పాలంటే విద్యుదయస్కాంత సూత్రాలనీ, గురుత్వాకర్షణ సూత్రాలనీ అనుసంధించి ఒకే ఉమ్మడి సూత్రంతో రెండింటిని వర్ణించటం ఇంకా సాధ్య పడ లేదు.
పైన చెప్పిన ప్రాథమిక బలాలతో పాటు మరో రెండు ప్రాథమిక బలాలు ఉన్నాయని ఇరవైయవ శతాబ్దంలో అవగాహన అయింది. ఈ రెండు బలాలూ మన దైనందిన జీవితాలలో తారస పడవు కనుక ఈ అవగాహన ఇంత ఆలశ్యంగా అయింది.
3. లఘు సంకర్షక బలం లేదా నిస్త్రాణిక బలం
సా. శ. 1896 లో హెన్రీ బెక్విరల్ రేడియో ధార్మిక క్షీణత (radioactive decay) అనే ప్రకృతి లక్షణాన్ని గమనించేడు. కొన్ని పదార్ధాలలోని అణుకేంద్రాలు (nuclei) బయటి బలాల ప్రమేయం ఏమీ లేకుండా తమంత తామే శిధిలమై పోయి ప్రోటానులు, ఎలక్ట్రానులు, నూట్రానులు గా కేంద్రం నుండి బయటికి ఉద్గారించబడతాయని ఆయన గమనించేడు.
సా. శ. 1896 లో హెన్రీ బెక్విరల్ రేడియో ధార్మిక క్షీణత (radioactive decay) అనే ప్రకృతి లక్షణాన్ని గమనించేడు. కొన్ని పదార్ధాలలోని అణుకేంద్రాలలో ఉన్న కణికలు బయటి బలాల ప్రమేయం ఏమీ లేకుండా తమంత తామే శిధిలమై పోయి ప్రోటానులు, ఎలక్ట్రానులు, నూట్రానులు గా కేంద్రం నుండి బయటికి ఉద్గారించబడతాయని ఆయన గమనించేడు. మరొక బలం ప్రమేయం లేకుండా ఏదీ తనంత తాను మార్పు చెందదని నూటన్ ఎప్పుడో చెప్పేడు కదా. కనుక ఈ మార్పుకి ప్రేరణ కారణమైన బలం ఏదో అణుగర్భంలోనే దాగి ఉందని ఊహించి, దాని ఆచూకీ కనిపెట్టి, దానికి లఘు సంకర్షక బలం (weak interaction force or weak force or weak nuclear force) లేదా నిస్త్రాణిక బలం అని పేరు పెట్టేరు. ఇది ఉరమరగా విద్యుదయస్కాంత బలంలో వెయ్యో వంతు ఉంటుందని అంచనా.
“బీటా క్షీణత” (Beta decay) రేడియోధార్మిక క్షీణతకి ఒక ఉదాహరణ. ఈ బీటా క్షీణత లో ఒక అణు కేంద్రకం ఎవ్వరి ప్రమేయం లేకుండా, దానంతట అదే విచ్ఛిన్నం అయిపోయి, ఆ సందర్భంలో ఒక ఎలక్ట్రానుని, ఒక ఏంటీనూట్రినో (anti-neutrino) ని విడుదల చేస్తుంది. ఎక్కడో అణుగర్భంలో జరిగే ఈ తతంగం “బియ్యపు బస్తా”లా మన జీవితాలని తాకకపోవచ్చు. కాని ఈ ప్రక్రియ సహాయం లేకుండా సూర్యుడిలో శక్తి ఉద్భవించే ప్రక్రియలు సాధ్యం కావు. ఒక్క నిస్త్రాణిక బలం తప్ప మరే ఇతర బలమూ ఈ నూట్రినోల మీద ప్రభావం చూపలేవు. అందుకని ఈ నిస్త్రాణిక సంకర్షణలని అధ్యయనం చెయ్యటం ముఖ్యాంశం అయి కూర్చుంది. మన దైనందిన జీవితంలో ఈ నిస్త్రాణిక సంకర్షణ తారస పడదు. ఎందుకంటే దీని ప్రభావం అణుగర్భం దాటి బయట కనిపించదు.
4. బృహత్ సంకర్షక బలం లేదా త్రాణిక బలం
ఇదే సందర్భంలో అణు గర్భంలో దాగి ఉన్న మరొక బలం యొక్క ఉనికిని కూడ కనుక్కున్నారు. దీనిని బృహత్ సంకర్షక బలం (strong interaction force or strong force or strong nuclear force) లేదా త్రాణిక బలం అంటారు. అణుగర్భంలో ఒక కణిక (nucleus) ఉంటుంది. దీని ఆకారాన్ని మన బూందీ లడ్డులా ఊహించుకోవచ్చు. బూందీ లడ్డులో చిన్న చిన్న పూసలు ఉంటాయి కదా. వీటిలో కొన్ని పచ్చవి, కొన్ని నల్లవి అనుకుందాం. పచ్చ వాటిని ప్రోటానులు గానూ, నల్ల వాటిని నూట్రానులు గానూ ఊహించుకుందాం. ఈ ప్రోటానులకి ధన విద్యుదావేశం ఉంటుంది. కనుక వాటి మధ్య వికర్షణ (repulsion) వల్ల ఇవి ఒకదాని పక్క మరొకటి ఉండలేవు. ఈ వికర్షణ బలానికి అవి నిజంగా చెల్లా చెదిరి పోవాలి. కాని అవన్నీ ఉండ కట్టుకుని ఎలా ఉండగలిగేయి? లడ్డుండలో అయితే ఉండ చితికి పోకుండా పాకం వాటిని బంధించి అట్టేపెడుతుంది. అణుగర్భంలో ఉన్న ప్రోటానులు చెదిరి పోకుండా వాటి మధ్య కూడ మన పాకబంధ బలం లాంటి బలం ఒకటి ఉంది. అదే బృహత్ సంకర్షక బలం. (క్వార్కుల ప్రస్తావన తీసుకు రాకుండా ఇక్కడ సిద్ధాంతాన్ని కొంచెం టూకీ చేసేను.) ఈ బృహత్ బలం యొక్క ప్రభావం అణుగర్భపు పరిధి దాటి బయట కనిపించదు. కనుక దీని నైజం అర్ధం చేసుకోవాలంటే క్వాంటం సూత్రాలని ఉపయోగించాలి. ఇది ఉరమరగా విద్యుదయస్కాంత బలం కంటె వంద రెట్లు ఉంటుందని అంచనా.
5. బాహిరంగా ఈ నాలుగు బలాల మధ్యా తేడాలు
ఇంతటితో నాలుగు ప్రాథమిక బలాలనీ పరిచయం చెయ్యటం పూర్తి అయింది. ఈ నాలుగు బలాలూ ఒకే తల్లి అయిన ఆదిశక్తి నుండి ఉద్భవించేయని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు, కాని స్థూల దృష్టికి ఆస్తులు పంచేసుకున్న అన్నదమ్ములలా ఈ నాలుగు ప్రకృతి బలాలు ఎవరి దారి వారిదే అన్నట్లు ప్రవర్తిస్తున్నాయి తప్ప ఒకే తల్లి పిల్లలలా ప్రవర్తించటం లేదు.
ఉదాహరణకి, గురుత్వాకర్షణ బలం తన ప్రభావాన్ని గురుత్వం ఉన్న పదార్ధాల మీదే చూపిస్తుంది. విద్యుదయస్కాంత బలం యొక్క ప్రభావం ఆవేశపూరితమైన (charged) పదార్ధాలమీదే. బృహత్ బలం ప్రభావం అంతా ఒక్క హాడ్రాన్ జాతి (ఉ. ప్రోటానులు, నూట్రానులు) కణాల మీదే కాని లెప్టాన్ జాతి (ఉ. ఎలక్ట్రానులు, నూట్రినోలు) మీద కాదు. లఘు బలం ప్రభావ పరిమితి ఇంకా బాగా పరిమితం (ఉ. బీటా విచ్ఛిన్న కార్యక్రమం సందర్భంలో).
అంతే కాకుండా ఈయీ బలాల ప్రభావ పరిధి కూడ విభిన్నమే. గురుత్వాకర్షణ బలం, విద్యుదయస్కాంత బలాల ప్రభావం చాల దూరం ప్రసరిస్తుందని చెప్పేను కదా. దూరం వెళుతూన్న కొద్దీ వీటి ప్రభావం తగ్గుతుంది కాని, మరీ అంత జోరుగా తగ్గదు. లఘు బలం, బృహత్ బలాల ప్రభావం అణు కేంద్రానికి పరిమితం; బయటికి రాగానే వాటి ప్రభావం ఏష్యం అయిపోతుంది. ఉదాహరణకి రెండు ప్రోటానులని దగ్గర దగ్గరగా, ఒక మిల్లీమీటరు దూరంలో పెట్టినా వాటి మీద బృహత్ బలం ప్రభావం కనిపించదు; కాని విపరీతమైన పీడనంతో వాటిని దగ్గరికి తొయ్యగలిగితే అప్పుడు ఇవి ఈ బృహత్ బలం ప్రభావానికి గురి అయి అతుక్కుపోతాయి. అంతేగాని సాధారణ పరిస్థితులలో అవే ప్రోటానులు వికర్షణ బలాల ప్రభావం వల్ల దూరంగా జరిగి పోతాయి. అణు కేంద్రానికి బయట విద్యుదయస్కాంత బలం ఎంతో బలవంతమైనది అయితే అణు కేంద్రపు పరిధిలో బృహత్ బలం అత్యంత బలవత్తరమైనది; ఈ బలం ముందు విద్యుదయస్కాంత బలం వెలవెల పోతుంది.
ఈ నాలుగు బలాల బలాబలాలు “తూకం” వేసి తూచేమనుకుందాం. అప్పుడు గురుత్వ బలం విలువ 1 (ఒకటి) అనుకుంటే, నిస్త్రాణిక బలం విలువ 10E25 ఉంటుంది. విద్యుదయస్కాంత బలం విలువ 10E36 ఉంటుంది. త్రాణిక బలం విలువ 10E38 ఉంటుంది.
బాహ్య లక్షణాలలో ఈ నాలుగు బలాల మధ్యా ఇంతింత తేడాలు ఉన్నా ఈ నాలుగు బలాలు ఒకే తల్లి నుండి పుట్టుంటాయని శాస్త్రవేత్తల నమ్మకం. విశ్వం ఆవిర్భవించినప్పుడే ఆ తల్లికి (ఆదిశక్తి?) కి ఈ నాలుగు పిల్ల బలాలూ పుట్టి ఉంటాయనిన్నీ ఆ పుట్టుక సమయంలో జంట కవలలా ఈ నాలుగు బలాల రూపు రేఖలూ (అంటే అవి ప్రదర్శించే బలం, వాటి ప్రభావ పరిధి, వాటి సంకర్షక లక్షణాలు) ఒకేలా ఉండేవనీ, కాలక్రమేణా ఈ నాలుగు బలాలూ వేటి దారి అవి చూసుకోవటంతో మనకి అవి నాలుగు భిన్నమైన భంగిమలలో కనిపిస్తున్నాయనీ శాస్త్రవేత్తల నమ్మకం. ఈ నమ్మకాన్ని ఆధారం చేసుకుని అంచెలంచెలుగా ప్రగతి పథంలోకి పయనం ఎలా జరుగుతోందో చెబుతాను.
6. ఈ నాలుగు బలాలనీ సంఘటిత పరచటానికి ప్రయత్నం
ఈ విషయాన్ని మరొక అధ్యాయంలో మరికొంచెం లోతుగా తరచి చూద్దాం. ప్రస్తుతానికి కథని టూకీగా చెబుతాను. ఇది చదువరులందరికీ అర్ధం అవకపోయినా మరేమీ పరవా లేదు. ఈ నాలుగు బలాలనీ సంఘటిత పరచటానికి జరిగిన ప్రయత్నాలు ఇటీవలనే (అంటే 1960 దశకం నుండి) కొంతవరకు ఫలించాయి.
అయస్కాంత బలాన్నీ విద్యుత్ బలాన్నీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి దానికి విద్యుదయస్కాంత బలం అన్న వాడు మేక్స్వెల్ అని చెప్పేను కదా. తర్వాత అంచె అయిన్స్టయిన్ ప్రవచించిన ప్రత్యేక సాపేక్ష సిద్దాంతం (Special Theory of Relativity) నీ, క్వాంటం సిద్ధాంతాన్నీ విద్యుదయస్కాంత శాస్త్రంతో అనుసంధించటం. ఈ కలయికతో వచ్చినది క్వాంటం ఎలక్ట్రో డైనమిక్స్ (Quantum Electro Dynamics or QED). దీనినే సాపేక్ష్వ క్వాంటం క్షేత్ర సిద్ధాంతం (relativistic quantum field theory) అని కూడ అంటారు. ఈ పద్ధతి బాగా పనిచెయ్యటంతో 1960 దశకంలో ఇదే పద్ధతి ఉపయోగించి విద్యుదయస్కాంత బలం, లఘు సంకర్షక బలం నిజానికి ఒకటే అని స్టీవెన్ వైన్బర్గ్, అబ్దుస్ సలాం విడివిడిగా రుజువు చేసేరు. విద్యుత్ బలం, అయస్కాంత బలం కలిసి విద్యుదయస్కాంత బలం అయినట్లే, విద్యుదయస్కాంత బలాన్నీ, లఘు సంకర్షక బలాన్నీ అనుసంధించగా వచ్చిన దానిని విద్యుత్ లఘు బలం (elctroweak force) అన్నారు వారు. ఇదే పద్ధతిలో విద్యుదయస్కాంత బలాన్నీ బృహత్ బలంతో అనుసంధించగా వచ్చిన బలానికి, న్యాయంగా విద్యుత్ బృహత్ బలం (elctrostrong force) అని పేరు పెట్టాలి; కాని అలా జరగ లేదు – దానికి అర్ధం పర్ధం లేకుండా క్వాంటం క్రోమో డైనమిక్స్ (Quantum Chromo Dynamics or QCD) అని పేరు పెట్టేరు. ఈ దిశలో ఆఖరి అంచెగా విద్యుదయస్కాంత బలాన్నీ, లఘు బలాన్నీ, బృహత్ బలాన్ని అనుసంధించి దానికి ప్రామాణిక నమూనా (Standard Model) అని పేరుపెట్టేరు. ఈ ప్రామాణిక నమూనా లో చిన్న చిన్న లొసుగులు ఉన్నా చాల ఆదరణ పొందింది. ఈ నమూనాలో ఎలక్ట్రానులు, మ్యువానులు (వీటినే పూర్వం మ్యు-మీసానులు అనేవారు), నూట్రినోలు, క్వార్కులు, మొదలైనవి పదార్ధం (matter) కి ముడి సరుకులు. వీటి మధ్య జరిగే సంకర్షణలు విద్యుదయస్కాంత, లఘు, బృహత్ బలాల మధ్యవర్తిత్వంలో జరుగుతాయి. ఇక్కడ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ఈ Standard Model లో గురుత్వాకర్షణ కి పాత్ర లేదు.
ఈ ప్రామాణిక నమూనాలో విద్యుదయస్కాంత క్షేత్రానికి చెందిన ప్రాథమిక రేణువు పేరు ఫోటాను (photon). అంటే విద్యుదయస్కాంత బలాన్ని సూక్ష్మాతి సూక్ష్మమైన మోతాదులుగా విడగొట్టి పొట్లాలు కడితే ఒకొక్క పొట్లాన్ని ఒక ఫోటాను అంటారు. ఇదే విధంగా బృహత్ బలాన్ని చిన్న చిన్న పొట్లాలుగా విడగొట్టగా వచ్చిన పొట్లం పేరు గ్లువాన్ (gluon). ఇదే విధంగా లఘు బలాన్ని పొట్లాలుగా విడగొట్టినప్పుడు రెండు పొట్లాలు వస్తాయి. వాటిని వీక్ గేజ్ బోసానులు (weak gauge bosons అని కాని W and Z bosons అని కాని) అంటారు. గురుత్వాకర్షణని కూడ ఈ సిద్ధాంత హర్మ్యంలో ఇమడ్చ గలిగితే అప్పుడు గురుత్వాకర్షక క్షేత్రానికి చెందిన ప్రాథమిక రేణువు పేరు గ్రేవిటాను (graviton) అవుతుంది.
నూటన్ రోజుల నుండీ వివరణ లేకుండా ఉండి పోయిన ఒక విషయాన్ని ప్రామాణిక నమూనా ఈ కిందివిధంగా వివరిస్తుంది. ఉదాహరణకి ఒక క్షేత్రంలో రెండు వస్తువులు A, B లు ఆకర్షించుకొంటున్నాయని అనుకుందాం. A కి ఆ ప్రాంతాలలో B ఉన్నాదన్న విషయం ఎలా తెలుస్తుంది? ఈ A, B ల మధ్య వాటి ఉనికిని తెలియచెయ్యటానికి వార్తాహరులు ఎవ్వరైనా ఉన్నారా? నూటన్ ఈ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా తప్పించుకున్నాడు. ప్రామాణిక నమూనా ఈ జటిలమైన ప్రశ్నకి ఈ విధంగా సమాధానం చెబుతుంది. మన రెండు వస్తువులు, అనగా A, B లు, ఆ క్షేత్రానికి సంబంధించిన రేణువులతో, పెళ్ళిళ్ళలో వధూవరుల లా, బంతులాట ఆడుతున్నట్లు ఊహించుకోవాలి. ఈ బంతులాట విద్యుదయస్కాంత క్షేత్రంలో జరిగితే అక్కడ బంతి ఫోటాను అన్న మాట. అప్పుడు ఇక్కడ ఆ ఫోటాను ఒక వార్తాహరిగా పనిచేస్తుందన్నమాట. బంతులాట ఆడే మూర్తులలో ఒకరిది (వరుడు) ధన విద్యుదావేశం, మరొకరిది (వధువు) రుణ విద్యుదావేశం అయితే అప్పుడు ఆ బంతులు ఇద్దరిని దగ్గరగా జరగమని సందేశాన్ని ఇస్తాయన్నమాట. ఇద్దరిదీ ఒకే రకం ఆవేశం అయితే ఇద్దరిని దూరంగా జరగమని సందేశాన్ని ఇస్తాయి.
ఈ ప్రామాణిక నమూనాకి బయట ఉండి పోయినది గురుత్వాకర్షణ బలం. ఈ గురుత్వాకర్షణని కూడా మిగిలిన మూడింటితో కలిపి దానిని ఆదిశక్తి అని అభివర్ణించగలిగితే బాగుంటుందని శాస్త్రవేత్తలు కలలు కంటున్నారు. ఆ కలలు ఎప్పుడు నిజం అవుతాయో? ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో? సాటిలేని రీతిగా మదిలో ఎప్పుడు హాయిగా ఉంటుందో? ఈ విషయాలు మరొక వ్యాసంలో!
Friday, December 24, 2010
Tuesday, November 16, 2010
4. గురుత్వాకర్షణ కథ
విశ్వస్వరూపం (గత సంచిక తరువాయి)
4. గురుత్వాకర్షణ కథ
వేమూరి వేంకటేశ్వరరావు
1. చెట్టు నుండి రాలిన పండు
అది సాధారణ శకం, 1666 వ సంవత్సరం. ఇది కల్పితమో, నిజమో తెలియదు కాని, ఎంతో ప్రాచుర్యంలో ఉన్న కథ ఏమిటంటే, ఇంగ్లండులో ఊల్థోర్ప్స్ అనే ఊళ్లో 23 ఏళ్ల యువకుడు ఒకడు చెట్టు పక్క తీనె మీద కూర్చుని చంద్రుడి వైపు చూస్తూ ఉండగా చెట్టు మీద నుండి నేల మీదకి ఏపిల్ పండు ఒకటి పడిందిట.
“చెట్టు నుండి భూమి మీదకి పండు పడ్డట్లే చంద్రుడు భూమి మీదకి ఎందుకు పడిపోవటం లేదు?” అనే చిన్న సందేహం ఆ యువకుడి మెదడులో మొలకెత్తింది. తత్సంబంధమైన విషయాలని అతడు ఎన్నాళ్ల బట్టి ఆలోచిస్తున్నాడో ఏమో కాని, పండుని భూమి మీదకి లాగే బలమూ, చంద్రుడిని భూమి చుట్టూ తిప్పే బలమూ – ఈ రెండింటికి మూల కారణం ఒక్కటే అని అతనికి స్పురించింది. కంటికి కనిపించని ఆ బలానికి గురుత్వాకర్షణ బలం (gravitational force) అని పేరు పెట్టేడు, ఆ యువకుడు. ఆతని పేరు – నూటన్. ఆ రోజులలో ఈ రకం ఆలోచన విప్లవాత్మకమైనదని ఒప్పుకుని తీరాలి. ఎందుచేతనంటే…..
బొమ్మ 1. ఐజక్ నూటన్
నూటన్ కి ముందు 2,000 సంవత్సరాల సంగతి. గ్రీసు దేశంలో ఉన్న తాత్వికులు కూడ చెట్ల నుండి పండ్లు నేల మీదకి రాలటం చూసే ఉంటారు. చూసి, “పండు భూమికి చెందినది. దాని స్వస్థానం భూమి. పండు చెట్టుని వీడగానే, భూమి దానిని ‘ఆకర్షించి’ దాని స్వస్థానానికి చేర్చింది,” అని సంజాయిషీ చెప్పేరు. ఈ రకం ఆలోచన 2,000 ఏళ్లపాటు, మార్పు లేకుండా, “ఏకచ్చత్రాధిపత్యంతో” రాజ్యం ఏలింది – నూటన్ వచ్చే వరకు. నూటన్ వచ్చి ఏమన్నాడంటే, “ఈ రకం ఆకర్షణ ఒక్క భూమి సొత్తే కాదు. భూమికీ, చంద్రుడుకీ మధ్య కూడ ఇదే రకం ఆకర్షణ ఉంది” అన్నాడు. నూటన్ చేసిన ఘనకార్యం ఏమిటంటే ఈ ఆకర్షణ సిద్ధాంతం ఒక్క భూమికే పరిమితం చెయ్యకుండా దానిని విశ్వవ్యాప్తం చేసేడు. విశ్వం (universe) లో గరిమ (mass) ఉన్న ఏ రెండు పదార్ధాల మధ్య అయినా సరే ఈ రకం ఆకర్షణ ఉంటుందనిన్నీ, పైపెచ్చు ఈ ఆకర్షణ పరస్పరం అనిన్నీ నూటన్ ఉద్ఘాటించేడు. ఈ ఆకర్షణ ఉనికిని చెప్పటమే కాకుండా అది ఎంత బలోపేతమైనదో లెక్క కట్టి చూపటానికి వీలుగా ఈ ఆకర్షణ బలాన్ని గణిత సమీకరణం (mathematical equation) రూపంలో సూత్రీకరించేడు. నూటన్ సూత్రీకరించిన ఈ సూత్రం 300 ఏళ్లపాటు నిరాఘాటంగా రాజ్యం ఏలిన తరువాత, ఆ సూత్రానికి చిన్న సవరింపు చేసి, కొన్ని మెరుగులు దిద్ది, అయిన్స్టయిన్ సా. శ. 1915 లో తన సాధారణ సాపేక్ష సిద్ధాంతం (General Theory of Relativity) ప్రవచించేడు.
విశ్వం గురించి ప్రస్తుతం మనకి తెలిసిన విషయాలు ఇవి: సృష్ట్యాదిలో ఒక ప్రచండమైన మహా శక్తి (Primeval energy) నుండి నాలుగు ప్రాధమిక బలాలు (Fundamental Forces) పుట్టుకొచ్చేయి. వాటిల్లో గురుత్వాకర్షణ బలం (Gravitational force) ఒకటి. ఇది మనందరికీ పరిచయం అయినది, అనుభవంలో ఉన్నదీను. కనుకనే దీని ఉనికిని ఎప్పుడో 300 ఏళ్ల కిందటే నూటన్ కనుక్కోగలిగేడు. రెండవది విద్యుదయస్కాంత బలం (Electromagnetic force). అయస్కాంతం ఇనప ముక్కని ఆకర్షించగలుగుతోందంటే దానికి కారణం ఈ విద్యుదయస్కాంత బలమే. ఇది కూడ - కొద్దో, గొప్పో – మన అనుభవ పరిధిలో ఉన్నదే. అందుకనే దీని ఉనికి కూడ – ఫేరడే, మేక్స్వెల్ జంట ధర్మమా అని - తేలికగానే మన అనుభవ పరిధిలోకి వచ్చింది. మిగిలిన రెండింటిలో ఒకదాని పేరు త్రాణిక బలం (Strong force), రెండవదాని పేరు, నిస్త్రాణిక బలం (Weak force). ఈ రెండు బలాలు మన దైనందిన అనుభవాలకి అందుబాటులో లేవు; అణుగర్భంలో ఉన్న రేణువుల మీద మాత్రం ఈ బలాల ప్రభావం ఉంటుంది.
ఆశ్చర్యం ఏమిటంటే ఈ నాలుగు బలాలలో గురుత్వాకర్షణ బలంతో మనకి పురాతనకాలం నుండీ పరిచయం ఉన్నా, ఈ నాలుగు బలాలలో గురుత్వాకర్షణ మొట్టమొదట సూత్రబద్ధం చెయ్యబడ్డా, ఈ బలం గురించి మన అవగాహనలోకి వచ్చినది అతి స్వల్పం. ఈ నాలుగు బలాలూ ఒకే సారి పుట్టుకొచ్చాయనే సిద్ధాంతం ఉన్నప్పటికీ, గురుత్వాకర్షణకీ, మిగిలిన మూడు బలాలకీ మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏమిటో మనకి అవగాహన అయిననాడు విశ్వస్వరూపం కూడ అర్ధం అయినట్లే అని అందరూ అంటున్నారు. సమస్తాన్నీ మన అవగాహనలోకి తీసుకు రాగలిగే ఒకే ఒక సిద్ధాంతం – సమస్త సిద్ధాంతం (Theory of Everything) – కొరకు అహరహం వేట కొనసాగుతూనే ఉంది. ఈ సమస్త సిద్ధాంతాన్నే Grand Unified Theory (GUT) అని ఇంగ్లీషులో కొందరు పిలుస్తున్నారు.
2. గురుత్వాకర్షణ సిద్ధాంతానికి ముందు రోజుల్లో
ఇక్కడ నుండి ముందుకి వెళ్లాలంటే ఇక్కడికి ఎలా వచ్చేమో తెలియాలి కదా. కనుక సమస్త సిద్ధాంతం కొరకు వేట మొదలు పెట్టే ముందు గురుత్వాకర్షణ సిద్ధాంతానికి ఏదారి వెంబడి వచ్చేమో ఒకసారి చూద్దాం.
సాధారణ శకారంభానికి 384 సంవత్సరాల ముందు. అంటే, గౌతమ బుద్ధుడి తరువాత, ఉరమరగా అశోకుడి కాలంలో, గ్రీసు దేశంలో ప్రతిష్టాత్మకమైన ఒక తాత్వికుడు (philosopher) పుట్టేడు. ఆయన పేరు అరిస్టాటిల్ (Aristotle). గురుత్వ బలం ఒక ఆకర్షక బలం (Gravitational force is an attractive force) అనే భావన అరిస్టాటిల్ రోజులలో లేదు. అరిస్టాటిల్ దృష్టిలో ఈ విశ్వం నాలుగు మూలకాలతో నిర్మితమై ఉంది. ఈ నాలుగు మూలకాలలో అన్నిటికంటె బరువైన భూమి ఈ విశ్వానికి కేంద్రం. ఈ భూగోళాన్ని చుట్టుముట్టి జలగోళం (hydrosphere) ఉంది. ఆ జలగోళం చుట్టూ వాయుగోళం (atmosphere) ఉంది. ఆ వాయుగోళానికి అవతల అగ్నిగోళం ఉంది.
బొమ్మ 2. గాలి లోకి విసరిన రాయి గతిపథం (trajectory)
“గాలి లోకి విసరిన రాయి భూమి మీద పడిందంటే ఆ రాయి తన స్వస్థానమైన భూగోళాన్ని చేరుకోటానికి చేసే ప్రయత్నమే. మంటలు మీదకి ఎగియటానికి కారణం మంట తన స్వస్థానమైన అగ్నిగోళాన్ని చేరుకోటానికి చేసే ప్రయత్నమే.” ఇదీ అరిస్టాటిల్ సిద్ధాంతం. ఈ నాడు ఇది మనకి హాస్యాస్పదంగా అనిపించవచ్చు. కాని ఇదే సరి అయిన సిద్ధాంతం అని దరిదాపు 2,000 సంవత్సరాల పాటు ప్రజలు నమ్మేరు. నిలదొక్కుకుపోయిన నమ్మకాలు ఒకంతట పోవు!
సా. శ. 14 వ శతాబ్దం నుండి 17 వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని యూరప్ ఖండంలో నవజాగృతి యుగం (Renaissance period) అని చెప్పుకోవచ్చు. తరతరాలబట్టి పాతుకుపోయి, బూజుపట్టిపోయిన అరిస్టాటిల్ సిద్ధాంతాల పట్టు క్రమేపీ సడలటం మొదలయింది ఈ సంధి యుగం లోనే. ఈ కాలంలో ప్రయోగాత్మకమైన పరిశోధనలకి, గణితపరమైన ఆలోచనలకి పెద్ద పీట పడింది. సూర్యుడు గ్రహాలపై ఒక రకమైన బలం (force) ప్రయోగిస్తున్నాడని జెర్మనీలో కెప్లర్ (Kepler) అనే ఆసామీ ఒక ప్రతిపాదన చేసేడు. ఈ బలం సూర్యుడికీ, గ్రహాలకీ మధ్య ఉన్న దూరం మీద ఆధారపడి ఉంటుందని కూడ ఆయన ఊహాగానం చేసేడు; కాని ఆ బలం యొక్క ప్రమాణం ఎంత ఉంటుందో నిక్కచ్చిగా చెప్పలేదు. ఆ బలం గురించి వివరాలు ఏమీ తెలియకపోయినా సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగే పరిభ్రమణ వేగం ఎంతుండాలో ఈ బలమే నిర్ణయిస్తుందని ఆయన ప్రతిపాదించి, అక్కడితో ఊరుకోకుండా గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరిగే లక్షణాలని మూడు గణిత సూత్రాలలో ఇమిడ్చి చెప్పేడు. వాటినే కెప్లర్ సూత్రాలు అనే పేరుతో ఈ నాటికీ వాడుతున్నాం.
సా. శ. 1600 తరువాత ఇటలీలో గలిలియో (Galileo) సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయనే దృగ్విషయానికి (phenomenon) దాఖలా చూపించేడు. చూపించి చర్చి ఆగ్రహానికి గురి అయ్యాడు. గురుత్వాకర్షణ అనే ఊహనం (concept) ఆ రోజుల్లో లేకపోయినా ఈ ఆకర్షణ లక్షణాలని ఆయన ప్రయోగాత్మకంగా అధ్యయనం చేసి అరిస్టాటిల్ రోజుల నుండీ పాతుకుపోయిన ఒక నమ్మకాన్ని వమ్ము చేసేడు. బరువైన వస్తువులు జోరుగాను, తేలిక వస్తువులు నెమ్మదిగాను పైనుండి కిందికి పడతాయనే అరిస్టాటిల్ నమ్మకానికి ఆ రోజుల్లో తిరుగు ఉండేది కాదు. ఆ నమ్మకంలో పస ఉందో లేదో ప్రయోగాత్మకంగా తేల్చి చూడవచ్చనే యావ 2,000 సంవత్సరాలలో ఏ ఒక్కరికీ కలగలేదు. బరువుతో నిమిత్తం లేకుండా అన్ని వస్తువులు ఒకే వేగంతో పై నుండి కిందికి పడతాయని గెలిలియో ప్రయోగం చేసి నిరూపించేడు. అంతే కాదు. పైనుండి కిందికి పడే వస్తువులు అన్నీ ఒకే పరిమాణంతో వేగవృద్ధి (acceleration) చెందుతాయనిన్నీ, భూమి మీద (అంటే, భుమ్యాకర్షక క్షేత్రంలో) ఆ వేగవృద్ధి (acceleration due to gravity) విలువ ప్రతి సెకండులో సెకండుకి 9.8 మీటర్లు చొప్పున (9.8 meters per second per second) అవుతుంది అనిన్నీ ఆయన కొలిచి చెప్పేరు. దీనినే మనం ఇంగ్లీషులో g అనే అక్షరంతో సూచిస్తాం. గెలిలియో తదనంతరం, మరొక 50 ఏళ్లు పోయేక, ఇదే g = 9.8 అనే విలువని నూటన్ తన రెండవ చలన సూత్రం (Second Law of Motion) లో వాడతాడు.
ఇలా దిగ్గజాల భుజస్కందాల మీద నిలబడి నూటన్ అందరి కంటె ఎక్కువ దూరం చూడగలిగేడు. చూసి, మరొక 20 ఏళ్లు శ్రమించి ప్రిన్సిపియా (Principia) అనే ఉద్గ్రంధాన్ని ప్రచురించేడు. ఈ గ్రంధంలో గ్రేవిటీ (gravity) అనే మాటని కొత్త అర్ధంతో మొదటిసారి వాడేడు. ఈ గ్రంధంలోనే విశ్వజనీన గురుత్వాకర్షణ సూత్రం (Universal Law of Gravitation) ఉద్ఘాటించేడు. ఈ సూత్రం ప్రకారం విశ్వంలో ఏ రెండు వస్తువులని తీసుకున్నా సరే అవి పరస్పరం ఆకర్షించుకుంటూ ఉంటాయి. ఆ పరస్పర ఆకర్షక బలం ఆ రెండు వస్తువుల గరిమ యొక్క లబ్దానికి (product of the masses) సరళ అనుపాతం (direct proportion) లోనూ, ఆ రెండు వస్తువుల దూరం యొక్క వర్గుకి (square of the distance) విలోమ అనుపాతం (inversely proportion) లోనూ ఉంటాయని సూత్రబద్ధం చేసేడు. (ఇక్కడే కెప్లర్ పప్పులో కాలేసి, ఆ బలం ఆ రెండు వస్తువుల మధ్య ఉన్న దూరానికి సరళ అనుపాతంలో ఉంటుందనుకున్నాడు.)
నూటన్ ప్రచురించిన ప్రిన్సిపియా ఒక మహా గ్రంధం. అదొక రత్నాల ఖని. ఈ గ్రంధంలో ఒక్క గురుత్వాకర్షణ సూత్రమే కాకుండా జగద్విఖ్యాతి చెంది, ప్రతి ఉన్నత పాఠశాల విద్యార్ధి నేర్చుకునే మూడు నూటన్ చలన సూత్రాలు (Newton’s Laws of Motion) కూడ ఉన్నాయి. వీటిల్లో రెండవ చలన సూత్రం చాల ముఖ్యం. దీనినే టూకీగా F = ma అని రాస్తారు. ఇక్కడ F అంటే force లేదా బలం, m అంటే mass లేదా వస్తువు యొక్క గరిమ, a లేదా acceleration ఆ వస్తువు ఎంత త్వరణంతో చలిస్తున్నాదో చెబుతుంది. ఈ త్వరణం భూమి గురుత్వాకర్షణ క్షేత్రంలో జరిగితే (అంటే, భూమి మీద కాని, భూమి చుట్టుపట్ల ఉన్న వాతావరణంలో కాని) ఇదే సమీకరణాన్ని F = mg అని రాస్తారు. అప్పుడు ఈ g విలువ గెలిలియో లెక్క కట్టిన 9.8 meters/sec/sec.
చూశారా!. నూటన్ కళ్లు, ముక్కు మూసుకుని, చెట్టు కింద కూర్చుని జపం చేస్తే ఆయన మస్తిష్కంలో ఇదంతా మెరవలేదు. కెప్లర్, గెలిలియో ప్రభృతులు కట్టిన పునాదుల మీద నూటన్ తన గురుత్వాకర్షణ భవంతిని కట్టేడు. కట్టి, తన సిద్ధాంతాలు ఒక్క భూమి మీదనే కాక విశ్వవ్యాప్తంగా వర్తిస్తాయని నమ్మేడు.
నూటన్ సూత్రాలని అందరూ ఒక్కుమ్మడి ఎగబడి ఆమోదించలేదు. ఎక్కడో ఆకాశంలో ఉన్న చంద్రుడిని భూమి ఆకర్షించటం ఏమిటి? భూమికీ, చంద్రుడికీ మధ్య తాడు లాంటిది ఏదీ లేదే! కంటికి కనిపించని బలం ఉందని అంటే ఎలా నమ్మెస్తాం?
నూటన్ సిద్ధాంతలని నమ్మని వాళ్లు నమ్మలేదు. నమ్మినవాళ్లు మాత్రం ఈ సిద్ధాంతాలని వివిధ కోణాలనుండి పరిశీలించి శల్య పరీక్ష చెయ్యటం మొదలుపెట్టేరు. శని గ్రహానికి అవతల యూరెనస్ (Uranus) అనే మరొక గ్రహం ఉనికి కనుక్కున కొత్త రోజులు అవి. ఈ యూరెనస్ గతిని నూటన్ సూత్రాల ప్రకారం లెక్క కట్టి చూస్తే ఆ లెక్కకి, ఆకాశంలో నిజంగా గ్రహం ప్రయాణం చేసే కక్ష్యకీ మధ్య పొంతన కుదరలేదు. నూటన్ సిద్ధాంతంలో లొసుగు ఉండనయినా ఉండాలి, లేదా టెలిస్కోపుతో చూసిన గ్రహం స్థానం తప్పుగా అయినా నమోదు అయి ఉండాలి. ప్రయోగాలలో లొసుగు లేదని నమ్మకం కుదిరిన తరువాత నూటన్ సిద్ధాంతం తప్పేమో అన్న అనుమానం వచ్చింది. కాని నూటన్ అంతటి వాడి సిద్ధాంతంలో తప్పా? అప్పుడు మరేదయినా కారణం కోసం వేట మొదలయింది. ఈ వేటలో ఒక అత్యద్భుతమైన ప్రతిపాదన జరిగింది. యూరెనస్ కక్ష్యకి ఇంకా అవతల మరొక గ్రహం ఉందేమో! అది యూరెనస్ ని తన ఆకర్షణ బలంతో కొంచెం వెనక్కి లాగుతోందేమో. ఈ అనుమానం రాగానే ఆ ఊహాత్మకమైన గ్రహం ఎక్కడ ఉంటే యూరెనస్ గ్రహగతిలో మనం చూస్తూన్న మార్పులు రావచ్చో లెక్కగట్టేరు. ఆకాశంలో ఆ ప్రదేశంలో వేట మొదలెట్టేరు. ఆహాఁ. అనుకున్నట్లు ఆకాశంలో మరొక చిన్న గ్రహం కనిపించింది. దానికి ప్లూటో (Pluto) అని పేరు పెట్టేరు. చరిత్రలో నూటన్ స్థానానికి ఇహ ఢోకా లేదని అందరు ఒక సారి గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సంరంభం సద్దు మణగకుండానే నీలాకాశం నుండి పడ్డ అశనిపాతంలా మరొక వార్త వచ్చి పడింది. సా. శ. 1855 లో లివరియెర్ (Le Verrier) అనే ఫ్రాంసు దేశీయుడికి బుధ గ్రహం (Mercury) నడకలో లొసుగు కనిపించింది. భుధ గ్రహం ఒక కక్ష్యలో గతి తప్పకుండా నడవాలి – మిగిలిన గ్రహాలకి మల్లే. కాని ఆ దీర్ఘవృత్తాకారపు కక్ష్య (elliptical orbit) నిలకడగా ఉండకుండా ప్రతి ఏటా కొద్ది కొద్దిగా పక్కకి జరుగుతోంది. ఈ రకం చలనం చూడాలంటే గిర్రున తిరిగే బొంగరాన్ని చూడండి. దాని అక్షం (axis) అలా, అలా పక్కకి జరుగుతూ ఉంటుంది. ఈ రకం చలనాన్ని విషువచ్చలనం (precision) అంటారు. ఎంత ప్రయత్నించినా నూటన్ సమీకరణాలు బుధ గ్రహానికే ఎందుకు ఈ రకం చలనం అంకురించిందో చెప్పలేకపోయాయి. యూరెనస్ కి వెలుపల ప్లూటో దొరికినట్లే బుధగ్రహం కక్ష్యకి లోపల “వల్కన్” (Vulcan) అనే గ్రహం మరొకటి ఉందేమో అని వెతికి చూసేరు. కనబడలేదు. నూటన్ నిర్మించిన మహా సౌధానికి మొదటి బీట పడింది! నలభయి ఆరు ఏళ్ల తరువాత, 1915 లో, అయిన్స్టయిన్ వచ్చి నూటన్ సమీకరణాలలో చిన్న మార్పు చేసి చుక్కాని లేని నావలా ఉన్న భౌతిక శాస్త్రాన్ని ఒక దరికి చేర్చేడు.
ఆయిన్స్టయిన్ చేసిన సవరణలో ముఖ్యాంశం ఏమిటంటే –“ గురుత్వాకర్షణ నూటన్ అనుకున్నట్లు ఒక ‘బలం” కాదు’ అన్నాడు. అని, “స్థలకాలం (spacetime) మీద ఎక్కువ గురుత్వం ఉన్న పదార్ధం (ఇక్కడ, భూమి అనుకొండి) ఉంచటం వల్ల స్థలకాలం మీద లొత్త పడుతుంది. ఆ లొత్త ప్రభావం వల్ల ఆ చుట్టుపట్ల గురుత్వం ఉన్న చిల్లర వస్తువులు (ఏపిల్ పండు, చంద్రుడు వగైరా అనుకొండి) ఆ లొత్తలోకి జారి పడతాయి. అంతేకాని ఎవ్వరూ ఎవ్వరినీ ఆకర్షించటం లేదు. సూర్యుడు ఎంతో భారం ఉన్న వస్తువు కనుక సూర్యుడి సమీపంలో స్థలకాలానికి లోతైన లొత్తే పడుతుంది. బుధ గ్రహం సూర్యుడికి అతి సమీపంలో ఉంది కనుక ఆ లొత్త ప్రభావం బుధుడి మీద ఎక్కువ. అందువల్లనే ఇతర గ్రహాల విషయంలో కనబడని “జరుగుడు” బుధగ్రహం కక్ష్య విషయంలో స్పుటంగా కనబడుతోంది.” ఈ విధమయిన వివరణతో అయిన్స్టయిన్ నూటన్ సిద్ధాంతాలని సవరించేడు.
బొమ్మ 4. అయిన్స్టయిన్ 1905 లో
అలాగని నూటన్ చెప్పినది అంతా తప్పు కాదు. సర్వసాధారణంగా, మనకి భూమి మీద కాని, భూమి పరిసర ప్రాంతాలలో కాని, నభోమూర్తుల భారం (mass) మరీ అత్యధికం కానప్పుడు నూటన్ సిద్ధాంతాలకి ఢోకా లేదు. కాని భారీ నభోమూర్తులు (ఉదా. నక్షత్రాలు, క్షీరసాగరాలు) తారసపడ్డప్పుడు నూటన్ సిద్ధాంతాలకి బదులు అయిన్స్టయిన్ సిద్ధాంతాలు వాడాలి.
3. కృష్ణ పదార్ధం
అలాగని సాధారణ సాపేక్ష సిద్ధాంతంలో లొసుగులు లేవనుకోకండి. “పీత కష్టాలు పీతవి” అన్నట్లు సాపేక్ష సిద్ధాంతం కూడ కష్టాలు పడుతోంది.
ఆకాశంలో ఎన్నో క్షీరసాగరాలు (galaxies) ఉన్నాయి కదా. ఈ క్షీరసాగరాలు కూడ ఏకాకులులా కాకుండా గుంపులు (clusters) గా కనిపిస్తూ ఉంటాయి. ఈ గుంపులలో ఒక గుంపు పేరు “కోమా గుంపు” (Coma cluster). ఇది మనకి చాలా దూరంలో ఉన్నది. దీనిని ఆధారంగా చేసుకుని “హబుల్ స్తిరాంకం” (Hubble constant) విలువ 80 ఉంటుందని లెక్క గట్టేరు. ఈ విలువని ఆధారంగా చేసుకుని విశ్వం వయస్సు అంచనా వేస్తే అది 8 నుండి 12 బిలియను సంవత్సరాల కంటె ఎక్కువ ఉందని అంచనా తేలింది. ఈ అంకెనీ నమ్మలేము. ఎందుకంటే ఈ విశ్వంలో 8 బిలియను సంవత్సరాల కంటె ఎక్కువ వయస్సు ఉన్న క్షీరసాగరాలు ఉన్నాయి. తల్లి వయస్సు కంటె పిల్ల వయస్సు ఎక్కువ ఎలా వీలవుతుంది?
అన్ని క్షీరసాగరాలలాగే ఈ కోమా గుంపు కూడ స్వప్రదక్షిణం చేసుకుంటూ, విష్ణుచక్రంలా గిర్రున తిరుగుతూ ఉంటుంది. ఈ క్షీరసాగరాలు ఊహకి అందని దూరంలో ఉన్నప్పటికీ, వీటి భారం (mass) ఎంతుంటుందో మనం మన ప్రయోగశాలలలో కూర్చుని అంచనా వెయ్యగలం. భారం ఉంటే దానికి గురుత్వాకర్షణ ఉండాలి. ఒప్పులగుప్పలో అమ్మాయిలు గిర్రున తిరుగుతూ ఉంటే అమ్మాయిల జడలు పైకి ఎగురుతూ ఉండవూ? అలాగే గిర్రున తిరుగుతూన్న క్షీరసాగరాలలోని నక్షత్రాలు పైకి ఎగిరిపోటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అవి అలా ఎగిరిపోకుండా ఉండాలంటే ఆ అపకేంద్ర బలానికి (centrifugal force) విరుగుడుగా గుంపులో ఉన్న పదార్ధం యొక్క గురుత్వాకర్షణ పని చెయ్యాలి. కాని లెక్క వేసి చూస్తే ఆ గుంపులో ఉన్న పదార్ధం యొక్క గురుత్వాకర్షణ బలం ఆ అపకేంద్ర బలాన్ని ఆపటానికి సరిపోదని తేలింది. కనుక ఆ నక్షత్ర రాసులు సిద్ధాంతం ప్రకారం చెల్లాచెదరు అయిపోవాలి. కాని అవి అలా ప్రవర్తించటం లేదు. అంటే ఏమిటన్న మాట? మనకి తెలియని, అంటే మన కంటికి, మన పనిముట్లకి కనపడని పదార్ధం ఏదో ఆ క్షీరసాగరాల్లో ఎక్కడో దాగి ఉండాలని ఒక ప్రతిపాదన లేవదీశారు. అలా మన కంటికి, మన పరికరాలకి కనబడకుండా నక్కి ఉన్న పదార్ధాన్ని కృష్ణ పదార్ధం (dark matter) అంటున్నారు.
కంటికి కనబడని ప్లూటోని లెక్కగట్టి పట్టుకున్నట్లే కంటికి కనబడకపోయినా “కృష్ణ పదార్ధం” అనేది ఒకటి ఉండి గిర్రున తిరుగుతున్న గేలక్సీలలోని నక్షత్రాలు చెదిరిపోకుండా కాపాడుతోందని ఒక అనుమానం. ఈ అనుమానం నివృత్తి అయితే విశ్వస్వరూపం మరికొంచెం అర్ధం అయినట్లే.
మూడడుగులు ముందుకేస్తే ఆరడుగులు వెనక్కి వేసే గుర్రం కథ లా ఉంది కదూ!
Thursday, October 14, 2010
విశ్వస్వరూపం: 3. ఈ సృష్టికి ఎవ్వరు కారణం?
3. ఈ సృష్టికి ఎవ్వరు కారణం?
వేమూరి వేంకటేశ్వరరావు
1. ప్రేరణ కారణం
ఈ చరాచర జగత్తుని సృష్టించినది ఎవ్వరు? ఈ సృష్టి ఎప్పుడు మొదలయింది? ఎందుకు జరిగింది?
సృష్టికర్త ఎవ్వరు? ఆ సృష్టికర్తనే “దేవుడు” అంటున్నామా? అలాగయితే ఎవ్వరా దేవుడు? ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? ఎవ్వరైనా చూశారా?
అసలు “దేవుడు” అన్న భావానికి నిర్వచనం ఏమిటి? సృష్టించినవాడా? రక్షించేవాడా? లయ కారకుడా? అన్నీనా?
ఈ రకం ప్రశ్నలు అనాది నుండీ మానవులు అడుగుతూనే ఉన్నారు. వివిధ కాలాలలో, వివిధ సంస్కృతులలో పెరిగిన విద్వాంసులు ఈ ప్రశ్నలని వివిధ దృక్పథాలతో కూలంకషంగా పరిశీలించి అనేకమైన సిద్ధాంతాలని ప్రతిపాదించేరు. వీటిలో ఎవరికి అనుకూలమైన మార్గాన్ని వారు అవలంబించి “బ్రహ్మసత్యం” కనుక్కున్న మహానుభావుల కథలు ఎన్నో మనం వింటూనే ఉంటాం.
అమెరికా సంయుక్త రాష్ట్రాల సంస్థాపకులలో ఒకడు, తరువాత అద్యక్ష పదవి అలంకరించిన వాడైన థామస్ జెఫర్సన్ ని మహా మేధావులలో ఒకడుగా ప్రెసిడెంట్ కెన్నడీ ఒక సారి కొనియాడేడు. అటువంటి జెఫర్సన్, దేవుడు సృష్టికి కారకుడు తప్ప సృష్టి జరిగిన తరువాత ఈ విశ్వం యొక్క దైనందిన కార్యక్రమాల్లో దేవుని పాత్ర లేదనిన్నీ, సృష్టి జరిగిన తరువాత ప్రకృతి శక్తుల ప్రభావ పరిధిలో ఈ జగత్కార్యం జరుగుతోందనిన్నీ నమ్మేడు. “దేవుడి మీద మీకు నమ్మకం ఉందా?” అని అయిన్స్టయిన్ ని అడిగితే “తాత్వికుడు స్పినోజా చెప్పిన దేవుడి లాంటి దేవుడిని అయితే నమ్ముతాను” అని సమాధానం చెప్పేడు. టూకీగా స్పినోజా ఏమన్నాడంటే, “ప్రకృతే దేవుడు. ప్రకృతి అంటే ఏమిటి? మనం మన చుట్టూ చూసే ఈ చరాచర జగత్తే ప్రకృతి. ఈ జగత్తుకి “బయట” ఎక్కడో ఉండి దేవుడు ఈ జగన్నాటకాన్ని తోలుబొమ్మలాటలా ఆడించటం లేదు. ఈ నాటకంలో దేవుడు కూడ ఒక నటుడే.”
ఇటీవలి కాలం వాడు, అస్తిత్వవాది అయిన విశ్వకవి రవీంద్రనాథ టాగూరుకి దేవుడంటే నమ్మకం ఉంది కాని అతని దేవుడు సగటు హైందవ దేవుడు కాడు. విశ్వకవికి దేవుడు ఒక చెలికాడు, మానవహితాన్ని కోరే ఒక తండ్రి. అదేకాలపు వాడైన మహాత్మ గాంధి సంశయవాది (agnostic); అంటే దేవుడున్నాడో, లేడో రుజువు చెయ్యలేకపోయినా దేవుడు ఉన్నాడని నమ్మే వ్యక్తి. గాంధి కి “దేవుడు సత్యం” (God is Truth) కాదు; అతనికి “సత్యమే దైవం” (Truth is God). సత్యం ఒక వాస్తవం. అది తిరుగు లేనిది. సత్యానికి దేవుడికి ఉన్న లక్షణాలు ఉన్నాయని జీవితాంతం నమ్మిన వ్యక్తి మహాత్ముడు.
రామకృష్ణ పరమహంస తనకి “దేవుడిని చూపించేడు” అని స్వామీ వివేకానందుడే ఒక చోట చెప్పుకున్నాడు. కనుక మనందరి కండ్లకి కనిపించకపోయినా ఈ జగన్నాటకాన్ని ఆడించటానికి ఒక మహత్తర శక్తి ఏదో ఉండితీరాలని అనిపిస్తుంది.
అనిపించటమేమిటి? “మయాద్యక్షేణ ప్రకృతిః సూయతేస చరాచరం, హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే” అని అనుమానానికి ఆస్కారం లేని భాషలో అర్జునుడికి కృష్ణుడు చెబుతాడు. ఈ శ్లోకం అర్ధం ఏమిటయ్యా అంటే, “ఈ జగద్రచనావ్యాపారమునకు అద్యక్షుడను నేనే. నా మాయా శక్తి నా కార్యదర్శి. నన్ను నిమిత్తముగా ఉంచుకొని, ఆమెయే స్థావర జంగమాత్మకమగు ఈ విశ్వమును సృజించి, పోషించి, లయమొందించుచున్నది.”
ఇలా సాక్షాత్తు పరమేశ్వరుడే స్వయంగా చెబుతూ ఉంటే ఇంకా ఈ అన్వేషణ ఏమిటని మీలో కొందరు అడగొచ్చు. ఈ అన్వేషణకి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, విశ్వరూపం చూసే వరకు నారాయణుడి మాటలని నరుడు నమ్మలేదు. అలాంటిది ఏ రూపమూ చూడకుండా, పుస్తకాలలో ఉన్న శ్లోకాలని చదివి మానవమాత్రులమయిన మనం ఎలా నమ్మగలం? రెండు, సృష్టి, స్థితి, లయ, మొదలైన భావాలకి అతీతంగా, పాపం, పుణ్యం, మొదలైన కర్మకాండల ఫలితాలకి అతీతంగా, సృష్టిలో సౌందర్యమే దైవస్వరూపమని నమ్మేవారి దృష్టితో ఇవే ప్రశ్నలకి మరొక కోణం నుండి సమాధానాలు వెతకాలనే ఆకాంక్ష ఉంది కనుక ఈ అన్వేషణ ముఖ్యోద్దేశం మోక్ష సాధన కాదు. అపవర్గమనే బ్రహ్మీస్థితిని చేరుకోవటం అంతకంటె కాదు. “కారణాలన్నిటికి మూలకారణమయిన ఆదిశక్తిని నేనే!” అనగలిగే ఏకైక మహత్తర శక్తి ఏదయినా ఉంటే దాని ఉనికిని నిర్ణయించటమే ఇక్కడ ధ్యేయం.
2. ప్రత్యక్ష దైవం
దేవుడిని సృష్టికారకుడిగా ఊహించుకుంటే మన తల్లిదండ్రులే మన ప్రత్యక్ష దైవాలు. కాని, ఈ ప్రతిపాదనలో కొన్ని చిక్కులు ఉన్నాయి. ఒకటి, తల్లిదండ్రులు సృష్టి, స్థితులకి కారకులు కాగలరు కాని లయకారకులు కాజాలరు. రెండు, పై నిర్వచనం ప్రకారం పిల్లలని కన్నవాళ్లు మాత్రమే దైవత్వానికి అర్హులు. మూడు, పైన చేసిన ప్రతిపాదన ప్రాణులకి మాత్రమే వర్తిస్తుంది. ప్రాణం లేని కొండలని, నదులని, సముద్రాలని ఎవ్వరు సృష్టించారు?
మానవుడి ఉనికికి మూలాధారమైన మాతృమూర్తి ఈ భూదేవి. ఈ భూమే లేకపోతే మనకి కాలుని మోపే స్థావరమే లేదు. నవమాసాలు కాదు, ఈ భూమాత మనని బతికున్నన్నాళ్లూ మోస్తోంది. ఒక్క మోయడమేమిటి? పంటలు పండే అవకాశం కల్పించి పోషిస్తోంది. ఒక్క పోషించటమేమిటి? భూమ్యాకర్షణతో మనందరినీ తన గుండెకి హత్తుకుని, వాతావరణమనే వెచ్చటి పమిట చెంగుతో కప్పి, మనకి హాని కలిగించే కాస్మిక్ కిరణాల ధాటీ నుండి తప్పించి, రక్షించి, కంటికి రెప్పలా కాపాడుతోంది. ఈ భూదేవే లేకపోతే మన మనుగడకి ఆధారమే లేదు. కనుక ఈ భూలోకవాసులందరికీ ఈ భూమి ప్రత్యక్ష దైవం.
భూమిని మాతృస్థానానికి లేవనెత్తాలంటే మన పితృదేవులెవ్వరో తెలియాలి. భూమి క్షేత్రాన్ని ప్రసాదిస్తున్నాది కాని, జీవానికి మూలకారణమైన బీజం సూర్యుడు ఇచ్చే వెలుగు. సూర్యుడు ఇచ్చే వేడి, వెలుగు లేకపోతే ఈ భూమి మీద మొక్కలు మొలవవు, పంటలు పండవు. సూర్యుడు లేకపోతే పోషణ అసంభవం. ఈ భూ, సూర్యుల జంటలో ఏ ఒక్కరు ఉన్నా సరిపోదు. ఇద్దరూ కావాలి. ఈ బాణీలో ఆలోచిస్తే భూమిని తల్లిగాను, సూర్యుడిని తండ్రిగానూ ఊహించుకుని, వీరిరువురిని ప్రత్యక్ష దైవాలుగా గౌరవించవచ్చు.
3. ఆదిమధ్యాంతరాహిత్యం
భగవంతుడు ఆదిమధ్యాంతరహితుడు అంటారు. క్షేత్రమాపక (geometrical) దృష్టితో చూస్తే గోళాకారంలో ఉన్న భూ, సూర్యులిద్దరూ ఆదిమధ్యాంతరహితులే. కాని కాలమాపక (temporal) దృష్టితో చూస్తే మాత్రం ఈ గమనిక నిజం కాదు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఈ భూమితో పాటు సూర్య కుటుంబం ఉరమరగా 5 బిలియను సంవత్సరాల కిందటే పుట్టింది. మనందరికి మల్లే ఈ సౌర కుటుంబానికి కూడ బాల్య, కౌమార, వార్ధక్య దశలు, తదుపరి మరణము తథ్యం. జనన మరణాలు ఉన్న ఈ భూ, సూర్యులు దేవుళ్లు ఎలా అవుతారు?
అంతే కాదు. ఈ భూ, సూర్యులిరువురికీ దైవత్వం అంటకట్టటానికి మరొక అడ్డంకి ఉంది. భూ, సూర్యులు ఈ భూ గ్రహం మీద ఉన్న వాళ్లకే మాతా పితలు. ఈ విశ్వంలో మన సూర్యుడి వంటి నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇలా లెక్కకు అందని ప్రభాకరులలో కొన్నింటికయినా గ్రహకూటములు ఉండొచ్చు. వాటిలో కొన్నింటి మీదనైనా ప్రాణం వెల్లివిరిసి ఉండొచ్చు. ఆయా ప్రాణుల తల్లిదండ్రులు వేరు కదా.
పోనీ భూమ్యేతర గ్రహాల మీద ప్రాణి లేదనుకుందాం. కనీసం ఆయా నక్షత్రాలని, వాటితోపాటు ఉండే గ్రహాలని ఎవ్వరో ఒకరు సృష్టించాలి కదా. ఈ సృష్టిని జరిపినది ఎవ్వరు? ఈ నభోమూర్తులన్నిటిని వాటి వాటి గతులు తప్పకుండా పరిభ్రమింపజేసేది ఎవ్వరు? విశ్వవ్యాప్తమూ, ఆదిమధ్యాంతరహితమూ అయిన ఈ అద్భుత శక్తి ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు పుంఖానుపుంఖంగా పుట్టుకురాగా కాబోలు, మందార మకరందాలు చించిదిస్తూ, “ఎవ్వనిచే జనించు, జగమెవ్వని లోపల నుండు…” అనే పద్యం రాసి మనకిచ్చేరు, పోతనామాత్యులు. భాగవతపురాణంలో భక్తులకి భక్తి మార్గం ఉంది, వైజ్ఞానిక పరిశోధకులకి విశ్వసత్యం ఉంది.
మన ఉపనిషత్తులలోను, పురాణాలలోను ఈ అన్వేషణకి సంబంధించిన సమాధానాలు ఉన్నాయి. ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలు ఇవే ప్రశ్నలకి సమాధాలకొరకు మరొక కోణం నుండి ఎలా వెతుకుతున్నారో, గత శతాబ్దంలో వీరు కనుక్కున్న విశ్వసత్యాలు ఏమిటో, వాటికీ మన పురాణ వచనాలకీ పొందుపొత్తికలు ఉన్నాయో లేదో సమీక్షించి, క్రోడీకరించి ఈ దిగువ పొందు పరుస్తాను. రాబోయే అధ్యాయాలలో వీటినే మరింత లోతుగా గాలించి మళ్లా చూద్దాం.
4. గురుత్వాకర్షణ
సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదుల పుట్టుకకి కారణభూతమైనదీ, ఈ నభోమూర్తులన్నిటిని గతులు తప్పకుండా వేటి పరిధులలో వాటిని ఉంచగలిగేది, వాటి వాటి కాలాలు తీరిన తరువాత వాటిని తనలో ఐక్యం చేసికొని, మళ్లా సరికొత్త నక్షత్రాదుల జన్మకి కారణభూతం కాగలిగినదీ అయిన శక్తి ఒకటి ఉంది. దానిని గురుత్వాకర్షణ అంటారు. ఈ గురుత్వాకర్షణ అదృశ్యమానం, విశ్వవ్యాప్తం, ఆదిమధ్యాంతరహితం.
ఈ గురుత్వాకర్షణ లేకపోతే సూర్యుడు, అతని సంతానం జన్మించి ఉండేవేకాదు. ఈ గురుత్వాకర్షణ ప్రభావం వల్ల కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని తారలు కాలరంద్రాలు (black holes) గా మారే సావకాశం కూడ ఉంది. అప్పుడు ఆ పరిసరప్రాంతాలలో ఉన్న పదార్ధం అంతా ఆ కాలరంద్రంలో పడిపోతుంది. అదే “లయ” ప్రక్రియ అని కొందరు సిద్ధాంతీకరిస్తున్నారు.
అంటే సృష్టి, స్థితి, లయ కారకురాలయిన ఈ గురుత్వాకర్షణ (gravity) సర్వకాల సర్వావస్థలయందు ఈ విశ్వానికి రూపు రేఖలు దిద్దుతోంది. కనుక దైవత్వానికి ఇది అభ్యర్ధే. ఈ గురుత్వాకర్షణ కంటికి కనిపించదు. గణితం లేకుండా వర్ణించి చెప్పటం కొంచెం కష్టమే. అయినా దీని గురించి కొంచెమయినా తెలుసుకుంటే కాని విశ్వరహశ్యం బోధపడదు.
ఈ విశ్వంలో ఏ రెండు వస్తువులని తీసుకున్నా వాటి మధ్య ఒక రకం ఆకర్షణ (attraction) ఉంటుందని నూటన్ ఉద్ఘాటించేడు. పండిన పండు చెట్టుని వదలి వినువీధిలోకి రివ్వున ఎగిరిపోకుండా భూమి మీద పడటానికి కారణం పండుకీ, భూమికీ మధ్య ఉన్న పరస్పరమైన ఆకర్షణే.
ఇదే విధమైన ఆకర్షణ భూమికి, చంద్రుడికి మధ్య ఉండటం వల్లనే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. నిజానికి భూమికి, చంద్రుడికి మధ్యనున్న ఈ ఆకర్షణకి చంద్రుడు భూమి మీదో, భూమి చంద్రుడి మీదో వెళ్లి పడాలి. ఇది ఎందుకు ఇలా జరగటం లేదో గణిత సమీకరణాలు రాసి సులభంగా చూపవచ్చు. గణితం లేకుండా చెప్పాలంటే ఉపమానాలు ఉపయోగించొచ్చు. ఉదాహరణకి ఒక రాయిని జోరుగా ఎదటికి విసిరేమనుకుందాం. అది కొంత దూరం ఒంపు తిరిగిన మార్గంలో వెళ్లి, చివరికి భూమి ఆకర్షణ కారణంగా భూమి మీద పడుతుంది. ఆ రాయిని ఇంకా జోరుగా విసిరితే మరికొంచెం దూరం వెళ్లి కింద పడుతుంది. ఇంకా చాలా బలంతో రాయిని గిరవాటు వేస్తే – అంటే, ఆ రాయి ప్రయాణం చేసే ఒంపు గుండ్రంగా ఉన్న భూమి ఒంపుకి దీటుగా ఉండటానికి సరిపోయే అంత జోరుగా విసిరితే - ఇహ ఆ రాయి సతతం అలా “కింద” పడటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, కాని పడ లేదు; అప్పుడు ఆ రాయి భూమి చుట్టు ప్రదక్షిణం చేస్తుంది. కృతిమ ఉపగ్రహాలని భూమి కక్ష్య లోనికి ఎక్కించటానికి రాకెట్లు చేసే పని ఇలాంటిదే. అదే విధంగా చంద్రుడు భూమి మీద పడలేక భూమి చుట్టూ తిరుగుతున్నాడు. ఇదే విధంగా భూమి వెళ్లి సూర్యుడి మీద పడటానికి ప్రయత్నం చేస్తోంది; కాని భూమి సూర్యుడి చుట్టూ తిరిగే పరిభ్రమణ వేగం వల్ల సూర్యుడి మీద పడలేక సూర్యుడి చుట్టూ తిరుగుతోంది.
ఈ గురుత్వాకర్షణ విశ్వ వ్యాప్తం అని నూటన్ గమనించేడు కానీ, ఈ ఆకర్షణ ఎందుకు ఉందో కారణం చెప్పలేకపోయాడు. ఈ ప్రశ్నకి అయిన్స్టయిన్ సమాధానం చెప్పేడు. ఆయిన్స్టయిన్ ఉద్ఘాటించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం (General Theory of Relativity) ఆధారం చేసుకుని ఈ గురుత్వాకర్షణకి కారణం ఒక ఉపమానం సహాయంతో వివరిస్తాను. ఈ ఉపమానానికి ఒక ఊహాలోకంలో మనం ఒక ప్రయోగాన్ని సృష్టించుకోవాలి. ఇటువంటి ఉహాలోకపు ప్రయోగాలని ఊహా ప్రయోగాలు లేదా స్పురణ ప్రయోగాలు (thought experiments) అందాం.
ఈ ఉపమానానికి ఒక ప్రదేశం (space), ఆ ప్రదేశంలో పదార్ధం (matter) కావాలి. ప్రదేశానికి ఒక పెద్ద జంబుఖానాని ఊహించుకుందాం. ఊహే కనుక, ఈ జంబుఖానా రబ్బరు గుడ్డతో చేసినది అని అనుకుందాం. ఈ రబ్బరు జంబుఖానాని నాలుగు పక్కలా గట్టిగా లాగి పట్టుకుందాం. ఈ జంబుఖానా ఉన్న మేరని మనం “విశ్వం” అని అనుకుందాం. ప్రస్తుతానికి ఈ విశ్వం అంతా ప్రదేశం ఆక్రమించుకుని ఉంది. ఈ ప్రదేశం సాపుగా, చదునుగా, ముడతలు, ఒంపులు లేకుండా ఉంది కదా.
ఇప్పుడు ఈ విశ్వం మీద చిన్న “నల్లపూస” అనే పదార్ధాన్ని వేసేమని అనుకుందాం. ఈ నల్లపూసలో పదార్ధం తక్కువగా ఉంది కనుక దీని వల్ల మన జంబుఖానా ఆకారం ఏమీ మారదు. ఎక్కడ వేసిన పూస అక్కడే ఉంటుంది కదా? ఇప్పుడు ఈ జంబుఖానా మీద పెద్ద కొబ్బరి బొండాం పెట్టేమనుకుందాం. కొబ్బరి బొండాం అనే పదార్ధం జంబుఖానా అనే ప్రదేశం మీద పెట్టగానే ఆ ప్రదేశం ఆకారమే మారిపోయింది. కొబ్బరి బొండాం ఉన్న చోట రబ్బరు జంబుఖానాలో ఒక లొత్త పడుతుంది. అంటే ఏమిటన్న మాట? ప్రదేశం ఆకారం ఆ ప్రదేశంలో ఉన్న పదార్ధం మీద ఆధారపడి ఉంటుంది.
లొత్త పడగానే ఇందాకటి నల్లపూస జరజరా జారి ఆ లొత్తలో పడుతుంది. జంబుఖానా మన కళ్లకి కనబడుతోంది కనుక ఆ జంబుఖానా మీద ఆ పూస “జారు”తోన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ జంబుఖానాని మన కంటికి కనబడని గుడ్డతో చేసేరనుకుందాం. అప్పుడు కూడ నల్లపూస జారి బొండాం దగ్గరకి వెళుతుంది. కాని జంబుఖానా కనబడటంలేదు కనుక కొబ్బరి బొండాం నల్లపూసని ఆకర్షిస్తూన్నట్లు భ్రమ పడతాం. ఈ భ్రమే గురుత్వాకర్షణ అంటారు అయిన్స్టయిన్. ఇది రజ్జు సర్ప భ్రాంతి లాంటి భ్రమ. ఈ ప్రయోగం జరిగే వరకు కొబ్బరి బొండాం నల్లపూసని ఆకర్షిస్తున్నాదనే అనుకున్నాం. ప్రయోగం అయిన తరువాత, అంతా అర్ధం అయిన తరువాత – ఆకర్షణా లేదు, గీకర్షణా లేదు, అంతా ప్రదేశంలో ఉన్న ఒంపు వల్ల మనకి అలా అనిపిస్తున్నాదని ఇప్పుడు అనుకుంటున్నాం. అయితే ఈ గురుత్వాకర్షణేనా కారణాలన్నిటికి కారణమైన ఆది శక్తి?
5. ఆది శక్తి
ఆది శక్తి (primeval energy) అసలు స్వరూపం అర్ధం అవాలంటే అయిన్స్టయిన్ ప్రవచించిన మరొక సూత్రాన్ని అర్ధం చేసుకోవాలి. ఆయిన్స్టయిన్ చేసిన పనేమిటో చాల మందికి అర్ధం కాకపోయినా ఆయన పేరుతో చెలామణీ అయే ఒక గణిత సమీకరణం చాలమందికి తెలుసు. అదే E = mc2 అన్న సమీకరణం. ఈ సమీకరణం లో c అంటే వెలుగు వేగం. c2 అంటే వెలుగు వేగాన్ని వెలుగు వేగంతో గుణించగా వచ్చిన లబ్దం. ఈ సమీకరణం ప్రకారం విశ్వం అంతా పదార్ధం (m), శక్తి (E) అనే రెండింటి మయం. ఈ రెండింటికి తేడా లేదు. ఈ విశ్వాన్ని పదార్ధంగానైనా ఊహించుకోవచ్చు, శక్తిగానైనా ఊహించుకోవచ్చు. ఈ రెండూ ఒకదానికి మరొకటి రూపాంతరాలు. ఒకటి బొమ్మ అయితే, మరొకటి బొరుసు.
ఉదాహరణకి ఒక అణువు (atom) ని తీసుకుందాం. ఈ అణువులో వడ్లగింజ మొనలో ఉన్నంత పదార్ధం ఉందని (“నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్వణూపమా”) వేదంలో ఉన్న మంత్రపుష్పం చెబుతోంది. అంత సూక్ష్మమైనంత పదార్ధంలో ఆత్మ ఉందో లేదో తెలియదు కాని, ఆ అణువులో ఉన్న శక్తి విడుదల చెయ్యగలిగితే మనకి “అణుబాంబు” వస్తుంది. అణుగర్భంలో అంత శక్తి ఇమిడి ఉందని పైన ఉదహరించిన E = mc2 అన్న సమీకరణం చెబుతోంది.
ఈ స్థూల ప్రపంచం అంతా అణువుల సమూహం. ఈ విశ్వంలో ఎన్ని అణువులు ఉన్నాయి? ఒకటి తరువాత 80 సున్నలు చుడితే ఎంత సంఖ్య వస్తుందో (10E80) అన్ని అణువులు ఉన్నాయని ఒక అంచనా ఉంది. ఈ అణువులు అన్నీ స్థూల రూపంలో ఉన్న శక్తి. ఈ అణుగర్భాలలో ఉన్న శక్తి అంతా ఒకేసారి స్థూలరూపం వదలి నిజరూపం ధరిస్తే వచ్చే శక్తి ఎంతుంటుందో అయిన్స్టయిన్ సమీకరణం ఉపయోగించి లెక్క కట్టవచ్చు. కాంతి వేగం సెకండుకి ఉరమరగా 300,000,000 మీటర్లు అని వేసుకుని, ఒకొక్క అణువు గరిమ (mass) ఎంతుంటుందో చూసుకుని లెక్క వెయ్యవచ్చు. ఈ పని చదువరులకి వదలిపెడతాను. మీకు వచ్చిన సమాధానం ఆది శక్తిలో ఉన్న శక్తి!!
ఏదో మాటవరసకి చదువరులకి లెక్క కట్టమని ఇచ్చేను కాని, ఈ సంఖ్య ఊహకి అందనంత పెద్దగా ఉంటుంది. అంత పెద్ద పెద్ద సంఖ్యలని ఊహించుకోవటం కష్టం. అందుకని కొంచెం సాయం చేస్తాను.
మొట్టమొదట అణుబాంబుని జపాను మీద పేల్చే ముందు, అది అనుకున్నట్లు పేలుతుందో లేదో చూసుకోటానికి, అమెరికాలో, నూ మెక్సికోలో ఉన్న ఒక ఎడారిలో, ఒక బాంబుని ప్రయోగాత్మకంగా పేల్చేరు. ఆ ప్రయోగానికి పెద్ద ఆపెన్హైమర్ అనే ఆసామీ. ఈ బాంబులో ఉన్న యురేనియంలో కేవలం 600 మిల్లిగ్రాముల యురేనియం మాత్రం శక్తిగా మారింది. ఈ శక్తిని చూసి అది వర్ణనకి అందని దృశ్యం అనిన్నీ, కాదూ, కూడదు వర్ణించాలంటే ఒకే ఒక మార్గం ఉందని చెప్పి, భగవద్గీతలోని, “దివిసూర్యసహస్రస్య భవేద్యుగపదుద్ధితా, యది భాః సదృశీ సా స్యాద్ భాసస్ తస్య మహాత్మనః.” అన్న శ్లోకాన్ని చదివి అలా ఉందన్నారుట, ఆపెన్హైమర్!
అంటే ఏమిటి? వెయ్యి సూర్యబింబాలు ఆకాశంలో ఒకే సారి ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అని అర్ధం కదా. కేవలం 600 మిల్లిగ్రాముల పదార్ధం పేలితేనే ఆయనకి నోరెండిపోయి భగవద్గీతలోని శ్లోకం గుర్తుకి వచ్చెస్తే, విశ్వంలో ఉన్న అణువులలో ఉన్న శక్తి అంతా ఒకేసారి విడుదల అయితే దానిని వర్ణించటం మన తరమా? దానిని చూడగలమా? చూడగలిగినా గలగలేకపోయినా, ఊహించగలిగినా గలగలేకపోయినా అదే ఆది శక్తి అని అంటున్నారు భౌతిక శాస్త్రంలో ఉద్దండులైన పెద్దలు.
“తస్యాశిఖాయ మధ్యే పరమాత్మా వ్యవస్థితః” (అంటే, ఆ అణువు మధ్య ఉన్నది పరమాత్మే) అని వేదం ఘోషిస్తున్నాది.
టూకీగా చెప్పాలంటే సృష్ట్యాదిలో ఉన్నది ఈ ఆది శక్తే. “మయా తతం ఇదం సర్వం, జగదవ్యక్తమూర్తినా” అని అన్నాడు కనుక జగ్గత్తంతయు అవ్యక్తరూపుడగు ఆది శక్తిచే ఆక్రమించబడి ఉన్నది.
“అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే” అన్నాడు కనుక విశ్వంలో సర్వసమస్థానికీ మూలకారణం ఈ తేజస్సే!
“యచ్చాపి సర్వభూతానాం బీజం” అన్నాడు కనుక సమస్త జీవులకు బీజం ఈ తేజస్సే!
“యద్ యద్ విభూతిమత్ సత్వం శ్రీమదూర్జితమేవవా, తత్తదేవావ గచ్చత్వం మమతేజోంశ సంభవం” అని కూడా అన్నాడు కనుక విశ్వంలోని శక్తులు కాని, పదార్ధములు కాని ఈ తేజస్సు యొక్క అంశలే.
6. ఆది శక్తికీ గురుత్వాకర్షణకీ సంబంధం ఏమిటి?
సృష్ట్యాదిలో ఉన్నది ఆది శక్తి. దీనినే భౌతిక శాస్త్రవేత్తలు ఆదిజ్వాల (primeval fireball) అని కూడ అంటారు. మనం బ్రహ్మాండం అని అంటాం. ఈ బ్రహ్మాండం ఎప్పుడు, ఎలా వచ్చిందో, ఎన్నాళ్లు అలా జ్వాలా (తేజో) రూపంలో ఉందో ఎవ్వరికీ తెలియదు. ఈ బ్రహ్మాండం ఎంత మేర స్థలం ఆక్రమించిందో కూడ ఎవ్వరికీ తెలియదు. “ఎంత మేర?, ఎన్నాళ్లు?” అనే ప్రశ్నలకి ఈ సందర్భంలో అర్ధం లేదని కొందరి వాదన. ఎందుకంటే ఆది శక్తి ఇలా తేజోరూపంలో ఉన్నప్పుడు స్థలం ఇంకా పుట్టలేదు, కాలం ఇంకా పుట్టలేదు.
విపరీతమైన తేజస్సుతో, విపరీతమైన వేడితో వర్ధిల్లుతూన్న ఈ తేజో రూపం, ఈ బ్రహ్మాండం, ఒక శుభముహూర్తంలో, అకస్మాత్తుగా ఫెళ్లున పేలిపోయింది ట. ఇలా విచ్ఛిత్తి పొందిన బ్రహ్మాండం నుండి నాలుగు ప్రాధమిక బలాలు (four fundamental forces) పుట్టుకొచ్చేయి. ఇలా సృష్టి ఆరంభంలో పుట్టిన నాలుగు బలాలలో ఒకటి గురుత్వాకర్షణ బలం (gravitational force). మరొకటి విద్యుదయస్కాంత బలం (electromagnetic force). మూడవది త్రాణిక బలం (strong force). నాలుగవది నిస్త్రాణిక బలం (weak force). ఈ చతుర్విధ బలాల జననమే సృష్టికి మొదలని అనుకోవచ్చు.
ఈ పేలుడు లోనే స్థలం (space), కాలం (time) కూడ పుట్టేయి. పేలుడు ప్రదేశం లోకి వ్యాపించటం మొదలుపెట్టింది. ఇలా వ్యాప్తి చెందిన ప్రదేశం పదార్ధంతో (matter) నిండటం మొదలయింది. ఈ పదార్ధం ఎక్కడ నుండి వచ్చింది. శక్తి లోంచి. ప్రదేశంలోకి విశ్వం వ్యాపిస్తూ పదార్ధంతో నిండుతూ ఉంటే కాలం ముందుకు నడవటం మొదలు పెట్టింది. విశ్వం చల్లారటం మొదలు పెట్టింది. తరువాత నక్షత్రాలు, గ్రహాలు పుట్టేయి. ప్రాణి పుట్టింది. మనిషి పుట్టేడు. పుట్టి, “కస్త్వం, కోహం?” అని అడిగేడు.
Saturday, September 25, 2010
విశ్వస్వరూపం: లెక్కకు అందని సంఖ్యామానం
విశ్వస్వరూపం (గత సంచిక తరువాయి)
2. లెక్కకు అందని సంఖ్యామానం
వేమూరి వేంకటేశ్వరరావు
అష్టావక్రుడి కథ, రోమహర్షుడి ఉదంతం చదివిన తరువాత సృష్టి, లయ ఎంతో పురాతనమైన సంఘటనలే అని అనిపించకమానదు. ఆధునిక శాస్త్రం దృష్ట్యా కూడ విశ్వం బహు పురాతనమైనది. నిజానికి విశ్వ స్వరూపాన్ని ఆకళింపు చేసుకోవాలంటే ఊహకి అందని దూరాలనీ, ఊహకి అందని కాలాలనీ, ఊహకి అందని సంఖ్యామానాలనీ ఊహించుకోవటానికి అలవాటు పడాలి. ఈ విశ్వం 13.7 బిలియను సంవత్సరాల క్రితం పుట్టిందని నేను చెపితే సామాన్యులలో ఎంతమందికి అర్ధం అవుతుంది? ఈ సూర్య మండలం పుట్టి 4.6 బిలియను సంవత్సరాలు అయిందంటే ఎంతమందికి అవగాహన అవుతుంది? ఈ భూమి పుట్టి 4 బిలియను సంవత్సరాలు అయిందంటే అందరూ ఆకళింపు చేసుకోగలరా? వేలకీ, లక్షలకీ, కోట్లకీ అలవాటు పడిపోయిన మన ప్రాణాలకి మిలియను, బిలియను ఊహించుకోవటం వీలవుతుందా? ఇంతకీ కోటి పెద్దదా? బిలియను పెద్దదా? అలాగే విశ్వం భ్రూణ దశలో 1E-35 సెకండ్ల కాలం గడిపిందని నేను అంటే, వివరణ లేకుండా, నా సహాధ్యాయులే అర్ధం చేసుకోలేరు.
1. పెద్ద పెద్ద సంఖ్యలని లెక్క పెట్టటం
పెద్ద పెద్ద సంఖ్యలని ఊహించటమే కాదు, వాటిని లెక్క పెట్టటం కూడ భారతీయులకి వెన్నతో పెట్టిన విద్య. ఉదాహరణకి పెద్ద పెద్ద సంఖ్యలని లెక్కపెట్టటంలో ఉన్న కష్టసుఖాలని ఒకసారి పరిశీలించి చూద్దాం.
ఒకటి పక్కన సున్న వేస్తే అది పది. పదిని ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు. మన చేతులకి పది వేళ్లు ఉన్నాయి కదా!
ఒకటి పక్కన రెండు సున్నలు చుడితే అది వంద లేక నూరు. వందని ఊహించుకోవడం కూడ పెద్ద కష్టం కాదు. వంద రూపాయలు ఖర్చు పెడితే ఏమీ రాని ఈ రోజులలో వంద పెద్ద సంఖ్య కానే కాదు. నా చిన్నతనంలో పెళ్లికొడుక్కి నూటపదహార్లు కట్నం ఇచ్చేవారు!
ఒకటి పక్కన మూడు సున్నలు చుడితే అది వెయ్యి.
ఇంతవరకు ఒకొక్క సున్న చేర్చినప్పుడల్లా సంఖ్య విలువతో పాటు ఆ సంఖ్య పేరు కూడ మారింది: పది, వంద, వెయ్యి.
ఒకటి పక్కన నాలుగు సున్నలు చుట్టటంతో మనం పేర్లు పెట్టే బాణీలో కొంచెం మార్పు వచ్చింది. మునపటిలా 10,000 కి మరో కొత్తపేరు పెట్టకుండా “పది” అనే పూర్వ ప్రత్యయం చేర్చి “పదివేలు” అనేసి ఊరుకున్నాం. ఎంతకని కొత్త పేర్లు పెట్టకలం?
మనమే కాదు ఇంగ్లీషు వాడూ ఇదే పని చేసి, “టెన్, హండ్రెడ్, థౌజండ్” అయిన తర్వాత మనలాగే “టెన్ థౌజండ్” అన్నాడు. కాని ఇంగ్లీషు వాడు మన దేశం రాక పూర్వం దీనిని “మిరయడ్” అనే పేరుతో పిలచేవాడు.
ఒకటి పక్కన ఐదు సున్నలు చుడితే అది లక్ష. దీన్ని హిందీలోనూ, ఇంగ్లీషులోనూ కూడ “లేక్” అంటారు. పూర్వం గొప్పవాళ్లు లక్షాధికారులు. “వాళ్లింట్లో లక్షలు మూలుగుతున్నాయి!” అనుకునే వాళ్లం. ఇప్పుడు లక్ష అంటే ఎవ్వరూ ఖాతరు చెయ్యటం లేదు.
ఒకటి పక్కన ఆరు సున్నలు చుట్టగా వచ్చిన సంఖ్య పది లక్షలు లేదా మిలియను. అమెరికాలో మిలియను డాలర్లు ఆస్తి ఉంటే మధ్య తరగతిలో కొంచెం పైమెట్టు లో ఉన్నట్లు లెక్క వేసుకోవచ్చు. భారత దేశంలో లక్షాధికార్లకి పట్టిన గతే అమెరికాలో ఈ మిలియనీర్లకి కూడ పడుతోంది. బిలియనీర్లు వచ్చిన తరువాత మిలియనీర్ల ముఖాలు ఎవ్వరూ చూడటం లేదు.
ఒకటి పక్కన ఏడు సున్నలు చుడితే అది కోటి. దీన్ని హిందీలో “కరోర్” అంటారు. ఇదే ఇంగ్లీషులో “క్రోర్”. ఈ రోజులలో గొప్పవాళ్లు కోటీశ్వరులు, లేదా కరోర్పతులు. “వాళ్లింట్లో డబ్బు కోటికి పడగలు ఎత్తింది!” అనుకునే వాళ్లం. అంత డబ్బుంటే ఆ డబ్బు పాములుగా మారిపోతుందనే కథ నా బాల్యంలో వినేవాడిని.
కోటిని ఊహించుకోవడం కొంచెం కష్టం నా బోంట్లకి. ఉదాహరణకి భారతదేశం జనాభా ఉరమరగా 100 కోట్లు! ఈ వంద కోట్ల ప్రజలని ఒకేసారి చూడలేము కనుక ఈ విషయం ఊహించుకుందికి ఉపయోగపడదు. సాధారణ శకం (సా. శ.) 1992 లో ఆంధ్రప్రదేశ్లో పుగాకు, సారా వగైరాల అమ్మకం పన్ను ద్వారా వచ్చిన ఆదాయం 840 కోట్ల రూపాయలుట!
ఒకటి పక్కన ఎనిమిది సున్నలు చుడితే వచ్చే సంఖ్యకి మంచిపేరు, నలుగురికీ పరిచయం అయిన పేరు ఏదీ లేదు. పదికోట్లు అనో, దశకోటి అనో, వంద మిలియన్లు అనో అనవచ్చు; కాని అవి కొత్త పేర్లు కావు. “వెంకట్రావ్, పెద వెంకట్రావ్” అన్నట్టు పాత పేర్లనే పునరావృతం చేసేం, అంతే.
ఒకటి పక్కన తొమ్మిది సున్నలు చుడితే వచ్చే సంఖ్య వంద కోట్లు లేదా బిలియను. మిలియను ఊహించుకోవటం చేతనయిన వాళ్లకి కూడ బిలియను ఊహించుకోవటం కష్టం. ఈ భూలోకపు జనాభా 5 బిలియనుల పై చిల్లర అంటే ఉపయోగపడుతుందేమో ఆలోచించుకొండి.
అసలు ఆధునిక శాస్త్రీయ యుగం మొదలయే వరకు పాశ్చాత్య దేశాలలో పెద్ద పెద్ద సంఖ్యలతో పనే ఉండేది కాదు. బిలియనుతో సామాన్యులకి అవసరం ఏముంటుంది? కనుక మొన్న మొన్నటి వరకూ పాశ్చాత్య భాషలలో పెద్ద పెద్ద సంఖ్యలకి పేర్లే లేవు. పని ఉంటే కదా పేర్ల అవసరం? కాని భారతదేశంలో ఏమి పని వచ్చిందో తెలియదు కాని “పెద్ద పెద్ద” సంఖ్యలకే కాదు, “పేద్ద పేద్ద” సంఖ్యలకి కూడ పేర్లు ఉన్నాయి. ఉదాహరణకి ఒకటి తర్వాత 11 సున్నలు చుడితే అది అర్బుదం, 13 సున్నలకి ఖర్వం, 15 సున్నలకి పద్మం, 17 సున్నలకి క్షోణి, 19 సున్నలకి శంఖం, ఇలాగే తరువాయి బేసి సంఖ్యల సున్నలుంటే వాటిని క్రమంగా క్షితి, క్షోభం, నిధి, సరి సంఖ్యలైన సున్నలుంటే వాటి పేరుకి “మహా” తగిలించి మహాపద్మం, మహాఖర్వం, వగయిరా పేర్లు. ఒకటి తర్వాత 27 సున్నలుంటే పర్వతం, 28 పరార్థం, 29 అనంతం. ముప్పయ్ సున్నలుంటే సాగరం, 31 అవ్యయం, 32 అచింత్యం, 33 అమేయం, … భూరి, వృందం, అన్న పేర్లు ఉన్నాయి. ఈ లెక్కలో వృందం తర్వాత ఏమి పేర్లు వస్తాయో ఇదమిత్థంగా తెలియదు కానీ రావణాసురుడి సైన్యం ఎంత పెద్దదో వర్ణిస్తూ వాల్మీకి ఒకటి తర్వాత 55 సున్నలు చుడితే వచ్చే సంఖ్యంత అని చెప్పి దానికి మహౌఘం అని పేరు పెట్టేడు.
ఈ పేర్లు భారత దేశంలో వాడుకలో లేవు కానీ వారి దగ్గర ఈ పేర్లు నేర్చుకున్న జపాను వాళ్లు ఇప్పటికీ వీటిని వాడుతున్నారు. మచ్చుకి ఒకటి తర్వాత 80 సున్నలు వేయగా వచ్చిన సంఖ్యని జపాను వాళ్ళు “పుకషీగీ” అంటారు. పుకషీగీ అంటే ఆలోచనకి అందనిది లేదా “అచింత్యం”. ఒకటి తర్వాత 56 సున్నలు వేయగా వచ్చిన సంఖ్యని “కుగాషా” అంటారు. కుగాషా అంటే “గంగా నది ఒడ్డున ఉన్న ఇసకంత” అని అర్థం ట!
భారతీయులు పేర్లు పెట్టటం అంటూ పెట్టేరు కానీ, ఈ పేర్లలో ఒక బాణీ లేకపోతే జ్ఞాపకం పెట్టుకోవటం కష్టం. అప్పుడు ఒకదానికి మరొక పేరు వాడే ప్రమాదం ఉంది. భారతీయ ప్రాచీన గ్రంథాలలో, మచ్చుకి, ఒకటి తర్వాత 12 సున్నలు ఉన్న సంఖ్యని ఒక చోట మహార్బుదం అన్నారు, మరొక చోట న్యర్బుదం అన్నారు. ఇలాంటి ఇబ్బందుల నుండి తప్పించుకుందికి అధునాతనులు ఒక పద్ధతి ప్రవేశపెట్టేరు. ఈ పద్ధతిలో సంఖ్యల పేర్లలో బాణీ ఈ విధంగా ఉంటుంది: పది, వంద, వెయ్యి మామూలే. తరువాత కొత్త పేరు ఒకటి తర్వాత ఆరు సున్నలు చుట్టగా వచ్చిన మిలియను. తరువాత కొత్తపేరు ఒకటి తరువాత తొమ్మిది సున్నలు చుట్టగా వచ్చిన బిలియను. అలా మూడేసి సున్నలు అధికంగా చేర్చినప్పుడల్లా మరొక కొత్త పేరు. ఈ లెక్కని ఒకటి తర్వాత ఆరు సున్నలుంటే మిలియను, తొమ్మిది ఉంటే బిలియను, 12 అయితే ట్రిలియను, 15 సున్నలకి క్వాడ్రిలియను, తదుపరి క్వింటిలియను, అలా.
బాగానే ఉందయ్యా! ఇవన్నీ “లియను” అనే శబ్దంతో అంతం అవుతున్నాయి. కాని ఈ “లియను” ముందుండే పూర్వప్రత్యయం జ్ఞాపకం పెట్టుకోవడం ఎలా? ఈ పూర్వ ప్రత్యయాలని విడిగా, వరసగా వాటి అర్థాలతో రాసి చూద్దాం.
లేటిన్ భాషలో బి రెండు, ట్రి మూడు, క్వాడ్ నాలుగు, క్వింట్ అయిదు, సెక్స్ట్ ఆరు, సెప్ట్ ఏడు, ఆక్ట్ ఎనిమిది, నవ్ తొమ్మిది … అలా అలా వెళుతుందీ వరస. ఈ వరస అర్థం ఏమిటంటే మిలియనుని మూలంగా తీసుకుని ఆ మిలియనుని రెండు సార్లు వేసి హెచ్చవేస్తే వచ్చే సంఖ్య బిలియను, మూడు సార్లు గుణిస్తే వచ్చే సంఖ్య ట్రిలియను, నాలుగు సార్లు గుణకారం చెయ్యగా వచ్చింది క్వాడ్రిలియన్, ..
ఆగాలి, కొంచెం ఆగాలి.. ఇక్కడ నేను తప్పేనా చెబుతూ ఉండుండాలి, మీరు తప్పేనా అర్థం చేసుకుని ఉండుండాలి. ఎందుకంటే మిలియనుని రెండు సార్లు వేసి గుణిస్తే ఒకటి తర్వాత 12 సున్నలు వస్తాయి కాని తొమ్మిది రావు. నిజానికి అది నిజమే. బ్రిటిష్ వాళ్ల హయాంలో ఈ ప్రపంచం ఉన్నప్పుడు వాళ్లు అన్నీ తార్కికంగా ఆలోచించి ఒక పద్ధతిలో పేర్లు పెట్టేరు. ఒకటి తర్వాత 12 సున్నలుంటే దానిని బిలియను అనీ, 18 సున్నలుంటే దానిని ట్రిలియను అనీ, అలా అనుకుంటూ వెళ్లమన్నారు. అలాగే వెళ్లేవాళ్లం. తరువాత ఈ అమెరికా వాళ్లు వచ్చేరు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి, పైపెచ్చు ఈ అమెరికా వాడి దగ్గర డబ్బు మస్తుగా ఉంది. దాంతో జబ్బశక్తి, గోరోజనం పుంజుకున్నాయి. తన శక్తిని ప్రపంచానికి చాటడం ఎలా? ఇంగ్లీషువాడు ఎడం పక్కని నడిపితే తను కుడి పక్కన కారు నడుపుతానన్నాడు. ఇంగ్లీషు మాటలకు స్పెల్లింగులు మార్చేస్తానన్నాడు. కొన్నింటికి అర్థాలే మార్చీసేడు. అందుకనే ఈ రోజులలో బిలియను అంటే ఒకటి తర్వాత తొమ్మిది సున్నలే. ట్రిలియను అంటే ఒకటి తర్వాత 12 సున్నలూ, అలాగ వెళుతోంది ఈ బండి. ఈ మార్పు వల్ల వచ్చిన నష్టం ఏమిటంటే పూర్వప్రత్యయాన్ని చూసి ఆ సంఖ్యలో ఎన్ని సున్నలుంటాయో చెప్పడం కష్టం; బట్టీ పట్టేయాలి అంతే.
ఈ పేర్లు ఇంకా ఎంత దూరం వెళతాయి? మిలియనుని వంద సార్లు వేసి హెచ్చవేస్తే వచ్చే సంఖ్యని “సెంటిలియన్” అనమన్నాడు బ్రిటిషువాడు. అప్పుడు సెంటిలియన్ అంటే ఒకటి తర్వాత 600 సున్నలు అని ఠకీమని చెప్పగలిగి ఉండేవాళ్ళం. కాని ఈ అమెరికా వాడి సొద వల్ల ఆ సౌలభ్యం పోయి ఒకటి తర్వాత 303 సున్నలు చుడితే అది సెంటిలియన్ అయింది.
పాశ్చాత్యుల లెక్కింపు పద్ధతిలో మిలియను, పది మిలియనులు, వంద మిలియనులు, బిలియను, పది బిలియనులు, వంద బిలియనులు, ట్రిలియను, పది ట్రిలియనులు, వంద ట్రిలియనులు,… అంటూ లెక్కపెడతారే, మరి భారత దేశంలో వెయ్యి, పది వేలు, లక్ష, పది లక్షలు, కోటి, పది కోట్లు, అంటూ లెక్క పెట్టి అటుపైన నూరు కోట్లు, వెయ్యి కోట్లు, పదివేల కోట్లు, లక్ష కోట్లు, పది లక్షల కోట్లు.… అంటారెందుకు? పది లక్షల కోట్ల తరువాత ఏమిటి వస్తుంది? కోటి కోట్లా? కోటి కోట్ల తరువాత? ఇలా పెద్ద పెద్ద సంఖ్యలని లెక్కపెట్టటానికి ప్రస్తుతం తెలుగులో వాడుకలో ఉన్నవి, అందరికీ అర్ధం అయేవి, తర్కబద్ధం అయినవి అయిన మాటలే లేవు. ఉదాహరణకి మన లెక్కింపు పద్ధతి ప్రకారం 300,00,00,00,00,00,000 అనే సంఖ్యని ఏమని పిలవాలి? అర్బుదాలు, మహా పద్మాలు, శంఖాలు వాడకుండా చెప్పండి చూద్దాం.
ఈ ఇబ్బందులని ఇక్కడ పరిష్కరించటానికి బదులు మనం పెద్ద పెద్ద సంఖ్యలని వాడవలసి వచ్చినప్పుడు ఒక మిలియను (1,000,000), పది మిలియనులు, వంద మిలియనులు, ఒక బిలియను (1,000,000,000), పది బిలియనులు, వంద బిలియనులు, ఒక ట్రిలియను (1,000,000,000,000), … అంటూ లెక్క పెడదాం. ఇది అంతర్జాతీయ పద్ధతి కనుక తెలుగులోంచి ఇంగ్లీషులోకి మారినప్పుడు ఇబ్బంది ఉండదు.
2. కామాలు పెట్టే నియమం
మీరు గమనించేరో లేదో! నేను పాశ్చాత్య పద్ధతిలో సంఖ్యలు రాసేటప్పుడు మూడేసి అంకెలని ఒక గుంపుగా గుప్పించి, వాటిని విడదీస్తూ కామాలు పెట్టేను. ఉదాహరణకి 46,520,000 అనే సంఖ్యని “నలభయ్ ఆరు మిలియన్ల ఐదువందల ఇరవై వేలు అని పాశ్చాత్య పద్ధతిలో అంటాము. ఇదే సంఖ్యని భారతీయ పద్ధతిలో రాసినప్పుడు 4,65,20,000 అంటూ కామాలతో విడదీసి రాస్తాము. ఈ సంఖ్య ఇప్పుడు నాలుగు కోట్ల 65 లక్షల ఇరవై వేలు అని చదువుతాం. కనుక రాసే పద్ధతికీ, చదివే పద్ధతికీ అన్వయం చూసుకోవాలి.
3. చిన్న చిన్న సంఖ్యలని లెక్క పెట్టటం
అలాగే చిన్న చిన్న సంఖ్యలని వాడవలసి వచ్చినప్పుడు మిల్లీ (వెయ్యవ వంతు), మైక్రో (మిలియనవ వంతు), పికో (బిలియనవ వంతు), అనే పూర్వ ప్రత్యయాలు వాడదాం. అలవాటు చేసుకుంటే అవే అలవాటు అయిపోతాయి. విశ్వశాస్త్రాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఇంకా చిన్న సంఖ్యల అవసరం వస్తుంది. అప్పుడు మిల్లీ, మైక్రో, పికో, మొదలైనవి సరిపోకపోవచ్చు.
4. పెద్ద సంఖ్యలని, చిన్న సంఖ్యలని రాసే పద్ధతి
పెద్ద పెద్ద సంఖ్యలని, చిన్న చిన్న సంఖ్యలనీ రాసి చూపించటానికి ఒక శాస్త్రీయ పద్ధతి ఉంది. ఈ పద్ధతిని ఘాతీయ పద్ధతి (exponential notation) అంటారు. ఈ పద్ధతితో సుఖం ఏమిటంటే సంఖ్యల పేర్ల ముందు వచ్చే పూర్వ ప్రత్యయాలని కంఠస్థం చేసి గుర్తు పెట్టుకోనవసరం లేదు. ఈ ఘాతీయ పద్ధతిని కూడ రకరకాలుగా రాయవచ్చు. ఇక్కడ మనకి అనుకూలమైన పద్ధతి కంప్యూటరు రంగం నుండి అరువు తెచ్చేను. ఉదాహరణకి, 10E1 అంటే 10 ని ఒకసారి వెయ్యటం. 10E2 అంటే 10 ని రెండు సార్లు వేసి గుణించగా వచ్చినది లేదా 100 అని అర్ధం. 10E2 లో ఉన్న 2 ఒకటి తరువాత రెండు సున్నలు ఉన్నాయని చెబుతోందన్నమాట. ఇదే సూత్రం ప్రకారం 10E3 = 1000, 10E6 = 1,000,000 = మిలియను.
ఇదే ధోరణిలో చిన్న చిన్న సంఖ్యలని కూడ రాయవచ్చు. ఉదాహరణకి 10E-1 అంటే 1 ని 10 చేత భాగించగా వచ్చిన 0.1. అలాగే 1E-2 అంటే 1 ని 100 చేత భాగించగా వచ్చిన 0.01. ఇదే సూత్రం ప్రకారం 10E-3 = 0.001, 10E-6 = 0.000001.
ఈ పద్ధతి ఉపయోగించి కొన్ని విషయాలు చెబుతాను. ఒక సంవత్సరంలో 31.7E6 సెకండ్లు ఉన్నాయి. కావలిస్తే లెక్క కట్టి చూసుకొండి. భూమి నుండి సూర్యుడి సగటు దూరం 150E6 కిలోమీటర్లు. ఈ భూమి వయస్సు ఉరమరగా 4.6E9 = 4.6 బిలియను సంవత్సరాలు. మన సూర్యుడి నుండి మనకి అత్యంత సమీపంగా ఉన్న ఆల్ఫా సెంటారీ నక్షత్రం దూరం 40E12 = 40 ట్రిలియను కిలోమీటర్లు. విశ్వంలో ఉరమరగా 10E22 నక్షత్రాలు ఉన్నాయి ట. విశ్వంలో 10E80 ప్రాధమిక రేణువులు ఉన్నాయని ఒక అంచనా!
మరికొన్ని ఉదాహరణలు ఇస్తాను. మనం చూడటానికి వెలుగు (లేదా కాంతి) కావాలి కదా. బొమ్మ గీసినప్పుడు ఈ కాంతిని కిరణాల (లేదా గీతల) మాదిరి చూపించినా, నిజానికి కాంతి కెరటాల మాదిరి ఉంటుంది. ఇవి సెకండుకి 600 ట్రిలియను (లేదా 600E12 లేదా 6E14) కెరటాలు చొప్పున వచ్చి మన కంటిని చేరుకుంటాయి, తెలుసా? ఈ కాంతి సూర్యుడి నుండి మన కంటికి ఎంత జోరుగా ప్రయాణం చేసి వచ్చిందో తెలుసా? సెకండుకి 3E10 సెంటీమీటర్లు చొప్పున! ఈ కాంతి కెరటాల శిఖకి, శిఖకి మధ్య దూరం (దీనినే ఇంగ్లీషులో wavelength అంటారు) కావాలంటే కాంతి వేగం అయిన 3E10 ని కాంతి కెరటాల జోరు (frequency) అయిన 6E14 చేత భాగించటమే. అలా భాగిస్తే 0.5E-4 సెంటీమీటర్లు వస్తుంది. దీనిని 0.00005 సెంటీమీటర్లు అని రాయవచ్చు. ఇది సెంటీమీటరులో 20 లక్షో భాగం. ఇంత చిన్న పొడుగు మన కంటికి ఆనదు. అందుకనే కాంతి నిజంగా తరంగమే అయినా మన కంటికి కిరణం లా కనిపిస్తుంది.
ఇలా లెక్కలు వేసి చూపిస్తూన్నా ఈ సంఖ్యలని నేనూ ఊహించలేను, నేనూ ఆకళింపు చేసుకోలేను. కాని ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే, క్రమేపీ, మనకి అలవాటు అయిపోయి, మన నైజం గా మారిపోతుంది.
ఈ వ్యాసం భౌతిక శాస్త్రంలో పాఠంలా అనిపించినా, ఈ రకం సంఖ్యలు, ఊహలు మనకి కొల్లలుగా ఎదురవుతాయి. ఎప్పుడో ఒకప్పుడు నేర్చుకోవాలి కనుక, అవసరం వచ్చే ముందే నేర్చేసుకుంటే సరిపోతుంది.
EXPONENT XX MULTIPLICATION AA WORD NAME
10E2 10 x 10 HUNDRED
10E3 10 x 10 x 10 THOUSAND
10E6 MULTIPLY 6 TENS MILLION
10E12 MULTIPLY 12 TENS TRILLION
10E15 MULTIPLY 15 TENS QUADRILLION
10E18 MULTIPLY 18 TENS QUINTILLION
10E21 MULTIPLY 21 TENS SEXTILLION
10E24 MULTIPLY 24 TENS SEPTILLION
10E27 MULTIPLY 27 TENS OCTILLION
10E30 MULTIPLY 30 TENS NONILLION OR NOVENTILLION
10E33 MULTIPLY 33 TENS DECILLION
10E36 MULTIPLY 36 TENS UNDECILLION
10E39 MULTIPLY 39 TENS DUODECILLION
10E42 MULTIPLY 42 TENS TREDECILLION
10E45 MULTIPLY 45 TENS QUATTUORDECILLION
10E48 MULTIPLY 48 TENS QUINDECILLION
10E51 MULTIPLY 51 TENS SEXDECILLION
10E54 MULTIPLY 54 TENS SEPTENDECILLION
10E57 MULTIPLY 57 TENS OCTODECILLION
10E60 MULTIPLY 60 TENS NOVEMDECILLION
10E63 MULTIPLY 63 TENS VIGINTILLION
10E100 MULTIPLY 100 TENS GOOGOL
10Egoogol MULTIPLY GOOGOL TENS! GOOGOLPLEX
2. లెక్కకు అందని సంఖ్యామానం
వేమూరి వేంకటేశ్వరరావు
అష్టావక్రుడి కథ, రోమహర్షుడి ఉదంతం చదివిన తరువాత సృష్టి, లయ ఎంతో పురాతనమైన సంఘటనలే అని అనిపించకమానదు. ఆధునిక శాస్త్రం దృష్ట్యా కూడ విశ్వం బహు పురాతనమైనది. నిజానికి విశ్వ స్వరూపాన్ని ఆకళింపు చేసుకోవాలంటే ఊహకి అందని దూరాలనీ, ఊహకి అందని కాలాలనీ, ఊహకి అందని సంఖ్యామానాలనీ ఊహించుకోవటానికి అలవాటు పడాలి. ఈ విశ్వం 13.7 బిలియను సంవత్సరాల క్రితం పుట్టిందని నేను చెపితే సామాన్యులలో ఎంతమందికి అర్ధం అవుతుంది? ఈ సూర్య మండలం పుట్టి 4.6 బిలియను సంవత్సరాలు అయిందంటే ఎంతమందికి అవగాహన అవుతుంది? ఈ భూమి పుట్టి 4 బిలియను సంవత్సరాలు అయిందంటే అందరూ ఆకళింపు చేసుకోగలరా? వేలకీ, లక్షలకీ, కోట్లకీ అలవాటు పడిపోయిన మన ప్రాణాలకి మిలియను, బిలియను ఊహించుకోవటం వీలవుతుందా? ఇంతకీ కోటి పెద్దదా? బిలియను పెద్దదా? అలాగే విశ్వం భ్రూణ దశలో 1E-35 సెకండ్ల కాలం గడిపిందని నేను అంటే, వివరణ లేకుండా, నా సహాధ్యాయులే అర్ధం చేసుకోలేరు.
1. పెద్ద పెద్ద సంఖ్యలని లెక్క పెట్టటం
పెద్ద పెద్ద సంఖ్యలని ఊహించటమే కాదు, వాటిని లెక్క పెట్టటం కూడ భారతీయులకి వెన్నతో పెట్టిన విద్య. ఉదాహరణకి పెద్ద పెద్ద సంఖ్యలని లెక్కపెట్టటంలో ఉన్న కష్టసుఖాలని ఒకసారి పరిశీలించి చూద్దాం.
ఒకటి పక్కన సున్న వేస్తే అది పది. పదిని ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు. మన చేతులకి పది వేళ్లు ఉన్నాయి కదా!
ఒకటి పక్కన రెండు సున్నలు చుడితే అది వంద లేక నూరు. వందని ఊహించుకోవడం కూడ పెద్ద కష్టం కాదు. వంద రూపాయలు ఖర్చు పెడితే ఏమీ రాని ఈ రోజులలో వంద పెద్ద సంఖ్య కానే కాదు. నా చిన్నతనంలో పెళ్లికొడుక్కి నూటపదహార్లు కట్నం ఇచ్చేవారు!
ఒకటి పక్కన మూడు సున్నలు చుడితే అది వెయ్యి.
ఇంతవరకు ఒకొక్క సున్న చేర్చినప్పుడల్లా సంఖ్య విలువతో పాటు ఆ సంఖ్య పేరు కూడ మారింది: పది, వంద, వెయ్యి.
ఒకటి పక్కన నాలుగు సున్నలు చుట్టటంతో మనం పేర్లు పెట్టే బాణీలో కొంచెం మార్పు వచ్చింది. మునపటిలా 10,000 కి మరో కొత్తపేరు పెట్టకుండా “పది” అనే పూర్వ ప్రత్యయం చేర్చి “పదివేలు” అనేసి ఊరుకున్నాం. ఎంతకని కొత్త పేర్లు పెట్టకలం?
మనమే కాదు ఇంగ్లీషు వాడూ ఇదే పని చేసి, “టెన్, హండ్రెడ్, థౌజండ్” అయిన తర్వాత మనలాగే “టెన్ థౌజండ్” అన్నాడు. కాని ఇంగ్లీషు వాడు మన దేశం రాక పూర్వం దీనిని “మిరయడ్” అనే పేరుతో పిలచేవాడు.
ఒకటి పక్కన ఐదు సున్నలు చుడితే అది లక్ష. దీన్ని హిందీలోనూ, ఇంగ్లీషులోనూ కూడ “లేక్” అంటారు. పూర్వం గొప్పవాళ్లు లక్షాధికారులు. “వాళ్లింట్లో లక్షలు మూలుగుతున్నాయి!” అనుకునే వాళ్లం. ఇప్పుడు లక్ష అంటే ఎవ్వరూ ఖాతరు చెయ్యటం లేదు.
ఒకటి పక్కన ఆరు సున్నలు చుట్టగా వచ్చిన సంఖ్య పది లక్షలు లేదా మిలియను. అమెరికాలో మిలియను డాలర్లు ఆస్తి ఉంటే మధ్య తరగతిలో కొంచెం పైమెట్టు లో ఉన్నట్లు లెక్క వేసుకోవచ్చు. భారత దేశంలో లక్షాధికార్లకి పట్టిన గతే అమెరికాలో ఈ మిలియనీర్లకి కూడ పడుతోంది. బిలియనీర్లు వచ్చిన తరువాత మిలియనీర్ల ముఖాలు ఎవ్వరూ చూడటం లేదు.
ఒకటి పక్కన ఏడు సున్నలు చుడితే అది కోటి. దీన్ని హిందీలో “కరోర్” అంటారు. ఇదే ఇంగ్లీషులో “క్రోర్”. ఈ రోజులలో గొప్పవాళ్లు కోటీశ్వరులు, లేదా కరోర్పతులు. “వాళ్లింట్లో డబ్బు కోటికి పడగలు ఎత్తింది!” అనుకునే వాళ్లం. అంత డబ్బుంటే ఆ డబ్బు పాములుగా మారిపోతుందనే కథ నా బాల్యంలో వినేవాడిని.
కోటిని ఊహించుకోవడం కొంచెం కష్టం నా బోంట్లకి. ఉదాహరణకి భారతదేశం జనాభా ఉరమరగా 100 కోట్లు! ఈ వంద కోట్ల ప్రజలని ఒకేసారి చూడలేము కనుక ఈ విషయం ఊహించుకుందికి ఉపయోగపడదు. సాధారణ శకం (సా. శ.) 1992 లో ఆంధ్రప్రదేశ్లో పుగాకు, సారా వగైరాల అమ్మకం పన్ను ద్వారా వచ్చిన ఆదాయం 840 కోట్ల రూపాయలుట!
ఒకటి పక్కన ఎనిమిది సున్నలు చుడితే వచ్చే సంఖ్యకి మంచిపేరు, నలుగురికీ పరిచయం అయిన పేరు ఏదీ లేదు. పదికోట్లు అనో, దశకోటి అనో, వంద మిలియన్లు అనో అనవచ్చు; కాని అవి కొత్త పేర్లు కావు. “వెంకట్రావ్, పెద వెంకట్రావ్” అన్నట్టు పాత పేర్లనే పునరావృతం చేసేం, అంతే.
ఒకటి పక్కన తొమ్మిది సున్నలు చుడితే వచ్చే సంఖ్య వంద కోట్లు లేదా బిలియను. మిలియను ఊహించుకోవటం చేతనయిన వాళ్లకి కూడ బిలియను ఊహించుకోవటం కష్టం. ఈ భూలోకపు జనాభా 5 బిలియనుల పై చిల్లర అంటే ఉపయోగపడుతుందేమో ఆలోచించుకొండి.
అసలు ఆధునిక శాస్త్రీయ యుగం మొదలయే వరకు పాశ్చాత్య దేశాలలో పెద్ద పెద్ద సంఖ్యలతో పనే ఉండేది కాదు. బిలియనుతో సామాన్యులకి అవసరం ఏముంటుంది? కనుక మొన్న మొన్నటి వరకూ పాశ్చాత్య భాషలలో పెద్ద పెద్ద సంఖ్యలకి పేర్లే లేవు. పని ఉంటే కదా పేర్ల అవసరం? కాని భారతదేశంలో ఏమి పని వచ్చిందో తెలియదు కాని “పెద్ద పెద్ద” సంఖ్యలకే కాదు, “పేద్ద పేద్ద” సంఖ్యలకి కూడ పేర్లు ఉన్నాయి. ఉదాహరణకి ఒకటి తర్వాత 11 సున్నలు చుడితే అది అర్బుదం, 13 సున్నలకి ఖర్వం, 15 సున్నలకి పద్మం, 17 సున్నలకి క్షోణి, 19 సున్నలకి శంఖం, ఇలాగే తరువాయి బేసి సంఖ్యల సున్నలుంటే వాటిని క్రమంగా క్షితి, క్షోభం, నిధి, సరి సంఖ్యలైన సున్నలుంటే వాటి పేరుకి “మహా” తగిలించి మహాపద్మం, మహాఖర్వం, వగయిరా పేర్లు. ఒకటి తర్వాత 27 సున్నలుంటే పర్వతం, 28 పరార్థం, 29 అనంతం. ముప్పయ్ సున్నలుంటే సాగరం, 31 అవ్యయం, 32 అచింత్యం, 33 అమేయం, … భూరి, వృందం, అన్న పేర్లు ఉన్నాయి. ఈ లెక్కలో వృందం తర్వాత ఏమి పేర్లు వస్తాయో ఇదమిత్థంగా తెలియదు కానీ రావణాసురుడి సైన్యం ఎంత పెద్దదో వర్ణిస్తూ వాల్మీకి ఒకటి తర్వాత 55 సున్నలు చుడితే వచ్చే సంఖ్యంత అని చెప్పి దానికి మహౌఘం అని పేరు పెట్టేడు.
ఈ పేర్లు భారత దేశంలో వాడుకలో లేవు కానీ వారి దగ్గర ఈ పేర్లు నేర్చుకున్న జపాను వాళ్లు ఇప్పటికీ వీటిని వాడుతున్నారు. మచ్చుకి ఒకటి తర్వాత 80 సున్నలు వేయగా వచ్చిన సంఖ్యని జపాను వాళ్ళు “పుకషీగీ” అంటారు. పుకషీగీ అంటే ఆలోచనకి అందనిది లేదా “అచింత్యం”. ఒకటి తర్వాత 56 సున్నలు వేయగా వచ్చిన సంఖ్యని “కుగాషా” అంటారు. కుగాషా అంటే “గంగా నది ఒడ్డున ఉన్న ఇసకంత” అని అర్థం ట!
భారతీయులు పేర్లు పెట్టటం అంటూ పెట్టేరు కానీ, ఈ పేర్లలో ఒక బాణీ లేకపోతే జ్ఞాపకం పెట్టుకోవటం కష్టం. అప్పుడు ఒకదానికి మరొక పేరు వాడే ప్రమాదం ఉంది. భారతీయ ప్రాచీన గ్రంథాలలో, మచ్చుకి, ఒకటి తర్వాత 12 సున్నలు ఉన్న సంఖ్యని ఒక చోట మహార్బుదం అన్నారు, మరొక చోట న్యర్బుదం అన్నారు. ఇలాంటి ఇబ్బందుల నుండి తప్పించుకుందికి అధునాతనులు ఒక పద్ధతి ప్రవేశపెట్టేరు. ఈ పద్ధతిలో సంఖ్యల పేర్లలో బాణీ ఈ విధంగా ఉంటుంది: పది, వంద, వెయ్యి మామూలే. తరువాత కొత్త పేరు ఒకటి తర్వాత ఆరు సున్నలు చుట్టగా వచ్చిన మిలియను. తరువాత కొత్తపేరు ఒకటి తరువాత తొమ్మిది సున్నలు చుట్టగా వచ్చిన బిలియను. అలా మూడేసి సున్నలు అధికంగా చేర్చినప్పుడల్లా మరొక కొత్త పేరు. ఈ లెక్కని ఒకటి తర్వాత ఆరు సున్నలుంటే మిలియను, తొమ్మిది ఉంటే బిలియను, 12 అయితే ట్రిలియను, 15 సున్నలకి క్వాడ్రిలియను, తదుపరి క్వింటిలియను, అలా.
బాగానే ఉందయ్యా! ఇవన్నీ “లియను” అనే శబ్దంతో అంతం అవుతున్నాయి. కాని ఈ “లియను” ముందుండే పూర్వప్రత్యయం జ్ఞాపకం పెట్టుకోవడం ఎలా? ఈ పూర్వ ప్రత్యయాలని విడిగా, వరసగా వాటి అర్థాలతో రాసి చూద్దాం.
లేటిన్ భాషలో బి రెండు, ట్రి మూడు, క్వాడ్ నాలుగు, క్వింట్ అయిదు, సెక్స్ట్ ఆరు, సెప్ట్ ఏడు, ఆక్ట్ ఎనిమిది, నవ్ తొమ్మిది … అలా అలా వెళుతుందీ వరస. ఈ వరస అర్థం ఏమిటంటే మిలియనుని మూలంగా తీసుకుని ఆ మిలియనుని రెండు సార్లు వేసి హెచ్చవేస్తే వచ్చే సంఖ్య బిలియను, మూడు సార్లు గుణిస్తే వచ్చే సంఖ్య ట్రిలియను, నాలుగు సార్లు గుణకారం చెయ్యగా వచ్చింది క్వాడ్రిలియన్, ..
ఆగాలి, కొంచెం ఆగాలి.. ఇక్కడ నేను తప్పేనా చెబుతూ ఉండుండాలి, మీరు తప్పేనా అర్థం చేసుకుని ఉండుండాలి. ఎందుకంటే మిలియనుని రెండు సార్లు వేసి గుణిస్తే ఒకటి తర్వాత 12 సున్నలు వస్తాయి కాని తొమ్మిది రావు. నిజానికి అది నిజమే. బ్రిటిష్ వాళ్ల హయాంలో ఈ ప్రపంచం ఉన్నప్పుడు వాళ్లు అన్నీ తార్కికంగా ఆలోచించి ఒక పద్ధతిలో పేర్లు పెట్టేరు. ఒకటి తర్వాత 12 సున్నలుంటే దానిని బిలియను అనీ, 18 సున్నలుంటే దానిని ట్రిలియను అనీ, అలా అనుకుంటూ వెళ్లమన్నారు. అలాగే వెళ్లేవాళ్లం. తరువాత ఈ అమెరికా వాళ్లు వచ్చేరు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి, పైపెచ్చు ఈ అమెరికా వాడి దగ్గర డబ్బు మస్తుగా ఉంది. దాంతో జబ్బశక్తి, గోరోజనం పుంజుకున్నాయి. తన శక్తిని ప్రపంచానికి చాటడం ఎలా? ఇంగ్లీషువాడు ఎడం పక్కని నడిపితే తను కుడి పక్కన కారు నడుపుతానన్నాడు. ఇంగ్లీషు మాటలకు స్పెల్లింగులు మార్చేస్తానన్నాడు. కొన్నింటికి అర్థాలే మార్చీసేడు. అందుకనే ఈ రోజులలో బిలియను అంటే ఒకటి తర్వాత తొమ్మిది సున్నలే. ట్రిలియను అంటే ఒకటి తర్వాత 12 సున్నలూ, అలాగ వెళుతోంది ఈ బండి. ఈ మార్పు వల్ల వచ్చిన నష్టం ఏమిటంటే పూర్వప్రత్యయాన్ని చూసి ఆ సంఖ్యలో ఎన్ని సున్నలుంటాయో చెప్పడం కష్టం; బట్టీ పట్టేయాలి అంతే.
ఈ పేర్లు ఇంకా ఎంత దూరం వెళతాయి? మిలియనుని వంద సార్లు వేసి హెచ్చవేస్తే వచ్చే సంఖ్యని “సెంటిలియన్” అనమన్నాడు బ్రిటిషువాడు. అప్పుడు సెంటిలియన్ అంటే ఒకటి తర్వాత 600 సున్నలు అని ఠకీమని చెప్పగలిగి ఉండేవాళ్ళం. కాని ఈ అమెరికా వాడి సొద వల్ల ఆ సౌలభ్యం పోయి ఒకటి తర్వాత 303 సున్నలు చుడితే అది సెంటిలియన్ అయింది.
పాశ్చాత్యుల లెక్కింపు పద్ధతిలో మిలియను, పది మిలియనులు, వంద మిలియనులు, బిలియను, పది బిలియనులు, వంద బిలియనులు, ట్రిలియను, పది ట్రిలియనులు, వంద ట్రిలియనులు,… అంటూ లెక్కపెడతారే, మరి భారత దేశంలో వెయ్యి, పది వేలు, లక్ష, పది లక్షలు, కోటి, పది కోట్లు, అంటూ లెక్క పెట్టి అటుపైన నూరు కోట్లు, వెయ్యి కోట్లు, పదివేల కోట్లు, లక్ష కోట్లు, పది లక్షల కోట్లు.… అంటారెందుకు? పది లక్షల కోట్ల తరువాత ఏమిటి వస్తుంది? కోటి కోట్లా? కోటి కోట్ల తరువాత? ఇలా పెద్ద పెద్ద సంఖ్యలని లెక్కపెట్టటానికి ప్రస్తుతం తెలుగులో వాడుకలో ఉన్నవి, అందరికీ అర్ధం అయేవి, తర్కబద్ధం అయినవి అయిన మాటలే లేవు. ఉదాహరణకి మన లెక్కింపు పద్ధతి ప్రకారం 300,00,00,00,00,00,000 అనే సంఖ్యని ఏమని పిలవాలి? అర్బుదాలు, మహా పద్మాలు, శంఖాలు వాడకుండా చెప్పండి చూద్దాం.
ఈ ఇబ్బందులని ఇక్కడ పరిష్కరించటానికి బదులు మనం పెద్ద పెద్ద సంఖ్యలని వాడవలసి వచ్చినప్పుడు ఒక మిలియను (1,000,000), పది మిలియనులు, వంద మిలియనులు, ఒక బిలియను (1,000,000,000), పది బిలియనులు, వంద బిలియనులు, ఒక ట్రిలియను (1,000,000,000,000), … అంటూ లెక్క పెడదాం. ఇది అంతర్జాతీయ పద్ధతి కనుక తెలుగులోంచి ఇంగ్లీషులోకి మారినప్పుడు ఇబ్బంది ఉండదు.
2. కామాలు పెట్టే నియమం
మీరు గమనించేరో లేదో! నేను పాశ్చాత్య పద్ధతిలో సంఖ్యలు రాసేటప్పుడు మూడేసి అంకెలని ఒక గుంపుగా గుప్పించి, వాటిని విడదీస్తూ కామాలు పెట్టేను. ఉదాహరణకి 46,520,000 అనే సంఖ్యని “నలభయ్ ఆరు మిలియన్ల ఐదువందల ఇరవై వేలు అని పాశ్చాత్య పద్ధతిలో అంటాము. ఇదే సంఖ్యని భారతీయ పద్ధతిలో రాసినప్పుడు 4,65,20,000 అంటూ కామాలతో విడదీసి రాస్తాము. ఈ సంఖ్య ఇప్పుడు నాలుగు కోట్ల 65 లక్షల ఇరవై వేలు అని చదువుతాం. కనుక రాసే పద్ధతికీ, చదివే పద్ధతికీ అన్వయం చూసుకోవాలి.
3. చిన్న చిన్న సంఖ్యలని లెక్క పెట్టటం
అలాగే చిన్న చిన్న సంఖ్యలని వాడవలసి వచ్చినప్పుడు మిల్లీ (వెయ్యవ వంతు), మైక్రో (మిలియనవ వంతు), పికో (బిలియనవ వంతు), అనే పూర్వ ప్రత్యయాలు వాడదాం. అలవాటు చేసుకుంటే అవే అలవాటు అయిపోతాయి. విశ్వశాస్త్రాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఇంకా చిన్న సంఖ్యల అవసరం వస్తుంది. అప్పుడు మిల్లీ, మైక్రో, పికో, మొదలైనవి సరిపోకపోవచ్చు.
4. పెద్ద సంఖ్యలని, చిన్న సంఖ్యలని రాసే పద్ధతి
పెద్ద పెద్ద సంఖ్యలని, చిన్న చిన్న సంఖ్యలనీ రాసి చూపించటానికి ఒక శాస్త్రీయ పద్ధతి ఉంది. ఈ పద్ధతిని ఘాతీయ పద్ధతి (exponential notation) అంటారు. ఈ పద్ధతితో సుఖం ఏమిటంటే సంఖ్యల పేర్ల ముందు వచ్చే పూర్వ ప్రత్యయాలని కంఠస్థం చేసి గుర్తు పెట్టుకోనవసరం లేదు. ఈ ఘాతీయ పద్ధతిని కూడ రకరకాలుగా రాయవచ్చు. ఇక్కడ మనకి అనుకూలమైన పద్ధతి కంప్యూటరు రంగం నుండి అరువు తెచ్చేను. ఉదాహరణకి, 10E1 అంటే 10 ని ఒకసారి వెయ్యటం. 10E2 అంటే 10 ని రెండు సార్లు వేసి గుణించగా వచ్చినది లేదా 100 అని అర్ధం. 10E2 లో ఉన్న 2 ఒకటి తరువాత రెండు సున్నలు ఉన్నాయని చెబుతోందన్నమాట. ఇదే సూత్రం ప్రకారం 10E3 = 1000, 10E6 = 1,000,000 = మిలియను.
ఇదే ధోరణిలో చిన్న చిన్న సంఖ్యలని కూడ రాయవచ్చు. ఉదాహరణకి 10E-1 అంటే 1 ని 10 చేత భాగించగా వచ్చిన 0.1. అలాగే 1E-2 అంటే 1 ని 100 చేత భాగించగా వచ్చిన 0.01. ఇదే సూత్రం ప్రకారం 10E-3 = 0.001, 10E-6 = 0.000001.
ఈ పద్ధతి ఉపయోగించి కొన్ని విషయాలు చెబుతాను. ఒక సంవత్సరంలో 31.7E6 సెకండ్లు ఉన్నాయి. కావలిస్తే లెక్క కట్టి చూసుకొండి. భూమి నుండి సూర్యుడి సగటు దూరం 150E6 కిలోమీటర్లు. ఈ భూమి వయస్సు ఉరమరగా 4.6E9 = 4.6 బిలియను సంవత్సరాలు. మన సూర్యుడి నుండి మనకి అత్యంత సమీపంగా ఉన్న ఆల్ఫా సెంటారీ నక్షత్రం దూరం 40E12 = 40 ట్రిలియను కిలోమీటర్లు. విశ్వంలో ఉరమరగా 10E22 నక్షత్రాలు ఉన్నాయి ట. విశ్వంలో 10E80 ప్రాధమిక రేణువులు ఉన్నాయని ఒక అంచనా!
మరికొన్ని ఉదాహరణలు ఇస్తాను. మనం చూడటానికి వెలుగు (లేదా కాంతి) కావాలి కదా. బొమ్మ గీసినప్పుడు ఈ కాంతిని కిరణాల (లేదా గీతల) మాదిరి చూపించినా, నిజానికి కాంతి కెరటాల మాదిరి ఉంటుంది. ఇవి సెకండుకి 600 ట్రిలియను (లేదా 600E12 లేదా 6E14) కెరటాలు చొప్పున వచ్చి మన కంటిని చేరుకుంటాయి, తెలుసా? ఈ కాంతి సూర్యుడి నుండి మన కంటికి ఎంత జోరుగా ప్రయాణం చేసి వచ్చిందో తెలుసా? సెకండుకి 3E10 సెంటీమీటర్లు చొప్పున! ఈ కాంతి కెరటాల శిఖకి, శిఖకి మధ్య దూరం (దీనినే ఇంగ్లీషులో wavelength అంటారు) కావాలంటే కాంతి వేగం అయిన 3E10 ని కాంతి కెరటాల జోరు (frequency) అయిన 6E14 చేత భాగించటమే. అలా భాగిస్తే 0.5E-4 సెంటీమీటర్లు వస్తుంది. దీనిని 0.00005 సెంటీమీటర్లు అని రాయవచ్చు. ఇది సెంటీమీటరులో 20 లక్షో భాగం. ఇంత చిన్న పొడుగు మన కంటికి ఆనదు. అందుకనే కాంతి నిజంగా తరంగమే అయినా మన కంటికి కిరణం లా కనిపిస్తుంది.
ఇలా లెక్కలు వేసి చూపిస్తూన్నా ఈ సంఖ్యలని నేనూ ఊహించలేను, నేనూ ఆకళింపు చేసుకోలేను. కాని ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే, క్రమేపీ, మనకి అలవాటు అయిపోయి, మన నైజం గా మారిపోతుంది.
ఈ వ్యాసం భౌతిక శాస్త్రంలో పాఠంలా అనిపించినా, ఈ రకం సంఖ్యలు, ఊహలు మనకి కొల్లలుగా ఎదురవుతాయి. ఎప్పుడో ఒకప్పుడు నేర్చుకోవాలి కనుక, అవసరం వచ్చే ముందే నేర్చేసుకుంటే సరిపోతుంది.
EXPONENT XX MULTIPLICATION AA WORD NAME
10E2 10 x 10 HUNDRED
10E3 10 x 10 x 10 THOUSAND
10E6 MULTIPLY 6 TENS MILLION
10E12 MULTIPLY 12 TENS TRILLION
10E15 MULTIPLY 15 TENS QUADRILLION
10E18 MULTIPLY 18 TENS QUINTILLION
10E21 MULTIPLY 21 TENS SEXTILLION
10E24 MULTIPLY 24 TENS SEPTILLION
10E27 MULTIPLY 27 TENS OCTILLION
10E30 MULTIPLY 30 TENS NONILLION OR NOVENTILLION
10E33 MULTIPLY 33 TENS DECILLION
10E36 MULTIPLY 36 TENS UNDECILLION
10E39 MULTIPLY 39 TENS DUODECILLION
10E42 MULTIPLY 42 TENS TREDECILLION
10E45 MULTIPLY 45 TENS QUATTUORDECILLION
10E48 MULTIPLY 48 TENS QUINDECILLION
10E51 MULTIPLY 51 TENS SEXDECILLION
10E54 MULTIPLY 54 TENS SEPTENDECILLION
10E57 MULTIPLY 57 TENS OCTODECILLION
10E60 MULTIPLY 60 TENS NOVEMDECILLION
10E63 MULTIPLY 63 TENS VIGINTILLION
10E100 MULTIPLY 100 TENS GOOGOL
10Egoogol MULTIPLY GOOGOL TENS! GOOGOLPLEX
Tuesday, September 7, 2010
1. లెక్కకు అందని కాలమానం - అనుబంధం
విశ్వస్వరూపం:
1. లెక్కకు అందని కాలమానం - అనుబంధం
హిందూ పురాణాలలో (ముఖ్యంగా, విష్ణుపురాణంలో) కాలమానం ఈ దిగువ చూపిన విధంగా వర్ణించబడింది. ఈ వర్ణన నేను సంప్రదించిన అన్ని గ్రంధాలలోనూ ఒకేలా లేదు. కాని, స్థూలంగా కథ ఈ దిగువ చూపిన విధంగా ఉంటుంది. ఈ దిగువ చూపిన కాలమానం నిజమా కాదా అన్న వివేచన ఇక్కడ అప్రస్తుతం; కాలగమనానికి ఇంత విస్తృతమైన నమూనా మన పూర్వులు నిర్మించేరంటే అది వారి ఊహాశక్తికి ఒక అపురూపమైన నిదర్శనం.
ఈ కింది లెక్క చూస్తూ ఉంటే మరొక విషయం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. యుగాల, మహాయుగాల, మన్వంతరాల, సంధ్యకాలాల పొడుగులు, బ్రహ్మ ఆయుర్దాయం, మొదలైన సంఖ్యలు – అన్నీ - 432 అనే సంఖ్య చుట్టూ పరిభ్రమించే విధంగా కిట్టించినట్టు కనబడుతుంది. ఉదాహరణకి మన భూలోకంలో ఒక సంవత్సరం పొడుగు ఇదమిత్థంగా “ఇంత” అని చెప్పలేము; ఏదో ఉరమరగా 365.242199 రోజులు అని సర్దుకుపోతున్నాం. కాని ఈ దిగువ లెక్కలో సంవత్సరం పొడుగు 360 రోజులు అని సౌలభ్యం కొరకు వాడబడింది. ఈ 360 ఇక్కడ వాడకపోతే తరువాత ఆ 432 రాదు. అలాగే మానవుని ఆయుర్దాయం 100 మానవ సంవత్సరాలు అనీ, బ్రహ్మ ఆయుర్దాయం 100 “బ్రహ్మ సంవత్సరాలు” అనీ అనటం లో శాస్త్రీయత లేదు. కనుక ఈ దిగువ చూపిన లెక్కలని ఓ గుటికెడు కషాయంతో సేవించండి.
మచ్చుకి ఈ కింది లెక్క చూడండి.. మన భూలోకంలో -
4,32,000 సంవత్సరములు = కలియుగం
8,64,000 సంవత్సరములు = ద్వాపర్యుగం
12,96,000 సంవత్సరములు = త్రేతాయుగం
17,28,000 సంవత్సరములు = కృతయుగం
ఈ 432 ఎక్కడనుండి వచ్చిందని అడగకండి. అదొక పెడదారి పట్టిస్తుంది.
ఈ నాలుగు యుగాల కాలాన్ని కూడితే 43,20,000 సంవత్సరాలు వస్తాయి. దీనిని ఒక మహాయుగం అంటారు. కనుక,
1 మహాయుగం = 43,20,000 సంవత్సరములు = 4.32 మిలియను సంవత్సరములు
1 మన్వంతరం = 71 మహాయుగాలు = 4.32 *71 = 306.72 మిలియను సంవత్సరాలు (ఇక్కడ నక్షత్రం గుర్తు గుణకారానికి వాడబడింది.)
ఇలాంటి మన్వంతరాలు 14 ఉన్నాయిట. (ఈ 71 అనే సంఖ్య 14 అనే సంఖ్య ఎక్కడినుండి ఊడిపడ్డాయో తెలుసుకోవాలంటే ఈ దిగువ ఇచ్చిన లెక్కని జాగ్రత్తగా చూడాలి.)
ప్రతి మన్వంతరం ప్రారంభంలోనూ, అంతంలోనూ కృతయుగపు ప్రమాణంలో ఒక సంధి కాలం (లేదా, సంధ్యా కాలం) ఉందని ఊహించుకుంటే ఒక కల్పం పొడుగు తెలుస్తుంది.
1 కల్పం = 14 మన్వంతరాలు + 15 సంధి కాలాలు = బ్రహ్మకి ఒక పగలు
1 బ్రహ్మ పగలు = 1 కల్పం = 306.72*14 + 1.728*15 = 4294.08 + 25.92 = 4,320 మిలియను సంవత్సరాలు = 4.32 బిలియను సంవత్సరాలు (ఇది బిలియను, మిలియను అని పొరబడకండి)
చూశారా, ఈ 432 అనే సంఖ్య రావటం కోసం ఎంత తంటాలు పడ్డారో. ఈ 432 కి వేద కాలం నుండీ ఒక ప్రత్యేకత ఉంది.
మరొక విషయం ఏమిటంటే, ఆధునిక శాస్త్రం ప్రకారం భూమి పుట్టి దరిదాపు 4 బిలియను సంవత్సరాలు పైబడి. ఇది కేవలం కాకతాళీయం అని మనం ఎంత అనుకున్నా, పురాణాలలో ఉన్న లెక్కకీ, మన ఆధునిక లెక్కకీ ఉన్న పోలిక కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
ఏది ఏమైతేనేమి – ఇటుపైన చెప్పే లెక్క అన్ని చోట్లా ఒకేలా కనిపించటం లేదు. చిన్న చిన్న తేడాలని విస్మరించి, లెక్కని స్థూలంగా చూద్దాం.
1 బ్రహ్మ రాత్రి = 1 కల్పం = 306.72*14 + 1.728*15 = 4294.08 + 25.92 = 4,320 మిలియను సంవత్సరాలు = 4.32 బిలియను సంవత్సరాలు
బ్రహ్మకి ఒక దినం = 1 పగలు + 1 రాత్రి = 8.640 బిలియను భూలోక సంవత్సరాలు
బ్రహ్మ ఆయుర్దాయం 100 బ్రహ్మ దినాలా, 100 బ్రహ్మ సంవత్సరాలా అన్నది ఒకొక్క చోట ఒక్కోలా ఉంది. మనం బ్రహ్మ ఆయుర్దాయం 100 బ్రహ్మ సంవత్సరాలు అనుకుందాం.
బ్రహ్మ ఆయుర్దాయం = 100 సంవత్సరాలు = 100 * 360 * 8.640 బిలియను భూలోక సంవత్సరాలు = 31104 బిలియను సంవత్సరాలు = 31.104 ట్రిలియను భూలోక సంవత్సరాలు = 1 పర
సృష్టి మొదలయిన దగ్గరనుండి ఇప్పటికి ఆరుగురు బ్రహ్మలు గతించేరు. గతించిన బ్రహ్మల పేర్లు: మానస, చాక్షుష, వాచిక, శ్రావణ, సత్య, అండజ.
ఇప్పుడు ఏడవ బ్రహ్మ అయిన పద్మజుని కాలంలో ఉన్నాం. ఈయన వయస్సు 51 వ సంవత్సరాలు. ఇందులో ప్రథమ కల్పమైన శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. మన సంవత్సరాలకి ప్రభవ, విభవ, శుక్ల మొదలైనవి 60 పేర్లు ఉన్నట్లే, ఈ కల్పాలకి 30 పేర్లు ఉన్నాయిట. ఆవి ఇక్కడ ఏకరవు పెట్టవలసిన అవసరం లేదు. కుతూహలం ఉన్నవాళ్లకి ఈ పేర్లు పురాణాలలో దొరుకుతాయి. ఉదాహరణకి కప్పగంతుల సుబ్బరాయశర్మ, కాలచక్రం, చూడండి. http://www.samputi.com/app_data/magazines/samputi12.pdf
ఇప్పుడు మనం ఈ శ్వేతవరాహ కల్పంలో వచ్చే 14 మన్వంతరాలలో ఏడవ మన్వంతరం అయిన వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. సరదా ఉన్న వాళ్లకి ఈ 14 మన్వంతరాల పేర్లు ఇక్కడ ఇస్తున్నాను: స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుస, వైవశ్వత, సూర్యసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్య, మరియు బౌచ్చ. (అల్లసాని పెద్దన రాసిన మనుచరిత్ర పై జాబితాలో రెండవ మనువైన స్వారోచిష మనువు గురించి అనుకుంటాను.)
ఈ వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గడిచి, ఇప్పుడు 28 వ మహాయుగంలో ఉన్నాం. ఈ 28 వ మహాయుగంలో కృత, త్రేత, ద్వాపర్ యుగాలు గడచిపోయేయి. కలియుగం ప్రవేశించి 5111 సంవత్సరాలు (ఇది రాసిన తేదీ సా. శ. 2010).
ఇంతవరకు కాలనిర్ణయం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు స్థల నిర్ణయం ఎలా జరుగుతుందో చూద్దాం.
పరిపాలనా సౌలభ్యం కొరకు మనువులు భూమిని 7 భాగాలుగా విభజించి పాలించేరు. ఆ ఏడు భాగాల పేర్లు ఇవి: జంబూద్వీపం, ప్లక్షద్వీపం, క్రౌంచద్వీపం, శాల్మిక ద్వీపం, పుష్కరద్వీపం, శాకద్వీపం. (ఈ ఏడు ద్వీపాలనీ ఏడు ఖండాలుగా మనం ఊహించుకోవచ్చు: ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా (ఇండియా ఉపఖండాన్ని మినహాయించి), మరియు ఇండియా ఉపఖండం.
ఆధునిక భారత దేశం జంబూద్వీపంలో ఉంది. ఈ జంబూ ద్వీపానికి అధిపతి పేరు నాభి. ఈ నాభికి మేరూదేవి యందు ఋషభుడు కలిగేడు. ఈ ఋషభుడుకి 100 మంది సంతానం. వీరిలో పెద్దవాడు భరతుడు. ఈ భరతుడు పాలించిన ప్రాంతమే భరతవర్షం. సముద్రానికి ఉత్తరమున, హిమాలయాలకి దక్షిణమున ఉన్న ప్రాంతమే భరతవర్షం. ఆధునిక పరిభాషలో చెప్పుకోవాలంటే ఇండియన్ సబ్కాంటినెంట్.
కనుక మనం పూజ చేసేటప్పుడు దేవుడికి మన చిరునామా నిర్ద్వందంగా చెబితే ఆయన మనం కోరిన కోరికలని మన చిరునామాకి పంపుతాడు. అందుకనే…”అద్యబ్రహ్మణః, ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే. అంటూ మనం ఉన్న కాలాన్ని, స్థలాన్ని చెప్పి అంతటితో ఊరుకోము. ఆ తరువాత మనం ఆ పూజ ఎప్పుడు చేస్తున్నామో కూడ “వేళ” చెప్పటానికి “అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన (…సంవత్సరే, ….ఆయనే, ….ఋతౌ, ….మాసే,…..పక్షే, ….తిధౌ,…, అంటూ కాలనిర్ణయం చేస్తాం.
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మన ఉనికిని చెప్పటానికి ఒక్క స్థలనిర్ణయం చేస్తే సరిపోదు, కాలనిర్ణయం కూడా చెయ్యాలని వేదకాలం నుండీ మనవాళ్లు గమనించేరు. ఇదే విషయాన్ని ఇరవైయ్యవ శతాబ్దపు ఆరంభంలో అయిన్స్టయిన్ వచ్చి, సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రవచించి, స్థల-కాల సమవాయాం (space-time continuum) అనే భావన ప్రవేశపెట్టి, “ఈ విశ్వం చతుర్ మితీయం – అనగా, ఈ విశ్వం నాలుగు దిశలలో వ్యాపించి ఉంది” అని ఉటంకించేసరికి, “ఔర! ఇదంతా మా పురాణాల్లో ఉందిస్మీ!” అని ఇప్పుడు అనుకుంటున్నాం.
మనవాళ్లు మరొక అడుగు ముందుకు వేసి, స్థలం, కాలం చెప్పినంత మాత్రాన్న సరిపోదు, మన ప్రవర కూడ చెప్పాలి అన్నారు. ఒక వంశవృక్షంలో ఉత్తమోత్తమమైన పూర్వుల పేర్లు చెప్పి, వారి వంశం వాడిని అని చెప్పటాన్ని “ప్రవర” చెప్పటం అంటారు. ఎవరికి తోచిన “పూర్వుల పేర్లు” వారు చెప్పకుండా ఒకే వంశంలో ఉన్నవారంతా ఒకే “పూర్వుల సమితిని” చెప్పటం ఆనవాయితీ. ఉదాహరణకి రామ శర్మ అనే వ్యక్తి ప్రవర చెబితే ఇలా ఉండొచ్చు:
“చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణెభ్యః శుభం భవతు
ఆంగీరస భారద్వాజ గార్గ్య శైన్య త్రయాఋషయోః ప్రవరాన్విత
గర్గ్య భారద్వాజ గోత్రః
ఆపస్తంబ సూత్రః తైత్రీయ కృష్ణ యజుః శాఖాధాయీ
శ్రీ రామ శర్మః అహం భో ఆభివాదయే”
అభివాదం అంటే నమ్రతతో పూర్వులకి నమస్కరించటం. ఈ ప్రవర చెప్పేటప్పుడు ఒక్క గోత్రాన్నే కాకుండా, ఆ వ్యక్తి కుటుంబం యొక్క “సూత్రం” ఏమిటో, “వేదం” ఏమిటో, చెప్పి అప్పుడు పేరు చెబుతారు. అంటే మనం ఎవ్వరమో చెప్పాలంటే మనం ఉన్న స్థలం, కాలం, ప్రవర చెప్పాలన్నమాట. స్థలానికి అక్షాంశం, రేఖాంశం, ఎత్తు అనే మూడు అంశాలు, కాలానికి ఒక అంశం, ప్రవరకి గోత్రం, సూత్రం, వేదం, నామధేయం అనే నాలుగు అంశాలు, వెరసి ఎనిమిది చెప్పాలి. ఈ ఎనిమిదింటిని ఎనిమిది నిరూపకాలు (coordinates) ఉపయోగించి నివేదించినప్పుడు ఆ అష్టమితీయ స్థలంలో (8-dimensional space) లో మన ఉనికి ఒక బిందువు అవుతుంది. ఈ విషయాలన్నీ రాబోయే వ్యాసాలలో చూస్తారు.
1. లెక్కకు అందని కాలమానం - అనుబంధం
హిందూ పురాణాలలో (ముఖ్యంగా, విష్ణుపురాణంలో) కాలమానం ఈ దిగువ చూపిన విధంగా వర్ణించబడింది. ఈ వర్ణన నేను సంప్రదించిన అన్ని గ్రంధాలలోనూ ఒకేలా లేదు. కాని, స్థూలంగా కథ ఈ దిగువ చూపిన విధంగా ఉంటుంది. ఈ దిగువ చూపిన కాలమానం నిజమా కాదా అన్న వివేచన ఇక్కడ అప్రస్తుతం; కాలగమనానికి ఇంత విస్తృతమైన నమూనా మన పూర్వులు నిర్మించేరంటే అది వారి ఊహాశక్తికి ఒక అపురూపమైన నిదర్శనం.
ఈ కింది లెక్క చూస్తూ ఉంటే మరొక విషయం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. యుగాల, మహాయుగాల, మన్వంతరాల, సంధ్యకాలాల పొడుగులు, బ్రహ్మ ఆయుర్దాయం, మొదలైన సంఖ్యలు – అన్నీ - 432 అనే సంఖ్య చుట్టూ పరిభ్రమించే విధంగా కిట్టించినట్టు కనబడుతుంది. ఉదాహరణకి మన భూలోకంలో ఒక సంవత్సరం పొడుగు ఇదమిత్థంగా “ఇంత” అని చెప్పలేము; ఏదో ఉరమరగా 365.242199 రోజులు అని సర్దుకుపోతున్నాం. కాని ఈ దిగువ లెక్కలో సంవత్సరం పొడుగు 360 రోజులు అని సౌలభ్యం కొరకు వాడబడింది. ఈ 360 ఇక్కడ వాడకపోతే తరువాత ఆ 432 రాదు. అలాగే మానవుని ఆయుర్దాయం 100 మానవ సంవత్సరాలు అనీ, బ్రహ్మ ఆయుర్దాయం 100 “బ్రహ్మ సంవత్సరాలు” అనీ అనటం లో శాస్త్రీయత లేదు. కనుక ఈ దిగువ చూపిన లెక్కలని ఓ గుటికెడు కషాయంతో సేవించండి.
మచ్చుకి ఈ కింది లెక్క చూడండి.. మన భూలోకంలో -
4,32,000 సంవత్సరములు = కలియుగం
8,64,000 సంవత్సరములు = ద్వాపర్యుగం
12,96,000 సంవత్సరములు = త్రేతాయుగం
17,28,000 సంవత్సరములు = కృతయుగం
ఈ 432 ఎక్కడనుండి వచ్చిందని అడగకండి. అదొక పెడదారి పట్టిస్తుంది.
ఈ నాలుగు యుగాల కాలాన్ని కూడితే 43,20,000 సంవత్సరాలు వస్తాయి. దీనిని ఒక మహాయుగం అంటారు. కనుక,
1 మహాయుగం = 43,20,000 సంవత్సరములు = 4.32 మిలియను సంవత్సరములు
1 మన్వంతరం = 71 మహాయుగాలు = 4.32 *71 = 306.72 మిలియను సంవత్సరాలు (ఇక్కడ నక్షత్రం గుర్తు గుణకారానికి వాడబడింది.)
ఇలాంటి మన్వంతరాలు 14 ఉన్నాయిట. (ఈ 71 అనే సంఖ్య 14 అనే సంఖ్య ఎక్కడినుండి ఊడిపడ్డాయో తెలుసుకోవాలంటే ఈ దిగువ ఇచ్చిన లెక్కని జాగ్రత్తగా చూడాలి.)
ప్రతి మన్వంతరం ప్రారంభంలోనూ, అంతంలోనూ కృతయుగపు ప్రమాణంలో ఒక సంధి కాలం (లేదా, సంధ్యా కాలం) ఉందని ఊహించుకుంటే ఒక కల్పం పొడుగు తెలుస్తుంది.
1 కల్పం = 14 మన్వంతరాలు + 15 సంధి కాలాలు = బ్రహ్మకి ఒక పగలు
1 బ్రహ్మ పగలు = 1 కల్పం = 306.72*14 + 1.728*15 = 4294.08 + 25.92 = 4,320 మిలియను సంవత్సరాలు = 4.32 బిలియను సంవత్సరాలు (ఇది బిలియను, మిలియను అని పొరబడకండి)
చూశారా, ఈ 432 అనే సంఖ్య రావటం కోసం ఎంత తంటాలు పడ్డారో. ఈ 432 కి వేద కాలం నుండీ ఒక ప్రత్యేకత ఉంది.
మరొక విషయం ఏమిటంటే, ఆధునిక శాస్త్రం ప్రకారం భూమి పుట్టి దరిదాపు 4 బిలియను సంవత్సరాలు పైబడి. ఇది కేవలం కాకతాళీయం అని మనం ఎంత అనుకున్నా, పురాణాలలో ఉన్న లెక్కకీ, మన ఆధునిక లెక్కకీ ఉన్న పోలిక కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
ఏది ఏమైతేనేమి – ఇటుపైన చెప్పే లెక్క అన్ని చోట్లా ఒకేలా కనిపించటం లేదు. చిన్న చిన్న తేడాలని విస్మరించి, లెక్కని స్థూలంగా చూద్దాం.
1 బ్రహ్మ రాత్రి = 1 కల్పం = 306.72*14 + 1.728*15 = 4294.08 + 25.92 = 4,320 మిలియను సంవత్సరాలు = 4.32 బిలియను సంవత్సరాలు
బ్రహ్మకి ఒక దినం = 1 పగలు + 1 రాత్రి = 8.640 బిలియను భూలోక సంవత్సరాలు
బ్రహ్మ ఆయుర్దాయం 100 బ్రహ్మ దినాలా, 100 బ్రహ్మ సంవత్సరాలా అన్నది ఒకొక్క చోట ఒక్కోలా ఉంది. మనం బ్రహ్మ ఆయుర్దాయం 100 బ్రహ్మ సంవత్సరాలు అనుకుందాం.
బ్రహ్మ ఆయుర్దాయం = 100 సంవత్సరాలు = 100 * 360 * 8.640 బిలియను భూలోక సంవత్సరాలు = 31104 బిలియను సంవత్సరాలు = 31.104 ట్రిలియను భూలోక సంవత్సరాలు = 1 పర
సృష్టి మొదలయిన దగ్గరనుండి ఇప్పటికి ఆరుగురు బ్రహ్మలు గతించేరు. గతించిన బ్రహ్మల పేర్లు: మానస, చాక్షుష, వాచిక, శ్రావణ, సత్య, అండజ.
ఇప్పుడు ఏడవ బ్రహ్మ అయిన పద్మజుని కాలంలో ఉన్నాం. ఈయన వయస్సు 51 వ సంవత్సరాలు. ఇందులో ప్రథమ కల్పమైన శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. మన సంవత్సరాలకి ప్రభవ, విభవ, శుక్ల మొదలైనవి 60 పేర్లు ఉన్నట్లే, ఈ కల్పాలకి 30 పేర్లు ఉన్నాయిట. ఆవి ఇక్కడ ఏకరవు పెట్టవలసిన అవసరం లేదు. కుతూహలం ఉన్నవాళ్లకి ఈ పేర్లు పురాణాలలో దొరుకుతాయి. ఉదాహరణకి కప్పగంతుల సుబ్బరాయశర్మ, కాలచక్రం, చూడండి. http://www.samputi.com/app_data/magazines/samputi12.pdf
ఇప్పుడు మనం ఈ శ్వేతవరాహ కల్పంలో వచ్చే 14 మన్వంతరాలలో ఏడవ మన్వంతరం అయిన వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. సరదా ఉన్న వాళ్లకి ఈ 14 మన్వంతరాల పేర్లు ఇక్కడ ఇస్తున్నాను: స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుస, వైవశ్వత, సూర్యసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్య, మరియు బౌచ్చ. (అల్లసాని పెద్దన రాసిన మనుచరిత్ర పై జాబితాలో రెండవ మనువైన స్వారోచిష మనువు గురించి అనుకుంటాను.)
ఈ వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గడిచి, ఇప్పుడు 28 వ మహాయుగంలో ఉన్నాం. ఈ 28 వ మహాయుగంలో కృత, త్రేత, ద్వాపర్ యుగాలు గడచిపోయేయి. కలియుగం ప్రవేశించి 5111 సంవత్సరాలు (ఇది రాసిన తేదీ సా. శ. 2010).
ఇంతవరకు కాలనిర్ణయం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు స్థల నిర్ణయం ఎలా జరుగుతుందో చూద్దాం.
పరిపాలనా సౌలభ్యం కొరకు మనువులు భూమిని 7 భాగాలుగా విభజించి పాలించేరు. ఆ ఏడు భాగాల పేర్లు ఇవి: జంబూద్వీపం, ప్లక్షద్వీపం, క్రౌంచద్వీపం, శాల్మిక ద్వీపం, పుష్కరద్వీపం, శాకద్వీపం. (ఈ ఏడు ద్వీపాలనీ ఏడు ఖండాలుగా మనం ఊహించుకోవచ్చు: ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా (ఇండియా ఉపఖండాన్ని మినహాయించి), మరియు ఇండియా ఉపఖండం.
ఆధునిక భారత దేశం జంబూద్వీపంలో ఉంది. ఈ జంబూ ద్వీపానికి అధిపతి పేరు నాభి. ఈ నాభికి మేరూదేవి యందు ఋషభుడు కలిగేడు. ఈ ఋషభుడుకి 100 మంది సంతానం. వీరిలో పెద్దవాడు భరతుడు. ఈ భరతుడు పాలించిన ప్రాంతమే భరతవర్షం. సముద్రానికి ఉత్తరమున, హిమాలయాలకి దక్షిణమున ఉన్న ప్రాంతమే భరతవర్షం. ఆధునిక పరిభాషలో చెప్పుకోవాలంటే ఇండియన్ సబ్కాంటినెంట్.
కనుక మనం పూజ చేసేటప్పుడు దేవుడికి మన చిరునామా నిర్ద్వందంగా చెబితే ఆయన మనం కోరిన కోరికలని మన చిరునామాకి పంపుతాడు. అందుకనే…”అద్యబ్రహ్మణః, ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే. అంటూ మనం ఉన్న కాలాన్ని, స్థలాన్ని చెప్పి అంతటితో ఊరుకోము. ఆ తరువాత మనం ఆ పూజ ఎప్పుడు చేస్తున్నామో కూడ “వేళ” చెప్పటానికి “అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన (…సంవత్సరే, ….ఆయనే, ….ఋతౌ, ….మాసే,…..పక్షే, ….తిధౌ,…, అంటూ కాలనిర్ణయం చేస్తాం.
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మన ఉనికిని చెప్పటానికి ఒక్క స్థలనిర్ణయం చేస్తే సరిపోదు, కాలనిర్ణయం కూడా చెయ్యాలని వేదకాలం నుండీ మనవాళ్లు గమనించేరు. ఇదే విషయాన్ని ఇరవైయ్యవ శతాబ్దపు ఆరంభంలో అయిన్స్టయిన్ వచ్చి, సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రవచించి, స్థల-కాల సమవాయాం (space-time continuum) అనే భావన ప్రవేశపెట్టి, “ఈ విశ్వం చతుర్ మితీయం – అనగా, ఈ విశ్వం నాలుగు దిశలలో వ్యాపించి ఉంది” అని ఉటంకించేసరికి, “ఔర! ఇదంతా మా పురాణాల్లో ఉందిస్మీ!” అని ఇప్పుడు అనుకుంటున్నాం.
మనవాళ్లు మరొక అడుగు ముందుకు వేసి, స్థలం, కాలం చెప్పినంత మాత్రాన్న సరిపోదు, మన ప్రవర కూడ చెప్పాలి అన్నారు. ఒక వంశవృక్షంలో ఉత్తమోత్తమమైన పూర్వుల పేర్లు చెప్పి, వారి వంశం వాడిని అని చెప్పటాన్ని “ప్రవర” చెప్పటం అంటారు. ఎవరికి తోచిన “పూర్వుల పేర్లు” వారు చెప్పకుండా ఒకే వంశంలో ఉన్నవారంతా ఒకే “పూర్వుల సమితిని” చెప్పటం ఆనవాయితీ. ఉదాహరణకి రామ శర్మ అనే వ్యక్తి ప్రవర చెబితే ఇలా ఉండొచ్చు:
“చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణెభ్యః శుభం భవతు
ఆంగీరస భారద్వాజ గార్గ్య శైన్య త్రయాఋషయోః ప్రవరాన్విత
గర్గ్య భారద్వాజ గోత్రః
ఆపస్తంబ సూత్రః తైత్రీయ కృష్ణ యజుః శాఖాధాయీ
శ్రీ రామ శర్మః అహం భో ఆభివాదయే”
అభివాదం అంటే నమ్రతతో పూర్వులకి నమస్కరించటం. ఈ ప్రవర చెప్పేటప్పుడు ఒక్క గోత్రాన్నే కాకుండా, ఆ వ్యక్తి కుటుంబం యొక్క “సూత్రం” ఏమిటో, “వేదం” ఏమిటో, చెప్పి అప్పుడు పేరు చెబుతారు. అంటే మనం ఎవ్వరమో చెప్పాలంటే మనం ఉన్న స్థలం, కాలం, ప్రవర చెప్పాలన్నమాట. స్థలానికి అక్షాంశం, రేఖాంశం, ఎత్తు అనే మూడు అంశాలు, కాలానికి ఒక అంశం, ప్రవరకి గోత్రం, సూత్రం, వేదం, నామధేయం అనే నాలుగు అంశాలు, వెరసి ఎనిమిది చెప్పాలి. ఈ ఎనిమిదింటిని ఎనిమిది నిరూపకాలు (coordinates) ఉపయోగించి నివేదించినప్పుడు ఆ అష్టమితీయ స్థలంలో (8-dimensional space) లో మన ఉనికి ఒక బిందువు అవుతుంది. ఈ విషయాలన్నీ రాబోయే వ్యాసాలలో చూస్తారు.
Wednesday, September 1, 2010
లెక్కకు అందని కాలమానం
విశ్వస్వరూపం (గత సంచిక తరువాయి)
1. లెక్కకు అందని కాలమానం
వేమూరి వేంకటేశ్వరరావు
విశ్వం, సృష్టి ఎంతో పురాతనమైనవని పాశ్చాత్యులు మొన్నమొన్నటి వరకు ఒప్పుకోనే లేదు. బైబిలు ప్రకారం దేవుడు ఈ విశ్వాన్ని 5,000 ఏళ్ల క్రితం సృష్టించేడు. వారి దృష్టిలో దేవుడు మానవ స్వరూపుడు, మగ వాడు.
విశ్వమూ, సృష్టీ ఆదిమధ్యాంతరహితం అని మనం అంటాం. ఆదిమధ్యాంతరహితుడయిన సృష్టికర్తని మానవ కాలమానం తోటీ, దైర్ఘ్య మానం తోటీ కొలవలేము. అయినా ఆ సృష్టి ప్రక్రియలని వర్ణించటానికి పెద్ద పెద్ద సంఖ్యలు కావాలి. అందుకనే కాబోలు పెద్ద పెద్ద సంఖ్యలంటే మనవాళ్లకి బొత్తిగా భయం లేదు. “పాశ్చాత్యులకి పెద్ద పెద్ద సంఖ్యలంటే భయమా?” అని మీరు నన్ను అడగొచ్చు. వాళ్లకి భయమో కాదో నాకు తెలియదు కాని, వాళ్ల పురాతన సంస్కృతిలో పెద పెద్ద సంఖ్యల ప్రస్తావనే లేదు; వాటి అవసరం వాళ్లకి వచ్చినట్లే లేదు. ఎందుకొస్తుంది? క్రైస్తవుల దృష్టిలో సృష్టికి ముందు ఏదీ లేదు. కనుక 5,000 ని మించిన పెద్ద సంఖ్య అవసరం వాళ్లకి తట్టి ఉండక పోవచ్చు - కనీసం కాలాన్ని కొలిచేటప్పుడు.
1. రావణాసురుడి కథ
నా చిన్నతనంలో మా నాన్నగారు తమాషాకి ఒక కథ చెప్పే వారు. రావణాసురుడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యం ఏలేడని అంటారు కదా. రావణుడు పుట్టగానే ఎవ్వరో బ్రహ్మ దగ్గరకి ఈ వార్తని మోసుకెళ్ళి మనవడికి జాతకం రాయమని అడిగేరుట. బ్రహ్మ అప్పుడే కాలకృత్యాలు తీర్చుకుందుకని చెంబు చేత పుచ్చుకుని బైలుకి బయలుదేరుతున్నవాడు కావున, “ఈ పని అయిన తర్వాత ఆ పని చూద్దాం” అన్నాడుట. బ్రహ్మ పని ముగించుకుని తిరిగి వస్తూ ఉంటే, మరొకరెవ్వరో, “తాతా! నీ మనవడు చచ్చిపోయేడు” అని చావు వార్త చల్లగా అందించేరుట. మన కాలమానం ఎంత విస్తృతమైనదో ఊహించుకోటానికి ఈ కథ ఉపయోగపడుతుంది.
2. హైందవ కాలమానం
మన కాలమానం ప్రకారం కలియుగం ఒక్కటే 432,000 సంవత్సరాలు నడుస్తుంది. కలియుగం కంటె ద్వాపరయుగం రెండింతలు, త్రేతాయుగం మూడింతలు, కృతయుగం నాలుగింతలు. ఈ నాలుగు యుగాలనీ కలిపి ఒక మహాయుగం అంటారు. అంటే ఒక మహాయుగం కలియుగం కంటే పదింతలు, లేదా 4,320,000 సంవత్సరాలు. ఆధునిక పరిభాషలో 4.32 మిలియను సంవత్సరాలు. మనందరికీ ఈ రోజుల్లో ఐన్స్టయిన్ సిద్ధాంతాలు కరతలామలకాలు అయిపోయాయి కనుక, పైన చెప్పిన ‘సంవత్సరాలు’ మన భూలోకం లెక్క ప్రకారం అని మరచిపోకండి. కనుక వీటిని ‘మానవ సంవత్సరాలు’ అందాం.
కాని సృష్టి జరిపే బ్రహ్మ ఎక్కడో సత్యలోకంలో ఉంటాడు. అక్కడ సంవత్సరం పొడుగు వేరు. అక్కడ లెక్క ఇలా ఉంటుంది. సత్యలోకంలో పగటి పూటని ఒక కల్పం అనీ రాత్రి పూటని ఒక కల్పం అనీ అంటారు. ఒక పగలూ, ఒక రాత్రీ కలపగా వచ్చిన దినాన్ని విశేష కల్పం అంటారు.
సత్యలోకంలో బ్రహ్మ కాలకృత్యాలు తీర్చుకుని “అక్కడి సూర్యోదయం” వేళకి సృష్టి మొదలు పెడతాడు. సాయంత్రం అయేసరికి సృష్టి లయమై పోతుంది. దీనినే ప్రళయం అంటారు. రాత్రి బ్రహ్మకి విశ్రాంతి సమయం. రాత్రి వేళప్పుడు మన మెదడు కలలు కంటూ ఎలా ‘విశ్రాంతి’ తీసుకుంటుందో అదే విధంగా బ్రహ్మ నిద్రపోతూన్నప్పుడు, మరునాటి సృష్టికి జరగవలసిన ప్రయత్నాలు జరుగుతాయన్నమాట. ఇటువంటి ప్రక్రియనే ఇంగ్లీషులో ‘రీ గ్రూపింగ్’ అంటారు.
ఒక కల్పం పొడుగు 14 మన్వంతరాలు. ఒకొక్క మన్వంతరం 71 మహాయుగాల మీద కొంత చిల్లర. ఈ చిల్లర ఎక్కడనుండి వచ్చిందంటే – అదంతా ఒక సంక్లిష్టమైన లెక్క; ఇప్పుడు చెప్పటం మొదలు పెడితే అది పెడ దారి అవుతుంది, కాల యాపన అవుతుంది. ఏది ఏమైతే నేమి ఒక కల్పంలో 14*71 = 994 మహాయుగాలు. (ఇక్కడ నక్షత్రాన్ని గుణకారానికి గుర్తుగా వాడేను.) దీనికి పైన చెప్పిన చిల్లర కలిపితే 1 కల్పం = 1,000 మహాయుగాలు. చూశారా, దశాంశ పద్ధతిలో ఇమడ్చటానికి లెక్కని ఎలా కిట్టించేరో. ఒకొక్క మహాయుగం 4.32 మిలియను సంవత్సరాలు కనుక 1 కల్పం = 1,000 * 4.32 మిలియను = 4.32 బిలియను మానవ సంవత్సరాలు. (అమెరికాలో వాడే పద్ధతి ప్రకారం ఒక బిలియను అంటే 1 తర్వాత 9 సున్నలు. ఈ పద్ధతే ఇక్కడ వాడబోతున్నాను.)
కనుక బ్రహ్మ పగలు 4.32 బిలియను, రాత్రి 4.32 బిలియను మానవ సంవత్సరాలు. లేదా సత్యలోకంలో ఒక దినం 8.64 బిలియను మానవ సంవత్సరాలు. ఇటువంటివి 360 దినాలు గడిస్తే అది ఒక సత్యలోకపు సంవత్సరం. (చూసారా, ఇక్కడ మన భూలోకంలో 360 రోజులు ఒక సంవత్సరం అవుతుంది కాని, మరే లోకం లోను అవాలని లేదు, సాధారణంగా కాదు. మానవ సంవత్సరాల పొడుగుని సత్యలోకపు సంవత్సరానికి అంటగట్టేం. దీనినే మానవ కేంద్ర దృక్పథం - anthropomorphic view - అంటారు. కాని ఇది మనకి ఇప్పుడు అనవసరం.) కనుక బ్రహ్మకి ఒక సంవత్సరం గడిచేసరికి ఈ భూలోకంలో 360 * 8.64 = 3.1104 ట్రిలియను సంవత్సరాలు. (అమెరికాలో వాడే పద్ధతి ప్రకారం ఒక ట్రిలియను అంటే 1 తర్వాత 12 సున్నలు.)
బ్రహ్మ ఆయుర్దాయం 100 సత్య లోకపు సంవత్సరాలు, లేదా 311.04 ట్రిలియను సంవత్సరాలు. ఈ కాలాన్నే ‘పర’ అంటారు. ఇందులో సగం ‘పరార్ధం.’ మన బ్రహ్మకి ఏభై ఏళ్ళ వరకూ ఉన్న కాలం ప్రథమ పరార్ధం. మన ఇప్పటి బ్రహ్మ ఇప్పటి వయస్సు 51; కనుక మనం ఇప్పుడు ద్వితీయ పరార్ధంలో ఉన్నాం. ఈ 51 వ సంవత్సరాన్ని శ్వేత వరాహ కల్పం అంటారు. (మన భూలోకంలో ప్రభవ, విభవ, లాంటి పేర్లు ఉన్నట్లే, సత్యలోకంలో ప్రతి ‘ఏడు’ కి ఒక పేరు ఉందన్న మాట..) ఈ శ్వేత వరాహ కల్పంలో ప్రస్తుతం నడుస్తూన్న మన్వంతరం పేరు వైవశ్వత మన్వంతరం. ఈ వైవశ్వత మన్వంతరంలోని 28 వ మహాయుగంలోని కలియుగంలో, ప్రథమ పాదంలో ఉన్నాం. ఈ కలియుగం శ్రీకృష్ణ నిర్యాణంతో ఉరమరగా 5,000 ఏళ్ళ క్రితం మొదలైంది. ఈ ప్రథమ పాదంలోనే కలియుగం ఇలా మండిపోతోంది. ఇహ చతుర్ధ పాదంలో ఎలా ఉంటుందో మీ ఊహకి వదిలేస్తాను.
పై పేరాలో ‘మన ఇప్పటి బ్రహ్మ ఇప్పటి వయస్సు’ అని వాడేను. చదువరులలో కుశాగ్రబుద్ధులు కొందరు, “మరొకప్పుడు మరొక బ్రహ్మ ఉండేవాడా?” అని అడగొచ్చు. అలా అడిగేవారికి పిట్టకథ ఒకటి చెబుతాను. సావధానంగా ఆలకించండి.
3. ఆష్టావక్రుడు, రోమహర్షుడు
ఒకనాడు స్వర్గలోకంలో ఇంద్రుడు చాల ఉషారుగా ఉన్నాడు. అప్పుడే రాక్షసుల మీద దండయాత్ర చేసి, వారిని హతమార్చి, విజయోత్సాహంతో ఉన్నాడేమో వ్యక్తి అఘమేఘాల్లోనే ఉన్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక విజయ స్థంబం – ఛ! స్థంబం ఏమిటి, మరీ భూలోకపు రాజుల్లా – ఒక పెద్ద భవనం నిర్మించటానికి సమకట్టేడు. (ధర్మరాజులవారు రాజసూయ యాగం చేసే ముందు మయ సభ నిర్మిచ లేదూ, అలాగన్న మాట.) వెంటనే విశ్వకర్మకి కబురు పెట్టేడు. విశ్వకర్మ ఇంద్రుడి ఆజ్ఞని శిరసావహించి రాజభవనానికి కావలసిన హంగులన్నీ కూర్చి ఒక దివ్యమైన కట్టడానికి రూపు రేఖలు దిద్దుతున్నాడు. కట్టబోయే భవనం నమూనాలు చూసినప్పుడల్లా ఇంద్రుడి మనస్సులో కొత్తకొత్తవి, పెద్దపెద్దవి అయిన ఊహలు మొలకెత్తటం మొదలెట్టేయి. తనంతటి వాడు తను. రాక్షసుల చేత మట్టి కరిపించిన తను. తన అంతస్తుకి తెస్సోడుతూన్న భవనమా? అందుకని భవనం చుట్టూ ఒక ఉద్యానవనం కావాలన్నాడు. విశ్వకర్మ ‘సరే’ అన్నాడు. తర్వాత వనంలో పాలరాతి లతాగృహం అన్నాడు. విశ్వకర్మ ‘సరే’ అన్నాడు. తర్వాత పాలరాతి గోడలమీద రత్నాలు తాపడం పెట్టాలన్నాడు. విశ్వకర్మ ‘సరే’ అన్నాడు. ఆ తర్వాత జలయంత్రాలు, అంబుస్పోటాలు కావాలన్నాడు ఇంద్రుడు. ఇలా అధికార మదాంధతతో రోజుకో కొత్త కోరిక వెలిబుచ్చటం మొదలు పెట్టేసరికి విశ్వకర్మకి విసుగు పుట్టుకొచ్చింది.
విశ్వకర్మ రహశ్యంగా ఊర్ధ్వలోకమైన సత్యలోకానికి ప్రయాణమై వెళ్ళేడు. బ్రహ్మకి అసలు విషయం అవగాహన అయింది. పరిస్థితికి తగిన చర్య జరుగుతుందని నచ్చజెప్పి, విశ్వకర్మని దిగువకి పంపి తనేమో ఊర్ధ్వలోకమైన వైకుంఠానికి వెళ్ళేడు. అక్కడ విష్ణుమూర్తి కథ అంతా సావధానంగా విన్నాడు.
మరునాడు ఇంద్రుడు సింహాసనారూఢుడై, అప్సరసల సాన్నిధ్యంలో ఆనంద డోలికలో ఊగిసలాడుతూ ఉన్న సమయంలో పట్టుమని పదేళ్లు కూడ నిండని ఒక బాలుడు ఒక చేతిలో దండం, మరొక చేత కమండలం, చంకలో కృష్ణాజినం, ముఖంలో దివ్యమైన తేజస్సుతో ఆస్థానంలో ప్రవేశించేడు. అతడు సకల విద్యా కోవిదుడని చెప్పకుండానే తెలుస్తోంది.
ఇంద్రుడు ఆ బాలుడిని చూసి సింహాసనం దిగి ఎదురేగి స్వాగతం పలికేడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి యధోచితంగా అతిధిని సత్కరించి, “స్వామీ, తమరెవరో, తమ రాకకి కారణం ఏమిటో శలవియ్యండి” అంటూ వినయ విధేయతలతో అడిగేడు.
“ఓ, మహాబలీ! ప్రపంచంలో ఎక్కడా కనీ వినీ ఎరగని అత్యద్భుతమైన రాజప్రాసాదాన్ని నిర్మిస్తున్నావని నాలుగు నోట్లా విని విషయావలోకన చేసి పోదామని వచ్చేను. గతంలో ఏ ఇంద్రుడూ ఇటువంటి సౌధాన్ని నిర్మించలేదటగదా?”
గర్వమదాంధతతో ఉన్న ఇంద్రుడు ఈ ముక్కుపచ్చలారని బాలుని ధిషణని పరాభవించటానికా అన్నట్లు, తూష్ణీంభావంతో, “వత్సా, ఎంతమంది ఇంద్రులని చూసేవేమిటి? అహ, ఎంతమంది ఇంద్రుల గురించి విన్నావేమిటి?” అని హేళనగా అడిగేడు.
ఆ ప్రశ్నకి సమాధానంగా మందస్మిత వదనారవిందంతో ఆ బాలుడు ఇలా అన్నాడు.
“దేవేంద్రా! కుమారా! సావధానంగా విను. నేను చాల మంది ఇంద్రులని చూసేను. నీ తండ్రి కశ్యపుడిని నాకు తెలుసు. బ్రహ్మకి కుమారుడు, నీకు తాత అయిన మరీచిని నాకు తెలుసు. ఆ బ్రహ్మ విష్ణుమూర్తి నాభి లోని కమలం నుండి ఉద్భవించటం నేను స్వయంగా ఎరుగుదును. ఆ మాటకొస్తే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే నేను ఎరుగుదును.
“సృష్ట్యాది ప్రళయ పర్యంతం జరిగే కార్యక్రమాన్ని అంతా కళ్లారా చూసిన వ్యక్తిని నేను. ఒక సారి కాదు. పదే పదే చూసిన వాడిని. ప్రళయ సమయంలో విశ్వస్వరూపం ఎలా ఉంటుందో తెలుసా? ‘ఈ విశ్వం’ లోని స్థావర జంగమాత్మకమైన ప్రతి అణువు నామరూపాలు లేకుండా నశించిపోయి ప్రళయ నిశీధిలోని అనంతంలో లీనమై అదృశ్యమైపోతుంది. ఆ దృశ్యం వర్ణనాతీతం.
“ ‘ఈ విశ్వం’ అన్నాను కదూ? ఇటువంటి విశ్వాలు ఎన్నో! ఎన్నని ఎవరు లెక్కపెట్టగలరు? అవి అనంతం. సముద్రంలోని నీటి బుడగలులా అనంతమైన విశ్వాలు అలా ఉద్భవిస్తూనే ఉంటాయి, నశిస్తూనే ఉంటాయి. ఒకొక్క విశ్వంలో సృష్టికార్యాలు నిర్వహించటానికి ఒకొక్క బ్రహ్మ. ఇటువంటి విశ్వాలలోని ప్రపంచాలలో ఇక ఇంద్రులు ఎంతమంది ఉంటారో? వారిని లెక్క పెట్టే ఓపిక ఎవ్వరికి ఉంది? సముద్రపుటొడ్డున ఉన్న ఇసక రేణువులని లెక్కపెట్టగలమా?
“ఒకొక్క ఇంద్రుడు ఒకొక్క మన్వంతరం పాటు రాజ్యం ఏలుతాడు. ఇలాంటి ఇంద్రులు 28 అయేసరికి బ్రహ్మకి ఒక రోజు…..”
ఇలా చెప్పుకు పోతూన్న ఆ కథనాన్ని ఆ బాలుడు హటాత్తుగా ఆపి, నేల మీద బారెడు వెడల్పున బారులు తీర్చి పోతూన్న చీమలని చూసి ఒక చిరునవ్వు నవ్వేడు.
“మహానుభావా! ఎందుకు కథనాన్ని ఆపివేసేరు? ఎందుకలా నవ్వుతున్నారు?” అని ఇంద్రుడు ఆత్రుతగా అడిగేడు.
“ఎందుకు నవ్వుతున్నానా? అది పరమ రహశ్యం. దుఃఖానికి మూల కారణం ఏమిటో ఈ రహశ్యంలో ఇమిడి ఉంది. చీకటిలో తాడుని చూసి పాము అని ఎలా అనుకుంటామో, దీపపు వెలుగులో అది పాము కాదు, తాడే అని ఎలా తెలుసుకుంటామో అలాగే జ్ఞానోదయం అయిన వ్యక్తి ఈ సృష్టిలోని నిజానిజాల తారతమ్యాన్ని తెలుసుకో గలుగుతున్నాడు. చూడు, ఈ చీమల బారు ఎంత పెద్దగా ఉందో. బారెడు వెడల్పుతో ఒక నదీ ప్రవాహంలా పాకుతూన్న ఈ చీమలన్నీ ఒకనొకప్పుడు నీలాగే ఇంద్ర పదవిని అధిష్టించిన వారే. వారి కర్మానుసారం ఇలా చీమల జన్మ ఎత్తి కర్మ పరిపక్వం కొరకు ఎదురుచూస్తున్నారు…..”
ఆ బాలుడు ఇలా ఉపదేశం చేస్తూ ఉంటే సభలోనికి మరొక విచిత్రమైన వ్యక్తి వచ్చేడు. అతనికి నఖశిఖ పర్యంతం జుత్తే. ఛాతీ మీద మాత్రం గుండ్రంగా కొంత మేర రోమాలేవీ లేకుండా బోడిగా ఉంది. ఆ ఖాళీ చుట్టూ వలయాకారంగా బొద్దుగా జుత్తు పెరిగి ఉంది.
ఇప్పటికే సంభ్రమాశ్చ్యర్యాలలో ములిగి తేలుతూన్న ఇంద్రుడు తేరుకొని, “మహానుభావా! తమరు ఎవ్వరు? ఎక్కడనుండి వస్తున్నారు? నేను మీకు ఏ విధంగా సేవ చెయ్యగలను?” అని కుశల ప్రశ్నలు వేసేడు.
“ఇంద్రా! నువ్వు దిగ్విజయ యాత్ర ముగించుకొని ఒక అత్యద్భుతమైన భవనం నిర్మిస్తున్నావని విని ఆ భవనం చూసిపోదామని వచ్చేను.
“నేనెవరినా? నన్ను రోమహర్షుడు అంటారు. నా వక్షస్థలం చూస్తున్నావు కదా. ఒకొక్క ఇంద్రుడు మరణించినప్పుడల్లా ఒకొక్క వెంట్రుక ఈ వక్షస్థలం నుండి రాలి పోతుంది. అందుకనే మధ్యలో వెంట్రుకలు లేకుండా బోసిగా ఉంది.
ఈ ద్వితీయ పరార్ధం పూర్తి అయేసరికి ఇప్పటి బ్రహ్మ జీవితం చాలిస్తాడు. అప్పుడు వచ్చే మహా ప్రళయంలో నేను కూడ లీనమయిపోతాను. ఇటువంటి అల్పాయుద్దాయంతో పెళ్లి చేసుకుని జంఝాటన పెంచుకోవటమెందుకని బ్రహ్మచారిగా ఉండిపోటానికే నిశ్చయించుకున్నాను. ఆ విష్ణు మూర్తి ఒక్క సారి కళ్ళు తెరచి మూసే వ్యవధిలో ఒక బ్రహ్మ జీవిత కాలం పూర్తి అయిపోతుంది.”
ఈ మాటలు చెబుతూ రోమహర్షుడు అకస్మాత్తుగా అదృశ్యమై పోయాడు. చీమల బారు గురించి చెబుతూ ఉన్న బాలుడు ఎప్పుడో అదృశ్యమైపోయాడు.
ఇదంతా వింటూన్న ఇంద్రుడికి గర్వభంగం అయింది. తను భవన నిర్మాణ పథకాన్ని విరమించుకున్నట్లు విశ్వకర్మతో సవినయంగా మనవి చేసుకున్నాడు.
అదండీ, భారతీయులు ఈ విశ్వం ఎంత పురాతనమైనదో చెప్పటానికి ఈ కథ అల్లి చెప్పేరు.
1. లెక్కకు అందని కాలమానం
వేమూరి వేంకటేశ్వరరావు
విశ్వం, సృష్టి ఎంతో పురాతనమైనవని పాశ్చాత్యులు మొన్నమొన్నటి వరకు ఒప్పుకోనే లేదు. బైబిలు ప్రకారం దేవుడు ఈ విశ్వాన్ని 5,000 ఏళ్ల క్రితం సృష్టించేడు. వారి దృష్టిలో దేవుడు మానవ స్వరూపుడు, మగ వాడు.
విశ్వమూ, సృష్టీ ఆదిమధ్యాంతరహితం అని మనం అంటాం. ఆదిమధ్యాంతరహితుడయిన సృష్టికర్తని మానవ కాలమానం తోటీ, దైర్ఘ్య మానం తోటీ కొలవలేము. అయినా ఆ సృష్టి ప్రక్రియలని వర్ణించటానికి పెద్ద పెద్ద సంఖ్యలు కావాలి. అందుకనే కాబోలు పెద్ద పెద్ద సంఖ్యలంటే మనవాళ్లకి బొత్తిగా భయం లేదు. “పాశ్చాత్యులకి పెద్ద పెద్ద సంఖ్యలంటే భయమా?” అని మీరు నన్ను అడగొచ్చు. వాళ్లకి భయమో కాదో నాకు తెలియదు కాని, వాళ్ల పురాతన సంస్కృతిలో పెద పెద్ద సంఖ్యల ప్రస్తావనే లేదు; వాటి అవసరం వాళ్లకి వచ్చినట్లే లేదు. ఎందుకొస్తుంది? క్రైస్తవుల దృష్టిలో సృష్టికి ముందు ఏదీ లేదు. కనుక 5,000 ని మించిన పెద్ద సంఖ్య అవసరం వాళ్లకి తట్టి ఉండక పోవచ్చు - కనీసం కాలాన్ని కొలిచేటప్పుడు.
1. రావణాసురుడి కథ
నా చిన్నతనంలో మా నాన్నగారు తమాషాకి ఒక కథ చెప్పే వారు. రావణాసురుడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యం ఏలేడని అంటారు కదా. రావణుడు పుట్టగానే ఎవ్వరో బ్రహ్మ దగ్గరకి ఈ వార్తని మోసుకెళ్ళి మనవడికి జాతకం రాయమని అడిగేరుట. బ్రహ్మ అప్పుడే కాలకృత్యాలు తీర్చుకుందుకని చెంబు చేత పుచ్చుకుని బైలుకి బయలుదేరుతున్నవాడు కావున, “ఈ పని అయిన తర్వాత ఆ పని చూద్దాం” అన్నాడుట. బ్రహ్మ పని ముగించుకుని తిరిగి వస్తూ ఉంటే, మరొకరెవ్వరో, “తాతా! నీ మనవడు చచ్చిపోయేడు” అని చావు వార్త చల్లగా అందించేరుట. మన కాలమానం ఎంత విస్తృతమైనదో ఊహించుకోటానికి ఈ కథ ఉపయోగపడుతుంది.
2. హైందవ కాలమానం
మన కాలమానం ప్రకారం కలియుగం ఒక్కటే 432,000 సంవత్సరాలు నడుస్తుంది. కలియుగం కంటె ద్వాపరయుగం రెండింతలు, త్రేతాయుగం మూడింతలు, కృతయుగం నాలుగింతలు. ఈ నాలుగు యుగాలనీ కలిపి ఒక మహాయుగం అంటారు. అంటే ఒక మహాయుగం కలియుగం కంటే పదింతలు, లేదా 4,320,000 సంవత్సరాలు. ఆధునిక పరిభాషలో 4.32 మిలియను సంవత్సరాలు. మనందరికీ ఈ రోజుల్లో ఐన్స్టయిన్ సిద్ధాంతాలు కరతలామలకాలు అయిపోయాయి కనుక, పైన చెప్పిన ‘సంవత్సరాలు’ మన భూలోకం లెక్క ప్రకారం అని మరచిపోకండి. కనుక వీటిని ‘మానవ సంవత్సరాలు’ అందాం.
కాని సృష్టి జరిపే బ్రహ్మ ఎక్కడో సత్యలోకంలో ఉంటాడు. అక్కడ సంవత్సరం పొడుగు వేరు. అక్కడ లెక్క ఇలా ఉంటుంది. సత్యలోకంలో పగటి పూటని ఒక కల్పం అనీ రాత్రి పూటని ఒక కల్పం అనీ అంటారు. ఒక పగలూ, ఒక రాత్రీ కలపగా వచ్చిన దినాన్ని విశేష కల్పం అంటారు.
సత్యలోకంలో బ్రహ్మ కాలకృత్యాలు తీర్చుకుని “అక్కడి సూర్యోదయం” వేళకి సృష్టి మొదలు పెడతాడు. సాయంత్రం అయేసరికి సృష్టి లయమై పోతుంది. దీనినే ప్రళయం అంటారు. రాత్రి బ్రహ్మకి విశ్రాంతి సమయం. రాత్రి వేళప్పుడు మన మెదడు కలలు కంటూ ఎలా ‘విశ్రాంతి’ తీసుకుంటుందో అదే విధంగా బ్రహ్మ నిద్రపోతూన్నప్పుడు, మరునాటి సృష్టికి జరగవలసిన ప్రయత్నాలు జరుగుతాయన్నమాట. ఇటువంటి ప్రక్రియనే ఇంగ్లీషులో ‘రీ గ్రూపింగ్’ అంటారు.
ఒక కల్పం పొడుగు 14 మన్వంతరాలు. ఒకొక్క మన్వంతరం 71 మహాయుగాల మీద కొంత చిల్లర. ఈ చిల్లర ఎక్కడనుండి వచ్చిందంటే – అదంతా ఒక సంక్లిష్టమైన లెక్క; ఇప్పుడు చెప్పటం మొదలు పెడితే అది పెడ దారి అవుతుంది, కాల యాపన అవుతుంది. ఏది ఏమైతే నేమి ఒక కల్పంలో 14*71 = 994 మహాయుగాలు. (ఇక్కడ నక్షత్రాన్ని గుణకారానికి గుర్తుగా వాడేను.) దీనికి పైన చెప్పిన చిల్లర కలిపితే 1 కల్పం = 1,000 మహాయుగాలు. చూశారా, దశాంశ పద్ధతిలో ఇమడ్చటానికి లెక్కని ఎలా కిట్టించేరో. ఒకొక్క మహాయుగం 4.32 మిలియను సంవత్సరాలు కనుక 1 కల్పం = 1,000 * 4.32 మిలియను = 4.32 బిలియను మానవ సంవత్సరాలు. (అమెరికాలో వాడే పద్ధతి ప్రకారం ఒక బిలియను అంటే 1 తర్వాత 9 సున్నలు. ఈ పద్ధతే ఇక్కడ వాడబోతున్నాను.)
కనుక బ్రహ్మ పగలు 4.32 బిలియను, రాత్రి 4.32 బిలియను మానవ సంవత్సరాలు. లేదా సత్యలోకంలో ఒక దినం 8.64 బిలియను మానవ సంవత్సరాలు. ఇటువంటివి 360 దినాలు గడిస్తే అది ఒక సత్యలోకపు సంవత్సరం. (చూసారా, ఇక్కడ మన భూలోకంలో 360 రోజులు ఒక సంవత్సరం అవుతుంది కాని, మరే లోకం లోను అవాలని లేదు, సాధారణంగా కాదు. మానవ సంవత్సరాల పొడుగుని సత్యలోకపు సంవత్సరానికి అంటగట్టేం. దీనినే మానవ కేంద్ర దృక్పథం - anthropomorphic view - అంటారు. కాని ఇది మనకి ఇప్పుడు అనవసరం.) కనుక బ్రహ్మకి ఒక సంవత్సరం గడిచేసరికి ఈ భూలోకంలో 360 * 8.64 = 3.1104 ట్రిలియను సంవత్సరాలు. (అమెరికాలో వాడే పద్ధతి ప్రకారం ఒక ట్రిలియను అంటే 1 తర్వాత 12 సున్నలు.)
బ్రహ్మ ఆయుర్దాయం 100 సత్య లోకపు సంవత్సరాలు, లేదా 311.04 ట్రిలియను సంవత్సరాలు. ఈ కాలాన్నే ‘పర’ అంటారు. ఇందులో సగం ‘పరార్ధం.’ మన బ్రహ్మకి ఏభై ఏళ్ళ వరకూ ఉన్న కాలం ప్రథమ పరార్ధం. మన ఇప్పటి బ్రహ్మ ఇప్పటి వయస్సు 51; కనుక మనం ఇప్పుడు ద్వితీయ పరార్ధంలో ఉన్నాం. ఈ 51 వ సంవత్సరాన్ని శ్వేత వరాహ కల్పం అంటారు. (మన భూలోకంలో ప్రభవ, విభవ, లాంటి పేర్లు ఉన్నట్లే, సత్యలోకంలో ప్రతి ‘ఏడు’ కి ఒక పేరు ఉందన్న మాట..) ఈ శ్వేత వరాహ కల్పంలో ప్రస్తుతం నడుస్తూన్న మన్వంతరం పేరు వైవశ్వత మన్వంతరం. ఈ వైవశ్వత మన్వంతరంలోని 28 వ మహాయుగంలోని కలియుగంలో, ప్రథమ పాదంలో ఉన్నాం. ఈ కలియుగం శ్రీకృష్ణ నిర్యాణంతో ఉరమరగా 5,000 ఏళ్ళ క్రితం మొదలైంది. ఈ ప్రథమ పాదంలోనే కలియుగం ఇలా మండిపోతోంది. ఇహ చతుర్ధ పాదంలో ఎలా ఉంటుందో మీ ఊహకి వదిలేస్తాను.
పై పేరాలో ‘మన ఇప్పటి బ్రహ్మ ఇప్పటి వయస్సు’ అని వాడేను. చదువరులలో కుశాగ్రబుద్ధులు కొందరు, “మరొకప్పుడు మరొక బ్రహ్మ ఉండేవాడా?” అని అడగొచ్చు. అలా అడిగేవారికి పిట్టకథ ఒకటి చెబుతాను. సావధానంగా ఆలకించండి.
3. ఆష్టావక్రుడు, రోమహర్షుడు
ఒకనాడు స్వర్గలోకంలో ఇంద్రుడు చాల ఉషారుగా ఉన్నాడు. అప్పుడే రాక్షసుల మీద దండయాత్ర చేసి, వారిని హతమార్చి, విజయోత్సాహంతో ఉన్నాడేమో వ్యక్తి అఘమేఘాల్లోనే ఉన్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక విజయ స్థంబం – ఛ! స్థంబం ఏమిటి, మరీ భూలోకపు రాజుల్లా – ఒక పెద్ద భవనం నిర్మించటానికి సమకట్టేడు. (ధర్మరాజులవారు రాజసూయ యాగం చేసే ముందు మయ సభ నిర్మిచ లేదూ, అలాగన్న మాట.) వెంటనే విశ్వకర్మకి కబురు పెట్టేడు. విశ్వకర్మ ఇంద్రుడి ఆజ్ఞని శిరసావహించి రాజభవనానికి కావలసిన హంగులన్నీ కూర్చి ఒక దివ్యమైన కట్టడానికి రూపు రేఖలు దిద్దుతున్నాడు. కట్టబోయే భవనం నమూనాలు చూసినప్పుడల్లా ఇంద్రుడి మనస్సులో కొత్తకొత్తవి, పెద్దపెద్దవి అయిన ఊహలు మొలకెత్తటం మొదలెట్టేయి. తనంతటి వాడు తను. రాక్షసుల చేత మట్టి కరిపించిన తను. తన అంతస్తుకి తెస్సోడుతూన్న భవనమా? అందుకని భవనం చుట్టూ ఒక ఉద్యానవనం కావాలన్నాడు. విశ్వకర్మ ‘సరే’ అన్నాడు. తర్వాత వనంలో పాలరాతి లతాగృహం అన్నాడు. విశ్వకర్మ ‘సరే’ అన్నాడు. తర్వాత పాలరాతి గోడలమీద రత్నాలు తాపడం పెట్టాలన్నాడు. విశ్వకర్మ ‘సరే’ అన్నాడు. ఆ తర్వాత జలయంత్రాలు, అంబుస్పోటాలు కావాలన్నాడు ఇంద్రుడు. ఇలా అధికార మదాంధతతో రోజుకో కొత్త కోరిక వెలిబుచ్చటం మొదలు పెట్టేసరికి విశ్వకర్మకి విసుగు పుట్టుకొచ్చింది.
విశ్వకర్మ రహశ్యంగా ఊర్ధ్వలోకమైన సత్యలోకానికి ప్రయాణమై వెళ్ళేడు. బ్రహ్మకి అసలు విషయం అవగాహన అయింది. పరిస్థితికి తగిన చర్య జరుగుతుందని నచ్చజెప్పి, విశ్వకర్మని దిగువకి పంపి తనేమో ఊర్ధ్వలోకమైన వైకుంఠానికి వెళ్ళేడు. అక్కడ విష్ణుమూర్తి కథ అంతా సావధానంగా విన్నాడు.
మరునాడు ఇంద్రుడు సింహాసనారూఢుడై, అప్సరసల సాన్నిధ్యంలో ఆనంద డోలికలో ఊగిసలాడుతూ ఉన్న సమయంలో పట్టుమని పదేళ్లు కూడ నిండని ఒక బాలుడు ఒక చేతిలో దండం, మరొక చేత కమండలం, చంకలో కృష్ణాజినం, ముఖంలో దివ్యమైన తేజస్సుతో ఆస్థానంలో ప్రవేశించేడు. అతడు సకల విద్యా కోవిదుడని చెప్పకుండానే తెలుస్తోంది.
ఇంద్రుడు ఆ బాలుడిని చూసి సింహాసనం దిగి ఎదురేగి స్వాగతం పలికేడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి యధోచితంగా అతిధిని సత్కరించి, “స్వామీ, తమరెవరో, తమ రాకకి కారణం ఏమిటో శలవియ్యండి” అంటూ వినయ విధేయతలతో అడిగేడు.
“ఓ, మహాబలీ! ప్రపంచంలో ఎక్కడా కనీ వినీ ఎరగని అత్యద్భుతమైన రాజప్రాసాదాన్ని నిర్మిస్తున్నావని నాలుగు నోట్లా విని విషయావలోకన చేసి పోదామని వచ్చేను. గతంలో ఏ ఇంద్రుడూ ఇటువంటి సౌధాన్ని నిర్మించలేదటగదా?”
గర్వమదాంధతతో ఉన్న ఇంద్రుడు ఈ ముక్కుపచ్చలారని బాలుని ధిషణని పరాభవించటానికా అన్నట్లు, తూష్ణీంభావంతో, “వత్సా, ఎంతమంది ఇంద్రులని చూసేవేమిటి? అహ, ఎంతమంది ఇంద్రుల గురించి విన్నావేమిటి?” అని హేళనగా అడిగేడు.
ఆ ప్రశ్నకి సమాధానంగా మందస్మిత వదనారవిందంతో ఆ బాలుడు ఇలా అన్నాడు.
“దేవేంద్రా! కుమారా! సావధానంగా విను. నేను చాల మంది ఇంద్రులని చూసేను. నీ తండ్రి కశ్యపుడిని నాకు తెలుసు. బ్రహ్మకి కుమారుడు, నీకు తాత అయిన మరీచిని నాకు తెలుసు. ఆ బ్రహ్మ విష్ణుమూర్తి నాభి లోని కమలం నుండి ఉద్భవించటం నేను స్వయంగా ఎరుగుదును. ఆ మాటకొస్తే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే నేను ఎరుగుదును.
“సృష్ట్యాది ప్రళయ పర్యంతం జరిగే కార్యక్రమాన్ని అంతా కళ్లారా చూసిన వ్యక్తిని నేను. ఒక సారి కాదు. పదే పదే చూసిన వాడిని. ప్రళయ సమయంలో విశ్వస్వరూపం ఎలా ఉంటుందో తెలుసా? ‘ఈ విశ్వం’ లోని స్థావర జంగమాత్మకమైన ప్రతి అణువు నామరూపాలు లేకుండా నశించిపోయి ప్రళయ నిశీధిలోని అనంతంలో లీనమై అదృశ్యమైపోతుంది. ఆ దృశ్యం వర్ణనాతీతం.
“ ‘ఈ విశ్వం’ అన్నాను కదూ? ఇటువంటి విశ్వాలు ఎన్నో! ఎన్నని ఎవరు లెక్కపెట్టగలరు? అవి అనంతం. సముద్రంలోని నీటి బుడగలులా అనంతమైన విశ్వాలు అలా ఉద్భవిస్తూనే ఉంటాయి, నశిస్తూనే ఉంటాయి. ఒకొక్క విశ్వంలో సృష్టికార్యాలు నిర్వహించటానికి ఒకొక్క బ్రహ్మ. ఇటువంటి విశ్వాలలోని ప్రపంచాలలో ఇక ఇంద్రులు ఎంతమంది ఉంటారో? వారిని లెక్క పెట్టే ఓపిక ఎవ్వరికి ఉంది? సముద్రపుటొడ్డున ఉన్న ఇసక రేణువులని లెక్కపెట్టగలమా?
“ఒకొక్క ఇంద్రుడు ఒకొక్క మన్వంతరం పాటు రాజ్యం ఏలుతాడు. ఇలాంటి ఇంద్రులు 28 అయేసరికి బ్రహ్మకి ఒక రోజు…..”
ఇలా చెప్పుకు పోతూన్న ఆ కథనాన్ని ఆ బాలుడు హటాత్తుగా ఆపి, నేల మీద బారెడు వెడల్పున బారులు తీర్చి పోతూన్న చీమలని చూసి ఒక చిరునవ్వు నవ్వేడు.
“మహానుభావా! ఎందుకు కథనాన్ని ఆపివేసేరు? ఎందుకలా నవ్వుతున్నారు?” అని ఇంద్రుడు ఆత్రుతగా అడిగేడు.
“ఎందుకు నవ్వుతున్నానా? అది పరమ రహశ్యం. దుఃఖానికి మూల కారణం ఏమిటో ఈ రహశ్యంలో ఇమిడి ఉంది. చీకటిలో తాడుని చూసి పాము అని ఎలా అనుకుంటామో, దీపపు వెలుగులో అది పాము కాదు, తాడే అని ఎలా తెలుసుకుంటామో అలాగే జ్ఞానోదయం అయిన వ్యక్తి ఈ సృష్టిలోని నిజానిజాల తారతమ్యాన్ని తెలుసుకో గలుగుతున్నాడు. చూడు, ఈ చీమల బారు ఎంత పెద్దగా ఉందో. బారెడు వెడల్పుతో ఒక నదీ ప్రవాహంలా పాకుతూన్న ఈ చీమలన్నీ ఒకనొకప్పుడు నీలాగే ఇంద్ర పదవిని అధిష్టించిన వారే. వారి కర్మానుసారం ఇలా చీమల జన్మ ఎత్తి కర్మ పరిపక్వం కొరకు ఎదురుచూస్తున్నారు…..”
ఆ బాలుడు ఇలా ఉపదేశం చేస్తూ ఉంటే సభలోనికి మరొక విచిత్రమైన వ్యక్తి వచ్చేడు. అతనికి నఖశిఖ పర్యంతం జుత్తే. ఛాతీ మీద మాత్రం గుండ్రంగా కొంత మేర రోమాలేవీ లేకుండా బోడిగా ఉంది. ఆ ఖాళీ చుట్టూ వలయాకారంగా బొద్దుగా జుత్తు పెరిగి ఉంది.
ఇప్పటికే సంభ్రమాశ్చ్యర్యాలలో ములిగి తేలుతూన్న ఇంద్రుడు తేరుకొని, “మహానుభావా! తమరు ఎవ్వరు? ఎక్కడనుండి వస్తున్నారు? నేను మీకు ఏ విధంగా సేవ చెయ్యగలను?” అని కుశల ప్రశ్నలు వేసేడు.
“ఇంద్రా! నువ్వు దిగ్విజయ యాత్ర ముగించుకొని ఒక అత్యద్భుతమైన భవనం నిర్మిస్తున్నావని విని ఆ భవనం చూసిపోదామని వచ్చేను.
“నేనెవరినా? నన్ను రోమహర్షుడు అంటారు. నా వక్షస్థలం చూస్తున్నావు కదా. ఒకొక్క ఇంద్రుడు మరణించినప్పుడల్లా ఒకొక్క వెంట్రుక ఈ వక్షస్థలం నుండి రాలి పోతుంది. అందుకనే మధ్యలో వెంట్రుకలు లేకుండా బోసిగా ఉంది.
ఈ ద్వితీయ పరార్ధం పూర్తి అయేసరికి ఇప్పటి బ్రహ్మ జీవితం చాలిస్తాడు. అప్పుడు వచ్చే మహా ప్రళయంలో నేను కూడ లీనమయిపోతాను. ఇటువంటి అల్పాయుద్దాయంతో పెళ్లి చేసుకుని జంఝాటన పెంచుకోవటమెందుకని బ్రహ్మచారిగా ఉండిపోటానికే నిశ్చయించుకున్నాను. ఆ విష్ణు మూర్తి ఒక్క సారి కళ్ళు తెరచి మూసే వ్యవధిలో ఒక బ్రహ్మ జీవిత కాలం పూర్తి అయిపోతుంది.”
ఈ మాటలు చెబుతూ రోమహర్షుడు అకస్మాత్తుగా అదృశ్యమై పోయాడు. చీమల బారు గురించి చెబుతూ ఉన్న బాలుడు ఎప్పుడో అదృశ్యమైపోయాడు.
ఇదంతా వింటూన్న ఇంద్రుడికి గర్వభంగం అయింది. తను భవన నిర్మాణ పథకాన్ని విరమించుకున్నట్లు విశ్వకర్మతో సవినయంగా మనవి చేసుకున్నాడు.
అదండీ, భారతీయులు ఈ విశ్వం ఎంత పురాతనమైనదో చెప్పటానికి ఈ కథ అల్లి చెప్పేరు.
Saturday, August 28, 2010
విశ్వస్వరూపం: ముందుమాట
విశ్వస్వరూపం: ముందుమాట
వేమూరి వేంకటేశ్వరరావు
2010
ఈ విశ్వం ఎక్కడ నుండి వచ్చింది? ఎప్పుడు పుట్టింది?
పుట్టినది గిట్టక మానదు అని చెబుతారు కనుక ఈ విశ్వం ఒకప్పుడు పుట్టి ఉంటే మరొకప్పుడు అంతం అవాలి కదా?
విశ్వం అంతం అవటం అంటే ఏమిటి? ఆ తరువాత ఏమవుతుంది?
ఈ విశ్వం పుట్టకమునుపు ఏమి ఉండేది?
ఈ విశ్వం శాశ్వతమా? అశాశ్వతమా?
సాంతమా? అనంతమా? (finite? or infinite?)
ఈ విశ్వం యొక్క స్వరూపం ఏమిటి? దీని ఆకారం ఎలా ఉంటుంది? బల్లపరుపుగా ఉంటుందా? గుండ్రంగా ఉంటుందా?
ఈ విశ్వాన్ని ఎవ్వరైనా సృష్టించేరా? సృష్టిస్తే ఆ సృష్టికర్త ఎవ్వరు?
సృష్టికార్యం అకస్మాత్తుగా జరిగిందా? ఒక రోజులో జరిగిందా?
ఆరు రోజులలో సృష్టి పూర్తిచేసేసి ఏడో రోజున విశ్రాంతి తీసుకున్నాడా ఆ సృష్టికర్త?
లేక, ఒక కల్పం పాటు సృష్టికార్యం జరిపి ఒక కల్పం పాటు విశ్రాంతి తీసుకుంటాడా (తీసుకుంటుందా)?
సృష్టికర్త బాధ్యతలు ఏమిటి? సృష్టించేసి “నీ దారి నువ్వు చూసుకో” అని విశ్వాన్ని అచ్చోసిన ఆంబోతులా వదిలెసేడా? లేక, విశ్వం యొక్క దైనందిన కార్యకలాపాలలో కలుగజేసుకుంటూ విశ్వం మంచిచెడ్డలు నిరంతరం ఆ సృష్టికర్త చూస్తున్నాడా?
దేవుడనే భావానికీ ఈ విశ్వాన్ని సృష్టించిన కర్తకీ ఏదైనా సంబంధం ఉందా? దేవుడు వేరు, సృష్టికర్త వేరూనా?
అసలు విశ్వం అంటే ఏమిటి? మన కంటికి కనిపించే సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంత వంటి క్షీరసాగరాలు, తేజోమేఘాలు, మొదలైనవే కాకుండా వాటితోపాటు వాటి వాటి లక్షణాలని నియంత్రించే ప్రకృతి శక్తులూనా? లేక, మన కంటికి కనబడని “పదార్ధాలు”, “శక్తులు” ఈ విశ్వంలో నిబిడీకృతం అయి ఉన్నాయా?
ఇటువంటి ప్రశ్నలకి ఇక్కడ సమాధానాలు వెతుకుదాం. ఈ అన్వేషణ జరిగేది ముఖ్యంగా ఆధునిక భౌతిక శాస్త్రం నిర్మించిన పరిధిలోనే జరిగినప్పటికీ, సారూప్యం చూపించటం కోసం అప్పుడప్పుడు ఈ ప్రశ్నలకి సమాధానాలు పురాతన కాలంలో ఎలా ఉండేవో చవి చూపిస్తూ ఉంటాను. కాని ముఖ్యంగా ఆధునిక శాస్త్రీయ కోణానికే ఇక్కడ ప్రాధాన్యత.
ప్రాచీన భారతీయ సంస్కృతికీ, దృక్పథానికీ, పాశ్చాత్య సంస్కృతికీ, దృక్పథానికీ మధ్య కొట్టొచ్చినట్లు చాల తేడాలు కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆధునిక విజ్ఞాన శాస్త్రం పరిణతి చెంది, పురోభివృద్ధి చెందుతూన్న దశలలో క్రైస్తవ మతాధికారులు, కేథలిక్ చర్చి అభ్యుదయ భావాలని తీవ్రంగా ఎదుర్కొన్నాయి. దీనికి కారణాలు అనేకం. క్రైస్తవ మతానిది మానవకేంద్ర దృక్పథం. మానవుడి జన్మ ఉత్కృష్టమైనదని ఒప్పుకున్నా, భారత దేశంలో పుట్టిన మతాలన్నీ కూడ సర్వభూతాలనీ మానవుడితో సమానంగానే చూశాయి. అందువల్ల విశ్వస్వరూపాన్ని అవగాహన చేసుకునే ఈ ప్రయత్నంలో ప్రాచ్య, పాశ్చాత్య భావాల మధ్య కొంత ఘర్షణ కనిపిస్తుంది. ఆధునిక శాస్త్ర విజ్ఞానంలో సింహభాగం పాశ్చాత్యుల పర్యవేక్షణలో జరిగింది కనుక వారి కోణంలో ఈ కథ చెప్పక తప్పదు. అయినా ఉండబట్టక కథని చెప్పేవాడిని నేను కనుక, కొంతవరకు సనాతన దృక్పథాన్ని చెప్పి పోలికలు చెప్పకుండా ఉండటమూ సాధ్యం కాదు. కనుక విశ్వరూపం మనకి అవగాహన అయిన వయినాన్ని ఈ రెండు కోణాలలోనూ చెప్పటానికి ప్రయత్నం చేస్తాను.
ఇంగ్లీషులో cosmology అన్న మాటని తెలుగులో “విశ్వశాస్త్రం” అనొచ్చు. కాస్మోస్ అంటే విశ్వం. ఇంగ్లీషులో universe అనే మాటని కూడ విశ్వం అన్న మాటకి పర్యాయపదంగా వాడతారు. “విస్” అనే సంస్కృత మూలానికి “వ్యాప్తి చెందేది” అనే అర్ధం ఉంది. ఈ మూలం నుండే విష్ణు శబ్దం పుట్టింది. వ్యాప్తి చెందే “విష్ణువు” విశ్వం అంతటినీ ఆక్రమించి ఉన్నాడు కనుక సర్వాంతర్యామి అయేడు. ఈ విశ్వం సమస్తాన్నీ ఆక్రమించుకుని ఉంది. కనుక “విశ్వరూపమే విష్ణువు, విష్ణురూపమే విశ్వం!” అనటం తప్పు కాదేమో!
విశ్వశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యటానికి భౌతిక శాస్త్రంలోనూ, గణిత శాస్త్రంలోనూ ఏళ్లతరబడి పరిశ్రమ చెయ్యాలి. అంత పరిశ్రమ చెయ్యలేనివారికి ఈ శాస్త్రంలోని ముఖ్యాంశాలని జనరంజక శైలిలో చెప్పాలనే కోరికతో ఈ వ్యాసాలని ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఎంత జనరంజక శైలి అయినా కొద్దో, గొప్పో శాస్త్రంతో పరిచయం ఉంటే తప్ప “భావ సూక్ష్మతలు” (conceptual subtleties) అప్పుడప్పుడు అర్ధం కావు. అందుకని సందర్భోచితంగా అక్కడక్కడ కొంచెం పాఠం చెప్పటం కూడ జరిగింది.
“ఈ విశ్వం ఎంతో పెద్దది, ఎంతో పురాతనమైనది” అన్న విషయం పాశ్చాత్యులకి ఈ మధ్యనే అవగాహన అయింది. మొన్నమొన్నటి వరకు పాశ్చాత్యులు సృష్టి జరిగి 5,000 సంవత్సరాలు మాత్రమే అయిందని నమ్మేవారు. కాని భారతీయ పురాణాలలో సృష్టి ఎంత పురాతనమైనదో వర్ణించే కథలు ఎన్నెన్నో ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధ రంగంలో కృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం చూపిస్తాడు. ఆ విశ్వరూపం వర్ణన చదివిన వారికి విశ్వం అంటే ఏమిటో కొద్దో, గొప్పో అవగాహన ఉండి తీరుతుంది. మనం ఇక్కడ చేస్తూన్నదల్లా అధునాతన శాస్త్రీయ దృక్పథంతో విశ్వస్వరూపాన్ని ఆకళింపు చేసుకోటానికి చిన్న ప్రయత్నం.
ఈ వ్యాస పరంపర చదివే ముందు ఒక విషయం గుర్తు పెట్టుకొండి. విశ్వం గురించి పెద్ద ఎత్తున, అధునాతన దృక్పథంతో పరిశోధన మొదలయి పూర్తిగా అర్ధ శతాబ్దం కూడ అయి ఉండదు. రోజుకో కొత్త వార్త, కొత్త సిద్ధాంతం! కొన్ని సిద్ధాంతాలు కాలప్రవాహపు తాకిడికి తట్టుకుని నిలబడగలుగుతున్నాయి. కొన్ని సిద్ధాంతాలు వీగిపోయి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. పస లేక వీగిపోయాయనుకున్న సిద్ధాంతాలు కొన్ని ప్రాణం పోసుకుని మళ్లా తలెత్తుతున్నాయి. కనుక ఈ వ్యాసాలలని చదివిన తరువాత “ఇదే వేదం” అని నమ్మేయకండి.
ఉదాహరణకి ఈ విశ్వం ఒక పెను పేలుడులో (Big Bang) పుట్టిందని చాలామంది ఒప్పుకుంటున్నారు. ఆ పేలింది ఏమిటో ఇదమిద్ధంగా తెలియదు. ఆ పేలుడు ఎప్పుడు జరిగింది అన్న విషయంలో కూడ తీవ్రమైన బేధాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు 8 బిలియను సంవత్సరాల క్రితమే అని అంటున్నారు. మరి కొందరు 20 బిలియను సంవత్సరాల క్రితం అంటున్నారు. ఆదిలోనే అభిప్రాయ బేధాలు ఉన్న ఈ శాస్త్రంలో ఇంకా ఎన్నో వాదోపవాదాలు ఉన్నాయి. ఇదే విధంగా విశ్వం ఎంత పెద్దదో కూడ మనకి పరిపూర్ణంగా అవగాహన కాలేదు. అసలు ఈ విశ్వం తయారీలో వాడబడ్డ ఘటక ద్రవ్యాలు (ingredients) ఏమిటో అన్న విషయం మీద కూడ ఏకీభావం లేదు. పెను పేలుడు జరిగిన తరువాత, “తత్తక్షణ ఉత్తర క్షణాలలో” (in the moments immediately afterwards), ఏమయిందో మనకి ఇంకా అంతుబట్టటం లేదు. ఈ విశ్వం ఎలా లయ పొందుతుందో కూడ తెలియదు. నిజానికి మన చుట్టుపట్ల ఉన్న క్షీరసాగరాలని దాటి దూరం వెళుతూన్న కొద్దీ అక్కడ విశ్వస్వరూపం ఎలా ఉంటుందో మనకి బాగా తెలియదు. మన చుట్టూ - మనకి దగ్గరగా ఉన్న - విశ్వాన్నయినా అంతా “చూడ” గలుగుతున్నామా లేక మన పక్కనే మన కంటికి కనపడకుండా అదృశ్య పదార్ధాలు, అదృశ్య శక్తులు ఏమయినా ఉన్నాయా అన్న విషయం కూడ మనకి పరిపూర్ణంగా తెలియదు. విశ్వం గురించి మనకి తెలియని మహా సింధువుతో పోల్చితే మనకి తెలిసినది, నేను ఇక్కడ చెప్పబోయేది కేవలం బిందు ప్రమాణం.
నెల నెలా వచ్చే ఈ వ్యాసాలు సులభ గ్రాహ్యంగా ఉండాలంటే ఏ వ్యాసానికి ఆ వ్యాసం స్వయంపూర్ణంగా, స్వయంసమృద్ధిగా, స్వయంవివరణాత్మకంగా నిలబడగలగాలి. అలా రాయాలంటే ఒక చోట చెప్పిన విషయాన్నే మరొక చోట చెప్పవలసి వస్తుంది. చెప్పే విషయం క్లిష్టమైనది కనుక ఈ చర్వితచర్వణం వల్ల పునరుక్తి దోషం ఉండదనే అనుకుంటున్నాను.
ఈ వ్యాసాలలోని పదార్ధం కొంత అంతర్జాల పత్రికలలోనూ, అచ్చుపత్రికలలోనూ, నా బ్లాగు “లోలకం” లోనూ ఒక సారి ప్రచురించటం జరిగింది. ఆ విషయాన్ని ఈ వ్యాస పరంపరకి అనుకూలంగా మార్చి, అవసరమయితే తిరగరాసి, ఇక్కడ వాడుకోవటం జరిగింది. అంతేకాదు. ఈ వ్యాసాలలో నేను చెప్పిన విషయాలన్నీ నేను విద్యార్ధిగా ఉన్నప్పుడు, అటుతరువాత, పుస్తకాలు చదివి నేర్చుకున్నవే తప్ప నేను స్వంతంగా సృష్టించినది ఏదీ లేదు. నేను సంప్రదించిన గ్రంధాల పేర్లు ఈ దిగువ చూపిస్తున్నాను. అదే విధంగా చాలమట్టుకి బొమ్మలు కూడ అంతర్జాలం (Internet) నుండి సేకరించినవే. నేను చేసినదల్లా ఇంగ్లీషులో ఉన్న విషయాన్ని సేకరించి, సంగ్రహించి, తిరిగి తెలుగులో నా మాటలలో చెప్పటమే.
“తెలుగులో సైన్సుని రాయటం ఎందుకు? ప్రపంచం అంతా ఇంగ్లీషు మార్గం వెంబడి పోతూన్నప్పుడు, ఉద్యోగాలకి ఇంగ్లీషు అత్యవసరం అయిపోతూన్న ఈ రోజుల్లో, తెలుగుని పట్టుకుని పాకులాడటం ప్రగతికి ప్రతిబంధకం కాదా?” అని నన్ను నిలదీసి అడిగిన వాళ్లకి ఓపిగ్గా సమాధానాలు చెప్పిన రోజులు ఉన్నాయి. ఇప్పుడా ఓపిక లేదు. నా సరదాకి నేను రాసుకున్నాను. మీకు సరదా ఉంటేనే చదవండి. కథనం నడిపించినప్పుడు సాధ్యమయినంత వరకు తెలుగు మాటలని కాని, సంస్కృతం నుండి దిగుమతి అయిన మాటలని కాని వాడి తెలుగు వాక్యాలు నిర్మించటానికే ప్రయత్నం చేసేను. ఓక భావాన్ని తెలుగులో వ్యక్తపరచటం కష్టమనిపించినప్పుడు (ఇది ఒక్క సారే జరిగింది) ఆ పక్కన కుండలీకరణాలలో పూర్తి ఇంగ్లీషు వాక్యం రాసి చూపించేను. నా పిచ్చి నాకు ఆనందం కావచ్చు కాని అందరికీ ఈ గోల అర్ధం అవకపోవచ్చు. అందుకని సాంకేతిక భావాలకి తెలుగు మాటలు వాడినప్పుడల్లా మూలంలో ఉన్న ఇంగ్లీషు మాటలని, వెనువెంటనే, కుండలీకరణాలలో రాసి చూపించేను. వ్రతం చెడ్డా ఫలం దక్కాలి కదా!
సంప్రదించిన మూలాలు
• http://news-service.stanford.edu/pr/95/950509Arc5236.html
• MIRA, Life and Death of a Photon, http://www.mira.org/museum/photon.htm
• Wikipedia, http://en.wikipedia.org/wiki/Shape_of_the_Universe
• Patricia Schwarz, http://www.superstringtheory.com/index.html
• V. Vemuri, http://www.lolakam.blogspot.com
• వేమూరి వేంకటేశ్వరరావు, “ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది?,” ఈమాట, http://www.eemaata.com/em/, సెప్టెంబరు 2009
• M. S. Turner, “The Universe,” Scientific American, September 2009
• J. Frieman, M. S. Turner and D. Huerter, Dark Energy and Accelerating Universe, 2008, available online at arxiv.org/abs/0803.0982
• Andy Fell, “Cosmic Convergence,” UC Davis Magazine, pp 14-19, Spring, 2008.
• N. D. Tyson, Death by Black Hole and other Cosmic Quandaries, W. W. Norton and Company. New York, 2007.
• M. Riordan and W. A. Zajc, “The First Few Microseconds,” Scientific American, May, 2006
• Loeb, “The Dark Ages of the Universe,” Scientific American, November, 2006
• Lisa Randall, Warped Passages : Unraveling The Mysteries of The Universe's Hidden Dimensions, Ecco, 2005.
• వేమూరి వేంకటేశ్వరరావు, “ప్రకృతిలో చతుర్విధ బలాల బలాబలాలు,” ఈమాట, http://www.eemaata.com/em/, సెప్టెంబరు, 2005.
• R. Bousso and J. Polchinski, “The String Theory Landscape,” Scientific American, September, 2004
• Paul Halpern, The Great Beyond, John Wiley & Sons, Hoboken, NJ, 2004.
• G. Veneziano, “The Myth of the Beginning of Time,” Scientific American, May, 2004
• వేమూరి వేంకటేశ్వరరావు, అంకెలు, సంఖ్యలు: లెక్కకు అందని కాలమానం, ATA Souvenir, July 2004
• A. Guth, The Inflationary Universe, Basic, 1998
• V. Vemuri, “The Geometry of the Universe,” Science Reporter, pp 30-31, August. 1996. (Published by National Institute of Science Communication, New Delhi, India. Also available at http://www.cs.ucdavis.edu/~vemuri/EnglishPopularScience.htm
• Robert Osserman, Poetry of the Universe: A mathematical exploration of the Cosmos, Doubleday, New York, 1996
• E. W. Kolb and M. S. Turner, The Early Universe, Westview Press, 1994
• వేమూరి వేంకటేశ్వరరావు, బ్లేక్ హోలు అంటే ఏమిటి?, విద్యార్ధి చెకుముకి, pp 40-43, మే, 1993, Also in Rachana, pp 55-56, Feb. 1993
• వేమూరి వేంకటేశ్వరరావు, అన్వేషణ, స్వాతి మాసపత్రిక, pp 8-15, 1991
• S. Weinberg, The First Three Seconds, Basic, 1977
• Robert Jastrow and Malcolm Thomson, Astronomy: Fundamentals and Frontiers, Third Edition, John Wiley, 1972
• Heinrich Zimmer, Maya: Der Indische Mythos, 1936.
వేమూరి వేంకటేశ్వరరావు
2010
ఈ విశ్వం ఎక్కడ నుండి వచ్చింది? ఎప్పుడు పుట్టింది?
పుట్టినది గిట్టక మానదు అని చెబుతారు కనుక ఈ విశ్వం ఒకప్పుడు పుట్టి ఉంటే మరొకప్పుడు అంతం అవాలి కదా?
విశ్వం అంతం అవటం అంటే ఏమిటి? ఆ తరువాత ఏమవుతుంది?
ఈ విశ్వం పుట్టకమునుపు ఏమి ఉండేది?
ఈ విశ్వం శాశ్వతమా? అశాశ్వతమా?
సాంతమా? అనంతమా? (finite? or infinite?)
ఈ విశ్వం యొక్క స్వరూపం ఏమిటి? దీని ఆకారం ఎలా ఉంటుంది? బల్లపరుపుగా ఉంటుందా? గుండ్రంగా ఉంటుందా?
ఈ విశ్వాన్ని ఎవ్వరైనా సృష్టించేరా? సృష్టిస్తే ఆ సృష్టికర్త ఎవ్వరు?
సృష్టికార్యం అకస్మాత్తుగా జరిగిందా? ఒక రోజులో జరిగిందా?
ఆరు రోజులలో సృష్టి పూర్తిచేసేసి ఏడో రోజున విశ్రాంతి తీసుకున్నాడా ఆ సృష్టికర్త?
లేక, ఒక కల్పం పాటు సృష్టికార్యం జరిపి ఒక కల్పం పాటు విశ్రాంతి తీసుకుంటాడా (తీసుకుంటుందా)?
సృష్టికర్త బాధ్యతలు ఏమిటి? సృష్టించేసి “నీ దారి నువ్వు చూసుకో” అని విశ్వాన్ని అచ్చోసిన ఆంబోతులా వదిలెసేడా? లేక, విశ్వం యొక్క దైనందిన కార్యకలాపాలలో కలుగజేసుకుంటూ విశ్వం మంచిచెడ్డలు నిరంతరం ఆ సృష్టికర్త చూస్తున్నాడా?
దేవుడనే భావానికీ ఈ విశ్వాన్ని సృష్టించిన కర్తకీ ఏదైనా సంబంధం ఉందా? దేవుడు వేరు, సృష్టికర్త వేరూనా?
అసలు విశ్వం అంటే ఏమిటి? మన కంటికి కనిపించే సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంత వంటి క్షీరసాగరాలు, తేజోమేఘాలు, మొదలైనవే కాకుండా వాటితోపాటు వాటి వాటి లక్షణాలని నియంత్రించే ప్రకృతి శక్తులూనా? లేక, మన కంటికి కనబడని “పదార్ధాలు”, “శక్తులు” ఈ విశ్వంలో నిబిడీకృతం అయి ఉన్నాయా?
ఇటువంటి ప్రశ్నలకి ఇక్కడ సమాధానాలు వెతుకుదాం. ఈ అన్వేషణ జరిగేది ముఖ్యంగా ఆధునిక భౌతిక శాస్త్రం నిర్మించిన పరిధిలోనే జరిగినప్పటికీ, సారూప్యం చూపించటం కోసం అప్పుడప్పుడు ఈ ప్రశ్నలకి సమాధానాలు పురాతన కాలంలో ఎలా ఉండేవో చవి చూపిస్తూ ఉంటాను. కాని ముఖ్యంగా ఆధునిక శాస్త్రీయ కోణానికే ఇక్కడ ప్రాధాన్యత.
ప్రాచీన భారతీయ సంస్కృతికీ, దృక్పథానికీ, పాశ్చాత్య సంస్కృతికీ, దృక్పథానికీ మధ్య కొట్టొచ్చినట్లు చాల తేడాలు కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆధునిక విజ్ఞాన శాస్త్రం పరిణతి చెంది, పురోభివృద్ధి చెందుతూన్న దశలలో క్రైస్తవ మతాధికారులు, కేథలిక్ చర్చి అభ్యుదయ భావాలని తీవ్రంగా ఎదుర్కొన్నాయి. దీనికి కారణాలు అనేకం. క్రైస్తవ మతానిది మానవకేంద్ర దృక్పథం. మానవుడి జన్మ ఉత్కృష్టమైనదని ఒప్పుకున్నా, భారత దేశంలో పుట్టిన మతాలన్నీ కూడ సర్వభూతాలనీ మానవుడితో సమానంగానే చూశాయి. అందువల్ల విశ్వస్వరూపాన్ని అవగాహన చేసుకునే ఈ ప్రయత్నంలో ప్రాచ్య, పాశ్చాత్య భావాల మధ్య కొంత ఘర్షణ కనిపిస్తుంది. ఆధునిక శాస్త్ర విజ్ఞానంలో సింహభాగం పాశ్చాత్యుల పర్యవేక్షణలో జరిగింది కనుక వారి కోణంలో ఈ కథ చెప్పక తప్పదు. అయినా ఉండబట్టక కథని చెప్పేవాడిని నేను కనుక, కొంతవరకు సనాతన దృక్పథాన్ని చెప్పి పోలికలు చెప్పకుండా ఉండటమూ సాధ్యం కాదు. కనుక విశ్వరూపం మనకి అవగాహన అయిన వయినాన్ని ఈ రెండు కోణాలలోనూ చెప్పటానికి ప్రయత్నం చేస్తాను.
ఇంగ్లీషులో cosmology అన్న మాటని తెలుగులో “విశ్వశాస్త్రం” అనొచ్చు. కాస్మోస్ అంటే విశ్వం. ఇంగ్లీషులో universe అనే మాటని కూడ విశ్వం అన్న మాటకి పర్యాయపదంగా వాడతారు. “విస్” అనే సంస్కృత మూలానికి “వ్యాప్తి చెందేది” అనే అర్ధం ఉంది. ఈ మూలం నుండే విష్ణు శబ్దం పుట్టింది. వ్యాప్తి చెందే “విష్ణువు” విశ్వం అంతటినీ ఆక్రమించి ఉన్నాడు కనుక సర్వాంతర్యామి అయేడు. ఈ విశ్వం సమస్తాన్నీ ఆక్రమించుకుని ఉంది. కనుక “విశ్వరూపమే విష్ణువు, విష్ణురూపమే విశ్వం!” అనటం తప్పు కాదేమో!
విశ్వశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యటానికి భౌతిక శాస్త్రంలోనూ, గణిత శాస్త్రంలోనూ ఏళ్లతరబడి పరిశ్రమ చెయ్యాలి. అంత పరిశ్రమ చెయ్యలేనివారికి ఈ శాస్త్రంలోని ముఖ్యాంశాలని జనరంజక శైలిలో చెప్పాలనే కోరికతో ఈ వ్యాసాలని ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఎంత జనరంజక శైలి అయినా కొద్దో, గొప్పో శాస్త్రంతో పరిచయం ఉంటే తప్ప “భావ సూక్ష్మతలు” (conceptual subtleties) అప్పుడప్పుడు అర్ధం కావు. అందుకని సందర్భోచితంగా అక్కడక్కడ కొంచెం పాఠం చెప్పటం కూడ జరిగింది.
“ఈ విశ్వం ఎంతో పెద్దది, ఎంతో పురాతనమైనది” అన్న విషయం పాశ్చాత్యులకి ఈ మధ్యనే అవగాహన అయింది. మొన్నమొన్నటి వరకు పాశ్చాత్యులు సృష్టి జరిగి 5,000 సంవత్సరాలు మాత్రమే అయిందని నమ్మేవారు. కాని భారతీయ పురాణాలలో సృష్టి ఎంత పురాతనమైనదో వర్ణించే కథలు ఎన్నెన్నో ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధ రంగంలో కృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం చూపిస్తాడు. ఆ విశ్వరూపం వర్ణన చదివిన వారికి విశ్వం అంటే ఏమిటో కొద్దో, గొప్పో అవగాహన ఉండి తీరుతుంది. మనం ఇక్కడ చేస్తూన్నదల్లా అధునాతన శాస్త్రీయ దృక్పథంతో విశ్వస్వరూపాన్ని ఆకళింపు చేసుకోటానికి చిన్న ప్రయత్నం.
ఈ వ్యాస పరంపర చదివే ముందు ఒక విషయం గుర్తు పెట్టుకొండి. విశ్వం గురించి పెద్ద ఎత్తున, అధునాతన దృక్పథంతో పరిశోధన మొదలయి పూర్తిగా అర్ధ శతాబ్దం కూడ అయి ఉండదు. రోజుకో కొత్త వార్త, కొత్త సిద్ధాంతం! కొన్ని సిద్ధాంతాలు కాలప్రవాహపు తాకిడికి తట్టుకుని నిలబడగలుగుతున్నాయి. కొన్ని సిద్ధాంతాలు వీగిపోయి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. పస లేక వీగిపోయాయనుకున్న సిద్ధాంతాలు కొన్ని ప్రాణం పోసుకుని మళ్లా తలెత్తుతున్నాయి. కనుక ఈ వ్యాసాలలని చదివిన తరువాత “ఇదే వేదం” అని నమ్మేయకండి.
ఉదాహరణకి ఈ విశ్వం ఒక పెను పేలుడులో (Big Bang) పుట్టిందని చాలామంది ఒప్పుకుంటున్నారు. ఆ పేలింది ఏమిటో ఇదమిద్ధంగా తెలియదు. ఆ పేలుడు ఎప్పుడు జరిగింది అన్న విషయంలో కూడ తీవ్రమైన బేధాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు 8 బిలియను సంవత్సరాల క్రితమే అని అంటున్నారు. మరి కొందరు 20 బిలియను సంవత్సరాల క్రితం అంటున్నారు. ఆదిలోనే అభిప్రాయ బేధాలు ఉన్న ఈ శాస్త్రంలో ఇంకా ఎన్నో వాదోపవాదాలు ఉన్నాయి. ఇదే విధంగా విశ్వం ఎంత పెద్దదో కూడ మనకి పరిపూర్ణంగా అవగాహన కాలేదు. అసలు ఈ విశ్వం తయారీలో వాడబడ్డ ఘటక ద్రవ్యాలు (ingredients) ఏమిటో అన్న విషయం మీద కూడ ఏకీభావం లేదు. పెను పేలుడు జరిగిన తరువాత, “తత్తక్షణ ఉత్తర క్షణాలలో” (in the moments immediately afterwards), ఏమయిందో మనకి ఇంకా అంతుబట్టటం లేదు. ఈ విశ్వం ఎలా లయ పొందుతుందో కూడ తెలియదు. నిజానికి మన చుట్టుపట్ల ఉన్న క్షీరసాగరాలని దాటి దూరం వెళుతూన్న కొద్దీ అక్కడ విశ్వస్వరూపం ఎలా ఉంటుందో మనకి బాగా తెలియదు. మన చుట్టూ - మనకి దగ్గరగా ఉన్న - విశ్వాన్నయినా అంతా “చూడ” గలుగుతున్నామా లేక మన పక్కనే మన కంటికి కనపడకుండా అదృశ్య పదార్ధాలు, అదృశ్య శక్తులు ఏమయినా ఉన్నాయా అన్న విషయం కూడ మనకి పరిపూర్ణంగా తెలియదు. విశ్వం గురించి మనకి తెలియని మహా సింధువుతో పోల్చితే మనకి తెలిసినది, నేను ఇక్కడ చెప్పబోయేది కేవలం బిందు ప్రమాణం.
నెల నెలా వచ్చే ఈ వ్యాసాలు సులభ గ్రాహ్యంగా ఉండాలంటే ఏ వ్యాసానికి ఆ వ్యాసం స్వయంపూర్ణంగా, స్వయంసమృద్ధిగా, స్వయంవివరణాత్మకంగా నిలబడగలగాలి. అలా రాయాలంటే ఒక చోట చెప్పిన విషయాన్నే మరొక చోట చెప్పవలసి వస్తుంది. చెప్పే విషయం క్లిష్టమైనది కనుక ఈ చర్వితచర్వణం వల్ల పునరుక్తి దోషం ఉండదనే అనుకుంటున్నాను.
ఈ వ్యాసాలలోని పదార్ధం కొంత అంతర్జాల పత్రికలలోనూ, అచ్చుపత్రికలలోనూ, నా బ్లాగు “లోలకం” లోనూ ఒక సారి ప్రచురించటం జరిగింది. ఆ విషయాన్ని ఈ వ్యాస పరంపరకి అనుకూలంగా మార్చి, అవసరమయితే తిరగరాసి, ఇక్కడ వాడుకోవటం జరిగింది. అంతేకాదు. ఈ వ్యాసాలలో నేను చెప్పిన విషయాలన్నీ నేను విద్యార్ధిగా ఉన్నప్పుడు, అటుతరువాత, పుస్తకాలు చదివి నేర్చుకున్నవే తప్ప నేను స్వంతంగా సృష్టించినది ఏదీ లేదు. నేను సంప్రదించిన గ్రంధాల పేర్లు ఈ దిగువ చూపిస్తున్నాను. అదే విధంగా చాలమట్టుకి బొమ్మలు కూడ అంతర్జాలం (Internet) నుండి సేకరించినవే. నేను చేసినదల్లా ఇంగ్లీషులో ఉన్న విషయాన్ని సేకరించి, సంగ్రహించి, తిరిగి తెలుగులో నా మాటలలో చెప్పటమే.
“తెలుగులో సైన్సుని రాయటం ఎందుకు? ప్రపంచం అంతా ఇంగ్లీషు మార్గం వెంబడి పోతూన్నప్పుడు, ఉద్యోగాలకి ఇంగ్లీషు అత్యవసరం అయిపోతూన్న ఈ రోజుల్లో, తెలుగుని పట్టుకుని పాకులాడటం ప్రగతికి ప్రతిబంధకం కాదా?” అని నన్ను నిలదీసి అడిగిన వాళ్లకి ఓపిగ్గా సమాధానాలు చెప్పిన రోజులు ఉన్నాయి. ఇప్పుడా ఓపిక లేదు. నా సరదాకి నేను రాసుకున్నాను. మీకు సరదా ఉంటేనే చదవండి. కథనం నడిపించినప్పుడు సాధ్యమయినంత వరకు తెలుగు మాటలని కాని, సంస్కృతం నుండి దిగుమతి అయిన మాటలని కాని వాడి తెలుగు వాక్యాలు నిర్మించటానికే ప్రయత్నం చేసేను. ఓక భావాన్ని తెలుగులో వ్యక్తపరచటం కష్టమనిపించినప్పుడు (ఇది ఒక్క సారే జరిగింది) ఆ పక్కన కుండలీకరణాలలో పూర్తి ఇంగ్లీషు వాక్యం రాసి చూపించేను. నా పిచ్చి నాకు ఆనందం కావచ్చు కాని అందరికీ ఈ గోల అర్ధం అవకపోవచ్చు. అందుకని సాంకేతిక భావాలకి తెలుగు మాటలు వాడినప్పుడల్లా మూలంలో ఉన్న ఇంగ్లీషు మాటలని, వెనువెంటనే, కుండలీకరణాలలో రాసి చూపించేను. వ్రతం చెడ్డా ఫలం దక్కాలి కదా!
సంప్రదించిన మూలాలు
• http://news-service.stanford.edu/pr/95/950509Arc5236.html
• MIRA, Life and Death of a Photon, http://www.mira.org/museum/photon.htm
• Wikipedia, http://en.wikipedia.org/wiki/Shape_of_the_Universe
• Patricia Schwarz, http://www.superstringtheory.com/index.html
• V. Vemuri, http://www.lolakam.blogspot.com
• వేమూరి వేంకటేశ్వరరావు, “ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది?,” ఈమాట, http://www.eemaata.com/em/, సెప్టెంబరు 2009
• M. S. Turner, “The Universe,” Scientific American, September 2009
• J. Frieman, M. S. Turner and D. Huerter, Dark Energy and Accelerating Universe, 2008, available online at arxiv.org/abs/0803.0982
• Andy Fell, “Cosmic Convergence,” UC Davis Magazine, pp 14-19, Spring, 2008.
• N. D. Tyson, Death by Black Hole and other Cosmic Quandaries, W. W. Norton and Company. New York, 2007.
• M. Riordan and W. A. Zajc, “The First Few Microseconds,” Scientific American, May, 2006
• Loeb, “The Dark Ages of the Universe,” Scientific American, November, 2006
• Lisa Randall, Warped Passages : Unraveling The Mysteries of The Universe's Hidden Dimensions, Ecco, 2005.
• వేమూరి వేంకటేశ్వరరావు, “ప్రకృతిలో చతుర్విధ బలాల బలాబలాలు,” ఈమాట, http://www.eemaata.com/em/, సెప్టెంబరు, 2005.
• R. Bousso and J. Polchinski, “The String Theory Landscape,” Scientific American, September, 2004
• Paul Halpern, The Great Beyond, John Wiley & Sons, Hoboken, NJ, 2004.
• G. Veneziano, “The Myth of the Beginning of Time,” Scientific American, May, 2004
• వేమూరి వేంకటేశ్వరరావు, అంకెలు, సంఖ్యలు: లెక్కకు అందని కాలమానం, ATA Souvenir, July 2004
• A. Guth, The Inflationary Universe, Basic, 1998
• V. Vemuri, “The Geometry of the Universe,” Science Reporter, pp 30-31, August. 1996. (Published by National Institute of Science Communication, New Delhi, India. Also available at http://www.cs.ucdavis.edu/~vemuri/EnglishPopularScience.htm
• Robert Osserman, Poetry of the Universe: A mathematical exploration of the Cosmos, Doubleday, New York, 1996
• E. W. Kolb and M. S. Turner, The Early Universe, Westview Press, 1994
• వేమూరి వేంకటేశ్వరరావు, బ్లేక్ హోలు అంటే ఏమిటి?, విద్యార్ధి చెకుముకి, pp 40-43, మే, 1993, Also in Rachana, pp 55-56, Feb. 1993
• వేమూరి వేంకటేశ్వరరావు, అన్వేషణ, స్వాతి మాసపత్రిక, pp 8-15, 1991
• S. Weinberg, The First Three Seconds, Basic, 1977
• Robert Jastrow and Malcolm Thomson, Astronomy: Fundamentals and Frontiers, Third Edition, John Wiley, 1972
• Heinrich Zimmer, Maya: Der Indische Mythos, 1936.
Subscribe to:
Posts (Atom)